Minister Harish Rao : ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో దర్యాప్తు ఎందుకు ఆపాలంటున్నారు? -minister harish rao comments on bjp over trs mlas poaching case ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Minister Harish Rao Comments On Bjp Over Trs Mlas Poaching Case

Minister Harish Rao : ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో దర్యాప్తు ఎందుకు ఆపాలంటున్నారు?

HT Telugu Desk HT Telugu
Nov 10, 2022 10:18 PM IST

Harish Rao On MLAs Poaching Case : ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైందని మంత్రి హరీశ్ రావు అన్నారు. గుమ్మడికాయల దొంగలు ఎవరంటే భుజాలు తడుముకున్న పరిస్థితి బీజేపీదని వ్యాఖ్యానించారు.

మంత్రి హరీశ్ రావు
మంత్రి హరీశ్ రావు

మొదట ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి వచ్చిన మఠాధిపతులు, స్వామీజీలు మాకు తెలియనే తెలియదన్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రభుత్వం వారిని అరెస్టు చేసి జైలుకు పంపిన తర్వాత బీజేపీ నాయకుల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టుగా అయిందని విమర్శించారు. బీజీపీ పార్టీ అధ్యక్షుడేమో తడి బట్టలతో ప్రమాణాలు చేస్తానంటాడని, ప్రధాన కార్యదర్శి ఏమో విచారణ ఆపమని, కేసు ఢిల్లీకి ఇవ్వమని కోర్టుల్లో కేసులు వేస్తాడని విమర్శించారు.

ట్రెండింగ్ వార్తలు

'తడి బట్టలతో ప్రమాణాలు చేస్తరు. అసలు ఏంటిది? మాకు సంబంధం లేదంటరు. కోర్టుల్లో కేసులు వేసి విచారణ ఆపుతారు. ఎమ్మెల్యే కొనుగోలు కేసులో సంబంధం లేకపోతే కోర్టులో కేసులు ఎందుకు వేస్తరు.. సమాధానం చెప్పాలి కదా.. కేసు తొందరగా విచారణ జరగాలి. న్యాయం జరగాలి. నిష్పాక్షికంగా దర్యాప్తు జరగాలని ఏ రాజకీయ నాయకుడైనా, పార్టీ అయినా అడుగుతరు. కాని దర్యాప్తు ఆపాలి అంటే.. అర్థం ఏంటి? అసలు బండారం బయట పడుతుందని బీజేపీ నేతలు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారు. సర్వోన్నత న్యాయస్థానం కూడా ఇవాళ బీజేపీ బ్రోకర్ల సంభాషణ పై స్పందించింది. న్యాయమూర్తులు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం పై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.' అని హరీశ్ రావు అన్నారు.

రాష్ట్ర గవర్నర్ ఎందుకు భుజాలు తడుముకుంటుందో అర్థం కావడం లేదని హరీశ్ రావు అన్నారు. గవర్నర్ ఎందుకు నిన్న తుషార్ అనే వ్యక్తి గురించి మాట్లాడారో తెలియలేదన్నారు. రాహుల్ గాంధీ పై పోటీ చేసిన కేరళకు చెందిన తుషార్ గురించి మేం మాట్లాడామని, గవర్నర్ ఎందుకో తన మాజీ ఏడీసీ తుషార్ పేరును ప్రస్తావించారని హరీశ్ రావు అన్నారు. తెలంగాణ పోలీసుల మీద, ఐపీఎస్ అధికారుల మీద బీజేపీకి నమ్మకం లేదని చెప్పారు. తెలంగాణ పోలీసుల మీద విశ్వాసం లేకపోతే.. తెలంగాణ ప్రజల ఓట్లు ఎలా అడుగుతున్నరని ప్రశ్నించారు.

