తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం ఇచ్చిన జీవో 9పై హైకోర్టు స్టే విధించింది. దీంతో ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడినట్లు అయింది. అయితే ఈ తీర్పు విషయంలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. బీసీలను మోసం చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామా చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా తీర్పుపై రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. హైకోర్టు స్టే విధిస్తుందని అనుకోలేదన్నారు.
“హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కాపీ అందిన తరువాత చట్టపరంగా, న్యాయపరంగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. ప్రభుత్వం తరుపున బలమైన వాదనలు వినిపించడం జరిగింది. ప్రభుత్వం కుల సర్వే నిర్వహించి ,డెడికేటెడ్ కమిషన్ వేసి ,సబ్ కమిటీ వేసి కేబినెట్ ఆమోదించించింది. శాసన సభలో చట్టం చేసి గవర్నర్ గారికి పంపడం జరిగింది. 2018 పంచాయతీ రాజ్ చట్ట సవరణ చేశాం. స్థానిక సంస్థల ఎన్నికలు జరపకపోవడం వల్ల కేంద్రం నుండి రావాల్సిన నిధులు రావడం లేదు. హైకోర్టు స్టే విధిస్తుందని అనుకోలేదు” అని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం పునరుద్ఘాటించారు. సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీలు హైకోర్టులో ఎందుకు ఇంప్లీడ్ కాలేదో జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నాయక్వతంలో సామాజిక న్యాయంతో ఎన్నికలకు వెళ్తామని చెప్పారు.
సంబంధిత కథనం