MLA Jagga Reddy: కవిత, BL సంతోష్ ను అరెస్ట్ చేస్తేనే అసలు బాగోతం బయటపడుతుంది..-mla jaggareddy comments on kavitha and bl santhosh ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Mla Jaggareddy Comments On Kavitha And Bl Santhosh

MLA Jagga Reddy: కవిత, BL సంతోష్ ను అరెస్ట్ చేస్తేనే అసలు బాగోతం బయటపడుతుంది..

HT Telugu Desk HT Telugu
Dec 02, 2022 06:04 PM IST

MLA Jagga Reddy Comments: లిక్కర్ కేసులో కవితను, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఎల్ సంతోష్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. అప్పుడే అసలు బాగోతం బయటికి వస్తుందని చెప్పారు.

ఎమ్మెల్యే జగ్గారెడ్డి
ఎమ్మెల్యే జగ్గారెడ్డి

MLA Jagga reddy Comments on TRS and BJP: టీఆర్ఎస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఎల్ సంతోష్ ను అరెస్ట్ చేయాలన్నారు. కోర్టుల ద్వారా బీఎల్ సంతోష్ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

ట్రెండింగ్ వార్తలు

బీఎల్‌ సంతోష్‌ను కాపాడేందుకు బీజేపీ ‍ప్రయత్నిస్తోందన్నారు జగ్గారెడ్డి. టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు డ్రామాలు చేస్తున్నారని చెప్పారు. వారిద్దరినీ తక్షణమే అరెస్ట్ చేసి, వాస్తవాలు వెలికితీయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. లేకపోతే ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ భారీ ఉద్యమం చేస్తామని వెల్లడించారు.

కవిత పైకి విచారణకు సిద్ధమని చెబుతున్నప్పటికీ లోపల భయపడుతుందని చెప్పారు. తాము కవితపై ఆరోపణలు చేయటం లేదని... సీబీఐ ప్రస్తావించిన అంశాన్ని చెబుతున్నామని అన్నారు. లిక్కర్ కేసు కంటే... ఎమ్మెల్యేల ఎర కేసు చాలా పెద్దదని వ్యాఖ్యానించారు. బీఎల్ సంతోష్ రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని ఘాటుగా మాట్లాడారు. ఓటు హక్కును కించపరిచే విధంగా బీజేపీ ప్రభుత్వం చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వాలను పడగొట్టే దిశగా ఆలోచిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను భర్తీ చేయాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 25 లక్షలకు పైగా నిరుద్యోగులు ఉన్నారని… ఈ నేపథ్యంలో వెంటనే ఖాళీలను భర్తీ చేయాలని… ఆలస్యం చేయవద్దని కోరారు. ఈ మధ్య కాలంలో కొన్ని ప్రకటనలు చేస్తున్నప్పటికీ… మరిన్ని కూడా విడుదల చేయాలన్నారు. ప్రభుత్వం మంచి పనులు చేస్తే సమర్థిస్థామన్నారు. ఇక టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోందని.. ఈ విషయంపై సర్కార్ దృష్టిపెట్టాలన్నారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలని కోరారు. టీచర్ల ప్రమోషన్ల అంశాన్ని త్వరగా పరిష్కరించాలన్నారు.

వైఎస్ షర్మిల పాదయాత్రపై స్పందించిన జగ్గారెడ్డి… త్వరలోనే అన్నీ విషయాలను బయటపెడతానని చెప్పారు. ఓ డిబేట్ లో మాట్లాడిన షర్మిల… తనపై ఇష్టానుసారంగా మాట్లాడారని.. త్వరలోనే బదులిస్తానని క్లారిటీ ఇచ్చారు. ఆమె కంటే ఎక్కువ తాను మాట్లాడగలను అంటూ చెప్పారు.

IPL_Entry_Point