అర్హులైన జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందజేస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.గ్రామీణ ప్రాంతాల్లో పని చేసే నిరుపేదలైన జర్నలిస్టులతో పాటు… వృత్తి నిర్వహణలో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందన్నారు.
విధి నిర్వహణలో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలతో పాటు పలువురు జర్నలిస్టులకు నాంపల్లి లోని ప్రెస్ అకాడమీ కార్యాలయంలో పెన్షన్ మరియు ఎక్స్ గ్రేషియా చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ… ఈ నెల చివరిలోగా ప్రెస్ అకాడెమీ భవనం ప్రారంభిస్తామని చెప్పారు.
మండల, నియోజకవర్గ స్థాయిలో పని చేస్తున్న జర్నలిస్టులను ఆదుకోవడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని వివరించారు. మంచిని మంచిగా, నిజాన్ని నిర్భయంగా సమాజానికి తెలియజేయడానికి ఎంతో మంది జర్నలిస్టులు ఆణిముత్యాలుగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. జర్నలిస్ట్ వృత్తిని నమ్ముకుని జీవితమంతా ఆ వృత్తికే అంకితం అయినవాళ్ళు ఎంతోమంది ఉన్నారని గుర్తు చేశారు. ఆనాటి ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన ప్రెస్ అకాడమీ భవనాన్ని…. చిన్న చిన్న మరమత్తులు పూర్తి చేసుకుని ఈ నెల చివరిలోగా ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
విడతల వారీగా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 42 కోట్లను ఫిక్స్ డిపాజిట్ చేశామని… దానిపై వచ్చే వడ్డీని జర్నలిస్టుల సంక్షేమం కోసం అకాడమి ఖర్చు పెడుతుందని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇప్పటివరకు రూ.22 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు.
మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు చెందిన 597 మందికి రూ.1,00,000 తో పాటు అయిదు సంవత్సరాల వరకు నెలకు రూ.3000 చొప్పున పెన్షన్ ఇస్తున్నట్లు తెలిపారు. వారి పిల్లలకు ట్యూషన్ ఫీజుల క్రింద 1 నుంచి 10వ తరగతి వరకు నెలకు రూ. 1,000 చొప్పున గరిష్టంగా ఇద్దరికి అందించడం జరుగుతుందన్నారు.
మరోవైపు ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ లో వేగం పెంచే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఇందిరమ్మ కమిటీలు ఇచ్చిన జాబితాను అధికారులు పరిశీలిస్తున్నారు. అర్హులైన వారిని మాత్రమే గుర్తించి… లబ్ధిదారుల జాబితాను విడుదల చేయనున్నారు. అనర్హులు ఉంటే లిస్ట్ నుంచి తొలగించనున్నారు.
ఇందిరమ్మ కమిటీలు అందించిన జాబితాను అధికారులు క్షేత్ర స్థాయిలో తనిఖీ చేయనున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు ప్రకారం అర్హులో కాదో తేల్చుతున్నారు. అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లకు అనర్హులని తేలితే ఇళ్ల నిర్మాణం మధ్యలో ఉన్నా సరే రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం నుంచి సాయం అందితే కూడా వెనక్కి తీసుకునేలా ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక ఇంటి విస్తీర్ణం 600 చదరపు అడుగులు మించకూడదని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతకుమించి నిర్మాణం చేస్తే… డబ్బులు జమ కావని పేర్కొంది.
సంబంధిత కథనం