గత బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర పూరితంగా పార్ట్ -బిలో పెట్టిన 18 లక్షల ఎకరాల్లో.. ఆరు నుంచి ఏడు లక్షల వరకు వ్యవసాయ భూములు ఉన్నాయని.. ఈ భూములకు భూభారతి చట్టంతో పరిష్కారం చూపిస్తామని.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం ములుగు జిల్లా వెంకటాపూర్లో మంత్రులు కొండా సురేఖ, సీతక్కతో కలిసి భూభారతి పైలెట్ ప్రాజెక్టును పొంగులేటి ప్రారంభించారు. తర్వాత ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలం పుసాయ్ గ్రామంలో భూభారతి చట్టంపై జరిగిన అవగాహన కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. 'పేదల కన్నీటిని తూడ్చేందుకే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చాం. ఎన్నికలకు ముందు ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని మేము ఇచ్చిన హామీని ప్రజలు విశ్వసించి.. ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు. ఇందిరమ్మ రాజ్యంలో భూ సమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యంగా పనిచేస్తాం' అని మంత్రి స్పష్టం చేశారు.
'ప్రజలను ఇబ్బంది పెట్టకుండా రైతులకు సేవలు అందిస్తాం. రైతులు తమ భూ సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే చెప్పులు అరిగేలా అధికారుల చుట్టూ, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగారు. ఇప్పుడు ఇంకా ఆ అవసరం రైతులకు లేదు. అధికారులే రైతుల వద్దకు వచ్చి వారి భూ సమస్యలను పరిష్కరిస్తారు' అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు.
'ధరణిపై గత పాలకులు ఏనాడు కూడా రెవెన్యూ సదస్సు పెట్టలేదు. ఒకవేళ రెవెన్యూ సదస్సులు పెట్టి ఉంటే.. ఆనాడే ఆ ప్రభుత్వం పై ప్రజలు తిరగబడేవారు. గత బీఆర్ఎస్ పాలకులు చేసిన తప్పులను ఇప్పటికీ గ్రహించడం లేదు. వారికి జ్ఞానోదయం కావడం లేదు. గతంలో గులాబీ దళం కోసం కేసీఆర్ 2020- ధరణి చట్టాన్ని తీసుకువస్తే.. మేం దానిని బంగాళాఖాతంలోకి విసిరేసి.. సామాన్య ప్రజల కోసం 2025- భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చాం' అని మంత్రి వివరించారు.
'రాష్ట్రంలో ఇంతవరకు డాక్యుమెంట్లు లేని అబాదీ ఇల్లు అని పిలుచుకునే నివాసగృహాలకు డాక్యుమెంట్లు ఇచ్చే దిశగా చర్యలు చేపడుతున్నాం. ధరణి దళారులు, గులాబీ పార్టీ గులాములు ఇచ్చే డబ్బుతో.. ఇందిరమ్మ ప్రభుత్వాన్ని పడగొడితే మీరు ఊరుకుంటారా?' అని మంత్రి పొంగులేటి ప్రశ్నించారు. దీంతో 'ఊరుకోబోం' అని ప్రజల నుంచి స్పందన వచ్చింది.
'భూ భారతి సమస్యల పరిష్కారానికి తమ కార్యాలయం, సీసీఎల్ఏ కార్యాలయాన్ని అనుసంధానించే టోల్ఫ్రీ నెంబరును త్వరలో ప్రజలకు తెలియజేస్తాం. గిరిజన, గిరిజనేతరులు ఉండే ప్రాంతంలో భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి కేంద్రప్రభుత్వ నిబంధనలకు లోబడి ఒక కమిటీని నియమిస్తాం' అని మంత్రి పొంగులేటి వెల్లడించారు.
సంబంధిత కథనం