Medak Crime : ప్రేయసి కోసం ప్రేమికుడు, చెల్లి కోసం అన్న- మనస్తాపంతో తీవ్ర నిర్ణయాలు!
Medak Crime : తాను ప్రాణంగా ప్రేమించిన యువతికి మరొకరితో నిశ్చితార్థం అయ్యిందని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మరో ఘటనలో చెల్లిని కాపురానికి తీసుకెళ్లడంలేదని బెంగతో అన్న సూసైడ్ చేసుకున్నాడు.
Medak Crime : తాను ప్రేమించిన అమ్మాయికి మరో యువకుడితో నిశ్చితార్ధం జరగడంతో మనస్తాపానికి గురైన యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన మెదక్ జిల్లా(Medak Crime) వెల్దుర్తి మండలం దామరంచ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దామరంచ గ్రామానికి చెందిన దోమల పుండరీకం, పుష్ప దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు గ్రామంలో వ్యవసాయంతో పాటు కోళ్లఫారం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి రెండో కుమారుడు రవి (22) ఇంటి వద్దనే ఉంటూ కోళ్లఫారం పనులు చూసుకుంటున్నాడు. ఆదివారం పుండరీకం, పుష్ప దంపతులు శుభకార్యానికి ఆరెగూడెం వెళ్తున్నామని కోళ్లఫారం పనులు చూసుకోమని రవికి చెప్పి వెళ్లారు. తిరిగి సాయంత్రం ఐదు గంటలకు కోళ్లఫారం దగ్గరికి వెళ్లగా కోళ్లఫారంలో రవి ఉరి వేసుకొని కనిపించాడు. వెంటనే స్థానికుల సాయంతో కిందికి దించి తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రవి మృతి చెందినట్లు వైద్యులు తేల్చారు. రవి కొద్దిరోజులుగా ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. కాగా ఇటీవల ఆ అమ్మాయికి వేరే యువకుడితో నిశ్చితార్ధం కావడంతో మనస్థాపం చెంది ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు దర్యాప్తులో పేర్కొన్నారని ఎస్ఐ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
చెల్లిని కాపురానికి తీసుకెళ్లడం లేదనే బెంగతో అన్న ఆత్మహత్య
చెల్లిని కాపురానికి తీసుకెళ్లడం లేదనే బెంగతో ఓ అన్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా(Siddipet Crime) అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గోవర్ధనగిరి గ్రామానికి చెందిన భాషవేణి కొంరయ్య,తిరుపతమ్మ దంపతులకు ఒక కూతురు, ఒక కుమారుడు రాజ్ కుమార్ (22) ఉన్నారు. వీరు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కాగా వీరికున్న భూమిలో రెండు ఎకరాల భూమి అమ్మి ఆరు నెలల క్రితం చెల్లిని హుస్నాబాద్ మండలం తోటపెళ్లికి చెందిన యువకుడికి ఇచ్చి ఘనంగా పెళ్లి జరిపించారు. పెళ్లి అయిన రెండు, మూడు నెలలు సంతోషంగా ఉన్నారు. ఆ తర్వాత ఆమెకు అత్తారింట్లో వేధింపులు మొదలయ్యాయి. దీంతో పలుమార్లు పెద్దమనుసుల సమక్షంలో పంచాయితీలు జరిగాయి. అయినా వారిలో మార్పు రాలేదు. దీంతో చెల్లి పుట్టింట్లో ఉంటుంది. మరల ఈ నెల 28న మరోసారి పంచాయితీ పెట్టారు. అమ్మాయి నచ్చలేదంటూ అతింటివారు తీసుకెళ్లటానికి ఒప్పుకోకపోగా, విడాకులు ఇస్తామని చెప్పారు. దీంతో రాజ్ కుమార్ చెల్లి సంసారం నాశనం అయ్యిందనే మనస్తాపంతో తల్లికి ఫోన్ చేసి పురుగుల మందు(Brother Suicide) తాగాడు. వెంటనే కుటుంబసభ్యులు అక్కడికి చేరుకొని అపస్మారక స్థితిలో ఉన్న రాజ్ కుమార్ ను కరీంనగర్ లో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
సంబంధిత కథనం