Minister Harish Rao : సీజనల్ వ్యాధులు, కొవిడ్ వ్యాక్సిన్ ప్రికాషన్ డోస్ పంపిణీపై హరీశ్ రావు సమీక్ష-minister harish rao review on seasonal diseases and corona precautions dose ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Minister Harish Rao Review On Seasonal Diseases And Corona Precautions Dose

Minister Harish Rao : సీజనల్ వ్యాధులు, కొవిడ్ వ్యాక్సిన్ ప్రికాషన్ డోస్ పంపిణీపై హరీశ్ రావు సమీక్ష

HT Telugu Desk HT Telugu
Jul 21, 2022 07:56 PM IST

వరుసగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. వచ్చే నెల రోజులు ఎంతో కీలకమన్నారు. ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాలు, ట్రైబల్ ఏరియాల్లో ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

మంత్రి హరీశ్ రావు
మంత్రి హరీశ్ రావు

డెంగీ కేసులు నమోదవుతున్న జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. గురువారం MCRHRD నుండి అన్ని జిల్లాల వైద్యాధికారులతో మంత్రి హరీశ్ రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీజనల్ వ్యాధులు, బూస్టర్ డోసు, సి సెక్షన్లు, బూస్టర్ డోసు, ఎన్ సీ డీ స్క్రీనింగ్ తదితర అంశాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. లక్షణాలు ఉన్న వారికి పరీక్షలు నిర్వహించి, వెంటనే చికిత్స అందించాలని చెప్పారు. ఒకవైపు అవగాహన పెంచడం, మరో వైపు సత్వర చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి జేబులు ఖాళీ చేసుకోకుండా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న వైద్య సేవలు ప్రజలు సద్వినియోగం చేసుకునెలా చూడాలన్నారు. చికిత్స, రోగ నిర్ధారణ పరీక్షల సేవల గురించి అవగాహన కల్పించాలన్నారు. మున్సిపల్, పంచాయతీ శాఖలు, స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయంతో పారిశుద్ధ్యం పట్ల అవగాహన పెంచాలన్నారు.

ట్రెండింగ్ వార్తలు

నీటి నిల్వ లేకుండా చూడటం, ఫాగింగ్, ఫ్రై డే డ్రై డే కార్యక్రమాలను నిర్వహించాలని మంత్రి హరీశ్ ఆదేశించారు. తద్వారా దోమలు, ఈగల నియంత్రణ జరిగేలా చూడాలన్నారు. వర్షాలు, వరదల సమయంలో జిల్లా వైద్యాధికారులు సమన్వయంతో పని చేశారని, స్టాఫ్ నర్సులు, ఆశాలు, ఇతర సిబ్బంది అందరూ కృషి చేసి మంచి సేవలు అందించారని అభినందించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇంకా బాగా పని చేసి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని అన్నారు.

పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంతో బూస్టర్ డోసు పంపిణీ విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. బూస్టర్ డోసు చాలా ముఖ్యమని, అర్హులందరికి వేసేలా రాష్ట్ర వ్యాప్తంగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అన్నారు. జన సాంద్రత ఎక్కువగా ఉన్న హైద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ తదితర జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎంపీలు, ఎమ్మేల్యేలు, ప్రజా ప్రతినిధుల సహకారంతో వాక్సినేషన్ వేగంగా నిర్వహించాలని, ప్రజల్లో చైతన్యం కలిగించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వారానికి రెండు మూడు రోజులు జిల్లాల్లో పర్యటిస్తూ, పురోగతిపై సమీక్షలు నిర్వహించాలని, వచ్చే పది రోజుల్లో వాక్సినేషన్ వేగం పెంచేలా చర్యలు తీసుకోవాలని డీహెచ్ శ్రీనివాస్ రావును మంత్రి ఆదేశించారు.

ఇంకా హరీశ్ రావు ఏమన్నారంటే..

రాష్ట్రంలో బూస్టర్ డోస్ పంపిణీకి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. 20 లక్షల పైగా డోసులు నిల్వ ఉన్నాయి. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో బూస్టర్ డోసు అందుబాటులో ఉంది. అన్ని జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఇంజినీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీల్లోనూ ప్రత్యేకంగా వాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించాలి. . 040-24651119 నెంబర్ లో సంప్రదిస్తే.. 100 మంది కంటే ఎక్కువ మంది లబ్ధిదారులు ఉన్న చోట వాక్సినేషన్ కేంద్రం ఏర్పాటు చేస్తాం. ఈ విషయంపై ప్రచారం కల్పించాలి.

ప్రతి గర్భిణీకి నాలుగు ఏఎన్ సీ చెకప్స్ పక్కగా జరిగేలా చూడాలి. ఈ విషయంలో జోగులాంబ గద్వాల, అదిలాబాద్, జనగాం, కుమ్రం భీం, సంగారెడ్డి జిల్లాలు మంచి పని తీరు కనబరిచాయి. సూర్యాపేట, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం ,ములుగు, వికారాబాద్ జిల్లాల్లో పనితీరు తక్షణం మెరుగుపడాలి. సబ్ సెంటర్ వారీగా జిల్లా వైద్యాధికారులు సమీక్ష నిర్వహించాలి. పీ హెచ్ సీల్లో డెలివరీలు పెరగాలి. 24 గంటల పీహెచ్ సీల్లో అన్ని వేళలా వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనతో ప్రారంభించిన తెలంగాణ డయాగ్నొస్టిక్ దేశానికి రోల్ మోడల్ గా నిలిచాయి. ఈ సేవలు ప్రజలకు అందేలా చూడాలి. 24 గంటల్లో పరీక్ష ఫలితాలు వచ్చేలా చేసి, మరుసటి రోజు పేషెంట్ ఆ ఫలితాలు వైద్యులకు చూపించే విధంగా ఉండాలి. ఆసుపత్రుల ప్రదేశంలో ఉండే టి డయాగ్నొస్టిక్ బాధ్యత ఆయా ఆసుపత్రుల సూపరింటెండెంట్ తీసుకోవాలి. మూడు షిఫ్టుల్లో, 24 గంటల పాటు సేవలు అందించాలి.

WhatsApp channel