వరంగల్ నగరంలోని శివనగర్ ఏరియాకు చెందిన ఇట్టబోయిన రాజ్ కుమార్, రజిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నాడు. వీరిది సామాన్య మధ్య తరగతి కుటుంబం. ఈ కుటుంబానికి చెందిన సాయిశివానీ సివిల్స్లో 11వ ర్యాంకు సాధించారు.
రాజ్ కుమార్ మెడికల్ రిప్రజెంటేటివ్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా, తల్లి గృహిణి. వారి పెద్ద కుమార్తె ఇట్టబోయిన సాయి శివాని సివిల్స్లో ఏకంగా 11వ ర్యాంకు సాధించింది. కడపలో ట్రిపుల్ ఐటీలో పీయూసీ, ఆ తరువాత 2022లో బీటెక్ పూర్తి చేసింది. మధ్య తరగతి కుటుంబం కావడంతో పిల్లలను ఉన్నతంగా చదివించడానికి రాజ్ కుమార్ నిరంతరం శ్రమించాల్సి వచ్చేది.
తల్లిదండ్రుల కష్టాన్ని చూడలేక సాయి శివాని, ఎలాగైన ఐఏఎస్ కావాలని టార్గెట్ పెట్టుకుంది. ఈ మేరకు యూపీఎస్సీ పరీక్షలకు ప్రణాళిక ప్రకారం కష్టపడి చదివింది. ఈ క్రమంలో ఓ వైపు సివిల్స్ కు ప్రిపేర్ అవుతూనే తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్ వన్ పరీక్షలకు కూడా సన్నద్ధమైంది. గ్రూప్ వన్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చాటింది. గ్రూప్ వన్ పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో 21వ ర్యాంక్ సాధించి సత్తా చాటింది. కానీ ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో ఆ దిశగా ప్రయత్నాలు చేసింది. ఒకే టైంలో గ్రూప్ వన్, సివిల్స్ పరీక్షలు జరగగా.. రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ సాయి శివాని కష్టపడింది.
ఎలాగైనా సివిల్స్ ర్యాంక్ సాధించాలనే ఉద్దేశంతో సాయి శివాని కష్టపడి చదివింది. 2022లో బీటెక్ పూర్తి చేసిన తరువాత మొదటి సారి సివిల్స్ ఎగ్జామ్ రాసి విఫలం చెందింది. దీంతో కోచింగ్ వెళ్లాల్సిందిగా కొంతమంది సూచించారు. కానీ సివిల్స్ ర్యాంక్ సాధించడానికి కోచింగ్ లకు వెళ్లాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. తండ్రి మెడికల్ రిప్రజెంటేటివ్ కావడం, ఆదాయం కుటుంబ పోషణ వరకే సరిపోతుండటంతో ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సాయి శివాని సొంతంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది. ఈ మేరకు ఇంట్లోనే సెల్ఫ్ ప్రిపరేషన్ మొదలుపెట్టింది. ఆన్ లైన్ లో తన స్టడీకి కావాల్సిన మెటీరియల్ సమకూర్చుకుని చదివింది.
ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమైన సాయి శివాని మంగళవారం విడుదలైన సివిల్స్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 11వ ర్యాంక్ సాధించింది. తెలంగాణ, ఏపీ నుంచి దాదాపు 50 మందికిపైగా సివిల్స్ కు ఎంపిక కాగా.. అందులో సాయి శివాని ఆలిండియా 11వ ర్యాంక్ తో తెలుగు రాష్ట్రాల టాపర్ గా నిలిచింది.
సామాన్య మధ్యతరగతి చెందిన సాయి శివాని, సివిల్స్ కు ఎంపిక కావడంతో ఓరుగల్లు వాసుల్లో హర్షం వ్యక్తమైంది. తమ కూతురు పడిన కష్టానికి ఫలితం దక్కడంతో ఇట్టబోయిన రాజ్ కుమార్ – రజిత దంపతులు హర్షం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులు, బంధువులు సంబరాలు జరుపుకొన్నారు. కాగా సరైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడి చదివితే ఏదైనా సాధించవచ్చని సాయి శివాని చెబుతున్నారు.
సాయిశివాని పదో తరగతి వరకు ఖమ్మంలో చదువుకున్నారు. ఇంటర్, బిటెక్ ఇడుపులపాయ ట్రిపుల్ఐటీలో పూర్తి చేశారు. సివిల్స్ సాధనే ధ్యేయంగా శ్రమించారు. ఇంటర్వ్యూలో ప్రశ్నలు కూడా ఓరుగల్లుకు సంబంధించినవి అడిగినట్టు మీడియాకు తెలిపారు.
సివిల్స్ పరీక్షల్లో జాతీయ స్థాయిలో 11వ ర్యాంకు సాధించిన సాయి శివానికి కనీసం సొంత ఫోన్ కూడా లేదు. ఫోన్ ఉంటే సమయం వృధా అవుతుందనే ఉద్దేశంతో సొంత ఫోన్ కూడా వినియోగించలేదు. ట్రిపుల్ఐటీలో చదువుకునే రోజుల్లో కాలేజీ ఫోన్లోనే తల్లిదండ్రులతో మాట్లాడేది. ఇప్పటికీ స్నేహితులతో కాంటాక్ట్లో ఉండటానికి తండ్రి ఫోన్పై ఆధారపడుతుంది.
ఏకాగ్రతకు భంగం కలిగిస్తుందనే ఉద్దేశంతో ఫోన్ వాడలేదని సాయిశివానీ వివరించింది. సోషల్ మీడియా ప్రభావం లేదని, కరెంట్ అఫైర్స్ కోసం పత్రికలు, టీవీలు చూసి తెలుసుకున్నట్టు పేర్కొన్నారు.
(రిపోర్టింగ్: హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)
సంబంధిత కథనం