బీజేపీది తెలంగాణ వ్యతిరేక ధోరణి అని, కక్షపూరిత ధోరణి అని, బీజేపీ 16-17 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది కదా.. ఆ రాష్ట్రాల్లో కేసులు నమోదు కావడం లేదా. అక్కడ కేసులన్నీ సీబీఐకి ఇవ్వమని అడుగుతారా అని హరీశ్ రావు ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల మీద, పోలీసుల మీద బీజేపీ కక్షపూరిత వైఖరి అవలంభిస్తుందని పేర్కొన్నారు. లోయర్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెల్లడానికి అవసరం ఏమొచ్చిందన్నారు. ఎంక్వైరీ ఆపమని, సిట్ ను ఆపమని ఎందుకు బీజేపీ నేతలు అడుగుతున్నారన్నారు.

'ఇందులో విషయం లేకపోతే ఇన్ని సార్లు ఎందుకు కోర్టుకు పోతున్నరు. 8 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పడగొట్టిన బీజేపీ, తెలంగాణకు వచ్చే సరికి కుడితిలో పడ్డ ఎలుకలా పరిస్థితి తారుమారయింది. ఆ దొంగలను పట్టుకుని జైల్లో పెట్టింది ప్రభుత్వం. దీంతో ఆగమాగం అవుతున్నరు బీజేపీ వాళ్లు. నిజంగా సంబంధం లేకపోతే కోర్టు తలుపులు ఎందుకు కొడుతున్నరు. టీవీల్లో ఎమ్మెల్యే కొనుగోలుపై బీజేపీ వాళ్లు కేసుతో మాకు సంబంధం లేదని, మఠాధిపతులను కేసీఆర్ పంపారని చెబుతున్నరు. సంబంధం లేకపోతే కేసు ఆపమని ఎందుకు అడుగుతున్నరు. ఎందుకు భయపడుతున్నరు.' అని హరీశ్ రావు ప్రశ్నించారు.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐకి అప్పగించాలని బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమెందర్ రెడ్డి కోర్టుకు వెళ్లారని, పారదర్శకంగా కేసు విచారణ జరగాలని సిట్ ను సీఎం ఏర్పాటు చేశారన్నారు. కుట్రలు బయటపడతయని, ఇజ్జత్ మానం పోతుందని , పరువు కాపాడుకోవాలని బీజేపీ నేతలు విచారణ ఆపాలని ప్రయత్నిస్తున్నారన్నారు. ఇంకోసారి ప్రభుత్వాన్ని పడగొట్టమని చెంపలు వేసుకోవడం తప్ప బీజేపీకి మరో మర్గం లేదని హరీశ్ రావు అన్నారు.

తెలంగాణ పోలీసులు ఏం చేశారు. దొంగను పట్టుకోవడం తప్పా.. నిస్సిగ్గుగా మేం ఎమ్మెల్యేలను కొంటమని వస్తే పోలీసులు పట్టుకుంటే విచారణ ఆపాలని, దొంగలను పట్టుకోవద్దని బీజేపీ నేతలు మాట్లాడతారా. బీజేపీ ప్రధాన కార్యదర్శి కోర్టులో కేసులు వేస్తరు. సిట్ దర్యాప్తు ఆపమంటరు. చిన్న పిల్లలకు కూడా విషయం ఏంటో స్పష్టంగా అర్థమవుతుంది. వీరు దొరికిపోయి నోటికి వచ్చినట్లు మాట్లాడతున్నరు. గల్లీ లీడర్లు ఓ మాట, ఢిల్లీ లీడర్లు ఓమాట మాట్లాడుతున్నరు. ఎవరు ఎవరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నరో దేశ ప్రజలందరికి తెలుసు. రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న వ్యక్తులు గౌరవ ప్రదంగా ఉండాలి. తమ విలువ తగ్గించుకుని, స్థాయి తగ్గేలా మాట్లాడటం తగదు.

- మంత్రి హరీశ్ రావు

IPL_Entry_Point

సంబంధిత కథనం