త్రివిధ దళాలకు సెల్యూట్.. నా అవసరం ఏ మాత్రం ఉన్నా యుద్ధానికి వెళ్తా : మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి-minister uttam kumar reddy makes it clear that he is ready to go to war with pakistan ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  త్రివిధ దళాలకు సెల్యూట్.. నా అవసరం ఏ మాత్రం ఉన్నా యుద్ధానికి వెళ్తా : మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి

త్రివిధ దళాలకు సెల్యూట్.. నా అవసరం ఏ మాత్రం ఉన్నా యుద్ధానికి వెళ్తా : మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి

ప్రస్తుతం అందరి దృష్టి.. భారత్-పాక్ యుద్ధంపైనే ఉంది. ఏ ఇద్దరు కలిసినా.. ఈ అంశంపైనే చర్చించుకుంటున్నారు. యుద్ధం వస్తే పరిస్థితి ఎలా ఉంటుందోనని మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి సమయంలో.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తన అవసరం ఏ మాత్రం ఉన్నా.. యుద్ధానికి వెళ్తానని స్పష్టం చేశారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి

భారత్‌లో 24 నగరాలను టార్గెట్‌ చేసిన పాక్‌.. గురువారం రాత్రి 500 డ్రోన్లతో దాడులకు తెగబడింది. సరిహద్దు రాష్ట్రాల నగరాలే టార్గెట్‌గా దాడులు చేస్తోంది. పాక్‌ డ్రోన్లను గగనతలంలోనే భారత్‌ పేల్చేసింది. అటు సరిహద్దు రాష్ట్రాల్లో భద్రతను మరింత పెంచాలని కేంద్రం సూచించింది. అన్ని రాష్ట్రాలకు సీఎస్‌కు ప్రత్యేకమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

త్రివిధ దళాలకు సెల్యూట్..

'త్రివిధ దళాలకు మా సెల్యూట్. ఒక్క పౌరుడు గాయపడకుండా దాడులు చేశారు. ఏ ప్రభుత్వం ఉన్నా బుద్ధిచెప్పడం తప్పనిసరి. మన రాఫెల్‌ యుద్ధ విమానాలను ఎక్కడా కూల్చలేదు. పాకిస్తాన్‌ అబద్ధాలు చెబుతోంది. యుద్ధం మొదలైతే పాకిస్తాన్‌ పతనమే. పాక్‌ విచ్ఛిన్నమడం ఖాయం. యుద్ధంలో మూడో దేశం ఎప్పుడూ ముందుకు రాదు' అని ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు.

యుద్ధానికి వెళ్తా..

'పీవోకేను ఇండియా స్వాధీనం చేసుకోవాలి. పీవోకే నుంచి పాక్‌ను ఖాళీ చేయడమే సమస్యకు పరిష్కారం. మన జోష్‌ చూసి పాక్‌ ఎదుర్కొనే ధైర్యం చేయదు. యుద్ధం మొదలైతే నేను కూడా పాల్గొంటా. నా అవసరం ఏ మాత్రం ఉన్నా యుద్ధానికి వెళ్తా' అని మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

కంట్రోల్ రూమ్ ఏర్పాటు..

అటు ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. సరిహద్దు రాష్ట్రాల్లోని తెలంగాణ వాసుల కోసం.. కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసింది మన ప్రభుత్వం. కంట్రోల్‌ రూమ్‌ నెంబర్‌- 011-23380556 అని అధికారులు వెల్లడించారు. ఈ నంబర్‌కు కాల్ చేస్తే.. సాయం చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

భద్రత కట్టుదిట్టం..

అటు ఇస్రో కేంద్రాల దగ్గర హై అలర్ట్‌ ప్రకటించారు. శ్రీహరికోట, బెంగళూరు సహా 11 కేంద్రాల్లో అలర్ట్‌ ప్రకటించారు. పాక్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేశారు. ఇస్రో కేంద్రాల దగ్గర సీఐఎస్ఎఫ్ సిబ్బంది సంఖ్యను పెంచారు. ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కోవడానికి సింసిద్ధంగా ఉన్నామని.. సీఐఎస్ఎఫ్ స్పష్టం చేసింది.

జవాన్ మృతి..

జమ్ముకశ్మీర్‌లో తెలుగు జవాన్‌ మృతిచెందారు. పాక్‌ కాల్పుల్లో జవాన్‌ మురళీ నాయక్‌ మృతిచెందారు. మురళీ నాయక్‌ స్వస్థలం శ్రీసత్యసాయి జిల్లా కల్లి తండా. శనివారం స్వస్థలానికి మురళీ నాయక్‌ మృతదేహం వచ్చే అవకాశం ఉంది. ఆయన మృతిపట్ల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ సీఎం వైఎస్ జగన్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ విచారం వ్యక్తం చేశారు.

సంబంధిత కథనం