Minister KTR On Houses: సొంత జాగలో ఇంటికి 3 లక్షలు.. డిసెంబర్ లోనే ప్రారంభం
double bed room houses scheme in telangana: డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీపై మంత్రి కేటీఆర్ సమీక్షించారు. మంగళవారం సిరిసిల్లలో పర్యటించిన ఆయన... అర్హులైన అందరికీ ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పారు. సొంత జాగలో ఇంటికి 3 లక్షలు ఇస్తామని... వచ్చే నెల నుంచి ప్రక్రియ ప్రారంభమవుతుందని వెల్లడించారు.
Minister KTR on Double Bed room Houses: డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీపై మంత్రి కేటీఆర్ కీలక ఆదేశాలు ఇచ్చారు. సంక్రాంతి నాటికి డబల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు పూర్తిచేయాలన్నారు. అర్హులందరికీ ఇండ్లు వచ్చేలా చూడాలని... దేశంలోనే డబుల్బెడ్ రూం ఇండ్లను నిర్మించి పేదలకు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని స్పష్టం చేశారు.
ట్రెండింగ్ వార్తలు
మంగళవారం సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన ఆయన... అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. సొంత జాగలో ఇల్లు కట్టుకొనేందుకు రూ.3 లక్షలు ఇస్తామన్న ప్రతిపాదనల మేరకు, నియోజకవర్గాలవారీగా శాసనసభ్యులు లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియ చేపడుతున్నట్టు మంత్రి పేర్కొన్నారు. ఈ పథకాన్ని ప్రభుత్వం డిసెంబరులో ప్రారంభించనుందని వెల్లడించారు.
నిర్మాణాలు జరగని గ్రామాల్లో రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు మంత్రి కేటీఆర్. రూ.5.04 లక్షల పథకం మంజూరు కాని వారిని రూ.3 లక్షల పథకంలో అర్హులుగా గుర్తించాలని సూచించారు. ‘మన ఊరు- మన బడి’ పనుల పురోగతిపై జిల్లా అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.... జిల్లాలో ఇళ్ల పంపిణీని ఏడాదిలోగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. గురుకులాల సంఖ్యను 200 నుంచి వెయ్యికి పెంచిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని తెలిపారు. రాజన్న సిరిసిల్ల వంటి జిల్లాకు ఎనిమిదేళ్లలో మెడికల్, ఇంజినీరింగ్, వ్యవసాయ, నర్సింగ్ కళాశాలలను మంజూరు చేసినట్లు వివరించారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపట్టిన ఘనత మన ప్రభుత్వానిదే అని మంత్రి చెప్పుకొచ్చారు. విద్య, వైద్యం, సాగు, తాగునీరు, విద్యు త్తు, సంక్షేమ రంగాల్లో దేశానికే తలమానికంగా నిలిచిందన్నారు. సమీక్ష అనంతరం వేములవాడ మండలం అగ్రహారంలోని చీర్లవంచ ఆర్అండ్ఆర్ కాలనీలోని మండల పరిషత్, జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో ‘మన ఊరు-మన బడి’ కింద చేపట్టిన పనులను పరిశీలించారు మంత్రి కేటీఆర్. పనులు జరుగుతున్న తీరును ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 1.29 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాయి. అయితే లబ్ధిదారుల ఎంపిక జరగకపోవటంతో ఆ ఇళ్లలో గృహప్రవేశాలు లేకుండాపోయిన సంగతి తెలిసిందే. నామమాత్రంగా కొన్ని చోట్ల అధికారికంగా ఇళ్లను కేటాయించటం తప్ప మిగతా చోట్ల అవి ఖాళీగానే ఉన్నాయి. ఇప్పుడు అధికారికంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించింది ప్రభుత్వం. కొద్దిరోజుల కిందటే సీఎస్ కూడా ఉన్నతస్థాయి సమావేశం నిర్ణయించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కూడా ఇండ్ల పంపిణీ ప్రక్రియ త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది.