Politicians Panchangam: పంచాంగం చెప్పిన KTR, బండి సంజయ్.. ఇక్కడ కూడా వదల్లేదు కదా..!
KTR vs Bandi Sanjay Panchangam: ఉగాది పండగ వేళ... తెలంగాణ రాజకీయ నేతలు పంచాగం చెప్పేశారు. తనదైన స్టైల్ లో మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పంచాగం రాసుకువస్తే... అంతే ధీటుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేశారు.
Telangana Leaders Panchangam: ఉగాది.... అంటే పంచాంగం గుర్తుకువస్తుంది. నూతన సంవత్సరానికి కేరాఫ్ అయిన ఈ పండగ వేళ..... తెలంగాణ రాజకీయ నేతలు పంచాంగాన్ని కూడా ప్రత్యర్థులపై అస్త్రాలుగా మలిచేశారు. ప్రత్యర్థులను ఇరుకునపెట్టేలా సెటైర్లు విసిరారు. ఇదీ కాస్త తెలంగాణ రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇందుకు సంబంధించిన ట్వీట్లపై కూడా నెటిజన్లు తమదైన స్టైల్ లో స్పందిస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు
అసలు విషయానికొస్తే… ఉగాది పండగ వేళ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. పంచాంగంలో ఉండే మాదిరిగా ఆదాయం, వ్యయం, అవమానం, రాజ్యపూజ్యం అంటూ పలు అంశాలను ప్రస్తావించారు. ఓ రకంగా బీజేపీని ఇరుకునపెట్టే విధంగా రాసుకొచ్చారు.
"ఆదాయం: అదానీకి!
వ్యయం: జనానికి, బ్యాంకులకు!
అవమానం: నెహ్రూకి!
రాజపూజ్యం: గుజరాతీ గుంపుకి!!
బస్, బభ్రాజీమానం భజగోవిందం!
దేశీయ ఉగాది పంచాంగం సమాప్తం!" - మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ లో ఉంది.
అయితే మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. కౌంటర్ గా అదే స్టైల్ లో పంచాంగం రాసేశారు. 'ఆదాయం: కల్వకుంట్ల కుటుంబానికి.. వ్యయం: తెలంగాణ రాష్ట్రానికి. అవమానం: ఉద్యమ వీరులకు, అమరుల త్యాగాలకు. రాజపూజ్యం: ఉద్యమ ద్రోహులకు, దొంగలకు!! తుస్.. పిట్టల దొర, తుపాకి చంద్రుల గడీల పంచాయితీ లెక్క తేలుడే తరువాయి.. పతనం ఇగ షురువాయే' అంటూ ట్వీట్ చేశారు.
ఇద్దరు నేతలు చేసిన ట్వీట్లు కాస్త... సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక ఇరు పార్టీల సోషల్ మీడియా వారియర్స్ కూడా ఓ రేంజ్ లోనే కౌంటర్లు విసురుకుంటున్నారు. బీజేపీ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ... బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రశ్నిస్తే... అదే రేంజ్ లో బీజేపీ కార్యకర్తలు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తున్నారు. ఇద్దరు నేతలు చెప్పిన పంచాగం బాగుందంటూ మరికొందరు నెటిజన్లు రాసుకొస్తున్నారు. మొత్తంగా పండగ పూట ఇద్దరు నేతలు చేసిన ట్వీట్లు మాత్రం.... టాక్ ఆఫ్ ది తెలంగాణగా మారాయి.
సంబంధిత కథనం