Mass National Anthem : సామూహిక జాతీయ గీతాలాపన, నెహ్రూకు కేసీఆర్ నివాళులు….
తెలంగాణ వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ జీపీఓ సర్కిల్లో నిర్వహించిన కార్యక్రమంలో సిఎం కేసీఆర్ పాల్గొన్నారు. నవభారత నిర్మాత, తొలి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ విగ్రహానికి కేసీఆర్ పుష్పంజలి ఘటించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో తెలంగాణ పౌరులందరిని ఏకం చేయడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సిఎం కేసీఆర్ చెప్పారు. 75వ స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా హైదరాబాద్లో పక్షం పాటు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం 11.30కు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో సామూహిక జాతీయ గీతాలపన నిర్వహించారు. జాతీయ గీతాలపనకు ముందు మంత్రులతో, ఇతర నాయకులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ జవహర్ లాల్ నెహ్రూ విగ్రహానికి పుష్పంజలి ఘటించారు.
ట్రెండింగ్ వార్తలు
హైదరాబాద్ అబిడ్స్లోని జనరల్ పోస్ట్ ఆఫీస్ సర్కిల్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. హైదరాబాద్ మెట్రో రైళ్లతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయితీలు, అంగన్ వాడీ కేంద్రాలు, విద్యా సంస్థలు, ప్రైవేట్ సంస్థల్లో ఏకకాలంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ప్రయాణికులు, వాహనదారులతో సహా ఉదయం 11.30కు జాతీయ గీతాన్ని ఆలపించాలని కేసీఆర్ పిలుపునివ్వడంతో లక్షలాది మంద్రి ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమ నిర్వహణ కోసం హైదరాబాద్ నగర వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు. రోడ్లపై ఉన్న వారు సైతం ఎక్కడికక్కడ నిలబడి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురసరించుకొని మంగళవారం సామూహిక జాతీయగీతాలాపన చేపట్టారు. అబిడ్స్ జీపీవో సరిల్, నెక్లెస్రోడ్ వాటర్ ఫ్రంట్ కూడలి తదితర ప్రాంతాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో వేలాదిమంది విద్యార్ధులు మువ్వన్నెల జెండాలను చేతబూని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అబిడ్స్ జీపీవో సర్కిల్ వద్ద జరిగిన కార్యక్రమంలో స్వాతంత్య్ర సమరయోధుల చిత్రపటాలను ప్రదర్శించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని ఉద్యోగులు, కళాశాల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏర్పాట్లు చేయడంతో భారీగా తరలివచ్చారు. ఈ నెల 21వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఉత్సవాల నిర్వహణ కమిటి ఛైర్మన్ కేశవరావు చెప్పారు. 17న రంగోలి, జానపద గీతాలపన, రవీంద్ర భారతిలో కవి సమ్మేళనం, ప్రతి గ్రామంలో స్వాతంత్య్ర పోరాట ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. 22వ తేదీన శంకర్ మహదేవ్తో సంగీత విభావరి, ముస్లింల కోసం కవ్వాలి కార్యక్రమాలను లాల్ బహదూర్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 22వ తేదీన ఎల్బి స్టేడియంలో నిర్వహించే కార్యక్రమానికి ప్రజలంతా తరలి రావాలని కోరారు.
టాపిక్