Medaram Jatara : ఫిబ్రవరి 1 నుంచి మినీ మేడారం - 4 రోజుల పాటు జాతర
Mini Medaram Jatara 2023: మినీ మేడారం జాతరకు ముహూర్తం ఫిక్స్ అయింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి 4వ తేదీ వరకు ఈ వేడుకను జరపనున్నట్లు పూజారులు అధికారికంగా ప్రకటించారు.
Mini Medaram jatara 2023: సమ్మక్క - సారలమ్మ జాతర అంటే తెలంగాణలో తెలియని వారు ఉండరు. దేశంలోనే కాదు ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరు ఉంది. ములుగు జిల్లాలోని మేడారం గ్రామంలో ఈ జాతర ఎన్నో ఏళ్లుగా జరుగుతూనే వస్తోంది. ఈ జాతర చూసేందుకు భక్తులు భారీగా తరలివస్తుంటారు. గతేడాది అసలు జాతర పూర్తికాగా... సమ్మక్క-సారలమ్మల మినీ జాతరకు ముహుర్తం ఖరారైంది.
ట్రెండింగ్ వార్తలు
నాలుగు రోజులు..
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మినీ మేడారం జాతరను నిర్వహించనున్నారు. అమ్మవార్ల పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, సమ్మక్కసారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజుల పూజారులందరూ సమావేశమై జాతర నిర్వహణపై చర్చించారు. సమిష్టి నిర్ణయం అనంతరం జాతర తేదీలను అధికారికంగా ప్రకటించారు. అమ్మవార్లకు ఇష్టమైన మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని ఫిబ్రవరి 1వ నుంచి 4వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా మినీ జాతర నిర్వహించనున్నారు.
ఆ ఒక్క కార్యక్రమం ఉండదు...
ఈ మినీ జాతరలో వన దేవతలను గద్దెలపైకి తీసుకురావడం ఉండదు. మిగిత పూజా కార్యక్రమాలు యథావిధిగా జరుగుతాయి. మేడారంలోని సమ్మక్క పూజా మందిరంలో కొక్కెర కృష్ణయ్య, కన్నెపల్లిలోని సారలమ్మ పూజా మందిరంలో కాక సారయ్యలు, అమ్మవార్ల పూజారులు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మినీ జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే పూజారులు జిల్లా కలెక్టర్ ను కలిసి ఆహ్వాన పత్రికను అందించారు. ఏర్పాట్లపై కూడా చర్చించారు. ఏర్పాట్ల కోసం ప్రభుత్వం నిధులు ఇవ్వాలని పూజారులు కోరుతున్నారు.
సమ్మక్క-సారలమ్మ జాతరకు ప్రపంచవ్యాప్తంగా పేరు ఉంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ఇది గుర్తింపు పొందింది. దేశ, విదేశాల నుంచి ఈ జాతరను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. రెండేళ్లకు ఒకసారి మాత్రమే మేడారం మహాజాతర నిర్వహించే సంప్రదాయం కొనసాగుతుండగా.. మధ్యలో మినీ జాతర నిర్వహిస్తారు. మహా జాతరలో మొక్కులు చెల్లించుకున్నవారితో పాటు ఇతర భక్తులు కూడా మినీ మేడారం జాతరకు భారీ సంఖ్యలో వస్తారు.
మేడారం జాతరకు భారీగా ఆదాయం వస్తుంది. 2020 మేడారం జాతరలో మొత్తం 502 హుండీలు ఏర్పాటు చేయగా 11 కోట్ల 17 లక్షల రూపాయల ఆదాయం లభించింది.. గతేడాది(2022) జాతరలో మొత్తం 517 హుండీలు ఏర్పాటు చేశారు.. కానీ ఆదాయం తగ్గింది.. 10కోట్ల 91లక్షల 62వేల రూపాయల ఆదాయం మాత్రమే లభించింది.. 18దేశాలకు చెందిన కరెన్సీ కూడా లభ్యమైంది.. హుండీ ఆదాయం అంతా బ్యాంకు ఖాతాలో జమా చేశారు. హుండీ ఆదాయంలో 33శాతం పూజారులకు, 67 శాతం దేవాదాయ శాఖకు చెందుతుంది. 13 మంది పూజారులు 33 శాతం వాటాను పంపకాలు చేసుకుంటారు.