Harish Rao On Polavaram : పోలవరం మరో ఐదేళ్లలో పూర్తయితే గొప్పే
Minister Harish Rao On Polavaram : మంత్రి హరీశ్ రావు పొలవరంపై సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరంపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు.
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారం కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు(Minister Harish Rao) పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు(Polavaram Project)పై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం(Kaleshwaram)పై ప్రతిపక్షాలు అనవసర ప్రచారాలు చేస్తున్నాయని ఆరోపించారు. ' ఆంధ్రప్రదేశ్ లో పోలవరం ప్రాజెక్టు పనులు మరో ఐదు ఏళ్లు అయిన పూర్తి చేయలేరు. అక్కడ పోలవరం(Polavaram) పనుల పురోగతిపై ఇంజినీర్లతో మాట్లాడాను.' అని హరీశ్ రావు అన్నారు.
ట్రెండింగ్ వార్తలు
మరో ఐదు సంవత్సరాల్లో పోలవరం పూర్తైతే గొప్పేనని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao)వ్యాఖ్యానించారు. కాళేశ్వరం కంటే ముందుగానే పోలవరం పనులు ప్రారంభించామని చెప్పారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయి ఆ ఫలితాలు ప్రజలకు అందుతున్నాయన్నారు. కేంద్రం చేపట్టిన జాతీయ ప్రాజెక్టు పోలవరం మాత్రం పూర్తి కాలేదని వ్యాఖ్యానించారు. కాళేశ్వరంపై విమర్శలు చేస్తున్న వారిపై మండిపడ్డారు. ఆ ఫలాలను అందుకుంటున్న వారు విమర్శలను తిప్పికొట్టాలన్నారు.
కాళేశ్వరం గొప్పతనం అందరికీ చెప్పాలి. దిల్లీ, హైదరాబాద్(Hyderabad) పార్టీ కార్యాలయాల్లో కూర్చొని మాట్లాడితే ఏం తెలుస్తుంది. గ్రామాల్లోకి వెళితే కాళేశ్వరం ఫలితాలు తెలుస్తాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కంటే ముందుగానే ఏపీలో ప్రారంభమైన పోలవరం ఇంకా పూర్తికాలేదు. అక్కడ ఇంజినీర్ల(Engineers)ను అడిగితే ఎప్పుడు పూర్తవుతుందో తెలియదంటున్నారు. బీజేపీ నేతలు తెలంగాణ రైతులను నూకలు తినమని అవమాన పరిచారు. సీఎం కేసీఆర్(CM KCR) ప్రతి గింజ కొనుగోలు చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చి నల్ల చట్టాలు తెచ్చింది. డీజిల్, పెట్రోల్ ధరలు పెంచి ప్రజల నడ్డి విరిచింది.
- మంత్రి హరీశ్ రావు
పోలవరం ప్రాజెక్టుపై చాలా రోజులు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), తెలంగాణ మధ్య వివాదం నడుస్తోంది. పోలవరం పూర్తయితే భద్రాద్రి(Bhadradri) జిల్లాలో ముంపు ఉందని తెలంగాణ నేతలు అంటున్నారు. పోలవరం ఎత్తు తగ్గించాలని డిమాండ్స్ కూడా చేశారు. గోదావరి వరదల(Godavari Floods) సమయంలోనూ తెలంగాణ ప్రభుత్వం ఏపీపై విమర్శలు చేసింది. ఈ విషయం కేంద్రం వద్దకు కూడా వెళ్లింది. పోలవరం ఎత్తును తగ్గించాలని డిమాండ్ చేస్తోంది. ఒడిశా, చత్తీస్ గఢ్ రాష్ట్రాలు సైతం.. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
పోలవరం బ్యాక్ వాటర్(Polavaram Back Water) తో ఎన్నో గ్రామాలు వరద ముంపునకు గురవుతున్నాయని.. ఇటీవలే మంత్రి పువ్వాడ కూడా కామెంట్స్ చేశారు. ప్రాజెక్టు పూర్తయితే.. భద్రాచలానికి(Bhadrachalam) ముప్పు పొంచి ఉందని అంటున్నారు. డ్యామ్ కారణంగా వరద ప్రవాహం నెమ్మదిగా వెళ్లి.. భద్రాచలం వద్ద నీటి మట్టం పెరుగుతోందని చెబుతున్నారు. పోలవరం ఎత్తు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.