స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి సంబంధించి తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు మరో కీలక అప్డేట్ ఇచ్చింది. ఇప్పటికే అప్లికేషన్ల ప్రక్రియ పూర్తి కాగా… తాజాగా హాల్ టికెట్లను విడుదల చేసింది. అభ్యర్థులు https://mhsrb.telangana.gov.in/ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని ఓ ప్రకటనలో తెలిపింది.
వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ వివరాల ప్రకారం… నవంబర్ 17వ తేదీన రాత పరీక్ష జరగాల్సి ఉంది. అయితే ఈ తేదీని మార్పు చేసిన సంగతి తెలిసిందే. నవంబర్ 23వ తేదీన స్టాఫ్ నర్స్ ఆఫీసర్ పరీక్షను నిర్వహించనున్నారు. సీబీటీ విధానంలో ఉంటుంది.
మొదటి సెషన్ ఉదయం 9 నుంచి 10.20 గంటల వరకు జరగుతుంది. ఇక రెండో సెషన్ మధ్యాహ్నం 12.40 నుంచి 2 గంటల వరకు ఉంటుంది. పరీక్షకు పావుగంట ముందే గేట్లు మూసివేయనున్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే 7416908215కు ఫోన్ చేయవచ్చని సూచించింది.
ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 2322 నర్సింగ్ ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, డైరెక్టర్ మెడికల్ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లలో 1576 ఖాళీలు ఉండగా.. వైద్య విధాన పరిషత్ లో 332 పోస్టులు ఉన్నాయి. ఇక ఆయుష్ శాఖలో 61 నర్సింగ్ ఆఫీసర్ల పోస్టులు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ లో 1 నర్సింగ్ ఆఫీసర్ ను భర్తీ చేయనున్నారు. ఎంఎన్జీ క్యాన్సర్ ఆసుపత్రిలో 80 మంది నర్సింగ్ ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేస్తారు.
తొలుత ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం 2050 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. ఆ తర్వాత మరో 272 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు అక్టోబర్ 11వ తేదీన అనుబంధ నోటిఫికేషన్ జారీ చేసింది.వీటిని కలిపితే మొత్తం 2322 పోస్టులు కానున్నాయి.
అభ్యర్థులను 100 పాయింట్ల ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో పొందిన మార్కుల శాతానికి గరిష్టంగా 80 పాయింట్లు(80 మార్కులకు పరీక్ష నిర్వహణ), మిగిలిన 20 పాయింట్లు రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ విభాగాల్లో సేవలు(కాంట్రాక్ట్/అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఆసుపత్రులు/ సంస్థలు/ కార్యక్రమాలు) అందించిన వారికి కేటాయిస్తారు.