MLC Kavitha Counter : ఓ అన్న తొందరపడకు.. లిక్కర్ స్కామ్ ఆరోపణలపై కవిత కౌంటర్
Kavitha On Delhi Liquor Scam : దిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ ఛార్జిషీట్ లో ఎమ్మెల్సీ కవిత పేరును చేర్చిన విషయం తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. వాటి మీద కవిత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
దిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor Scam) దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇందులో ఈడీ ఎమ్మెల్సీ కవిత పేరు కూడా ప్రస్తావించింది. దీనిపై ప్రతిపక్షలు విమర్శలు చేస్తున్నాయి. తాజాగా బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓ వార్త క్లిప్పింగ్ షేర్ చేశారు. లిక్కర్ క్వీన్.. 28 సార్లు ఛార్జిషీట్ లో ప్రస్తావించారని ట్వీట్ చేశారు. దీనిపై ఎమ్మెల్సీ కవిత ఘాటుగా స్పందించారు.
ట్రెండింగ్ వార్తలు
'రాజగోపాల్ అన్న తొందరపడకు , మాట జారకు !! " 28 సార్లు " నా పేరు చెప్పించినా.. "28 వేల సార్లు" నా పేరు చెప్పించినా..అబద్ధం నిజం కాదు.. #TruthWillPrevail.. అంటూ ట్వీట్ చేశారు.
ఆ తర్వాత కాంగ్రెస్ నేత(Congress Leader) మాణిక్యం ఠాగూర్ కు కవిత రిప్లై ఇచ్చారు. 'నాపై నిందలు పూర్తిగా బోగస్, అవాస్తవం. నా నిబద్ధతను కాలమే రుజువు చేస్తుంది. రైతు వ్యతిరేక, పెట్టుబడిదారులకు అనుకూల విధానాలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎండగడుతుండడంతో బీజేపి భయపడుతున్నది.' అని కవిత రిప్లై ఇచ్చారు.
దిల్లీ మద్యం కుంభకోణంలో కవిత పేరు ఉండటం కలకలం రేపుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు అత్యధికంగా లబ్ధి పొందిన వారిలో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) కూడా ఒకరు అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. దిల్లీ లిక్కర్ కేసులో ఈడీ వేసిన మరో ఛార్జి షీట్లో కీలక విషయాలను ప్రస్తావించింది. సమీర్ మహేంద్రు కేసులో దాఖలు చేసిన ఈ ఛార్జి షీట్లో కవితతోపాటుగా వైసీపీ ఎంపీ మాగుంట శీనివాస్ రెడ్డి, అతడి కుమారుడు రాఘవ్ రెడ్డి, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి పాత్రలను చెప్పింది. అయితే ఈ కేసులో బోయినపల్లి అభిషేక్, బుచ్చిబాబు, అరుణ్పిళ్లై ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే ఛార్జ్షీట్ దాఖలు చేసినట్టు కోర్టుకు తెలిపింది.
ఇండోస్పిరిట్స్ సంస్థ అసలు భాగస్వాములు మాగుంట రాఘవ్రెడ్డి, కవిత అని ఈడీ కోర్టుకు చెప్పింది. ఈ సంస్థకు ఎల్ 1 కింద వచ్చిన షాపుల్లో కవితకు సైతం వాటా ఉందని ఈడీ పేర్కొంది. ఇండో స్పిరిట్లో రామచంద్ర పిళ్లై వెనక ఉన్నది కవిత అని ఈడీ(ED) తెలిపింది. మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవ్ రెడ్డి తరఫున ప్రేమ్ రాహుల్ పనిచేస్తున్నారని వెల్లడించింది. రిటైల్లో 14 కోట్ల బాటిళ్లను విక్రయించడం ద్వారా కనీసం రూ. 195 కోట్ల సంపాదించినట్టుగా ఈడీ పేర్కొంది.
పైన చెప్పిన ముగ్గురి నియంత్రణలో ఉన్న సౌత్ గ్రూప్ నుంచి విజయ్ నాయర్ కు 100 కోట్ల ముడుపులు ఇచ్చారని ఈడీ ఆరోపించింది. ఇదంతా ఆప్ నేతల మధ్య కుదిరిన డీల్ గా వెల్లడించింది. ఇందులో భాగంగానే ముందస్తుగా 100 కోట్లు చెల్లించినట్టుగా పేర్కొంది. ఈ వంద కోట్ల వసూలుకు వీలుగానే.. ఇండోస్పిరిట్ లోని 65 శాతం వాటను సౌత్ గ్రూప్ నుకు ఇచ్చినట్టుగా ఈడీ చెబుతోంది. ఈ వాటను అరుణ్ పిళ్లై, ప్రేమ్ రాహుల్ అనే బినామీలతో నడిపించారని ఛార్జ్ షీట్లో ఈడీ తెలిపింది.
కవిత పేరు లిక్కర్ స్కామ్(Kavitha Name In Liquor Scam) లో రావడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అధికారులు ఛాయ్ బిస్కెట్లు తినడానికి రాలేదని ఇప్పటికే బండి సంజయ్(Bandi Sanjay) కామెంట్ చేశారు. ఎన్నో వ్యాపారాల్లో కవిత పెట్టుబడులు ఉన్నాయని.. ఆరోపిస్తున్నారు. ప్రతిపక్ష నేతల విమర్శలకు కవిత స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ వస్తున్నారు. కావాలనే బీజేపీ దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతుందని అంటున్నారు.