రాజీవ్ యువ వికాసం పథకంలో భాగంగా.. ఎక్కువమంది కేటగిరీ 4 రుణాలు పొందేందుకు ఆసక్తి చూపించారు. ఎక్కువ విలువ కలిగిన యూనిట్లతో మెరుగైన స్వయం ఉపాధి పథకాలు పొందవచ్చన్న ఉద్దేశంతో.. కేటగిరీ 4 కోసం దరఖాస్తు చేశారు. మొత్తం 16.23 లక్షల మంది దరఖాస్తు చేయగా.. ఇందులో మూడో వంతు (76.46 శాతం) మంది రూ.2 లక్షలు నుంచి రూ.4 లక్షల విలువైన యూనిట్లు కావాలని కోరారు.
రూ.4 లక్షల విలువైన యూనిట్ విలువలో 70 శాతం రాయితీతో దాదాపు రూ.2.8 లక్షల వరకు సబ్సిడీ వచ్చే అవకాశం ఉంది. దీంతో ఎక్కువ దరఖాస్తులు కేటగిరీ 4 లోనే వచ్చినట్లు అధికారులు గుర్తించారు. కేటగిరీ 1 కింద వంద శాతం రాయితీతో ప్రభుత్వం రూ.50వేల రుణం మంజూరు చేయాలని నిర్ణయించింది. రోజువారీ చిరు వ్యాపారాలు చేసుకునేవారికి ఉపయోగకరంగా ఉంటుందని భావించింది. కానీ ఈ కేటగిరీలో దరఖాస్తులు కేవలం 39 వేలు మాత్రమే వచ్చాయి.
వంద శాతం రాయితీ రుణాలకు ఎస్టీలు తక్కువ ఆసక్తి చూపారు. ఎస్టీ కార్పొరేషన్ కింద వచ్చిన దరఖాస్తుల్లో 0.31 శాతమే కేటగిరీ 1లో ఉన్నాయి. కేటగిరీ 2 కింద రూ.50 వేల నుంచి రూ.లక్షలోపు రుణాలకు 90 శాతం రాయితీ ఇవ్వనున్నారు. ఈ యూనిట్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించగా.. 93 వేల మంది ఆసక్తి చూపారు. మొత్తం దరఖాస్తుదారుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ వర్గాలకు చెందిన 83 నుంచి 84 శాతం మంది కేటగిరీ 4 కింద యూనిట్లు కావాలని దరఖాస్తు చేసుకున్నారు.
ఏప్రిల్ 14వ తేదీతో రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. ప్రస్తుతం వీటిని పరిశీలిస్తున్నారు. మండలస్థాయి కమిటీలు అర్హుల ఎంపికలు పూర్తిచేసి జిల్లాస్థాయి కమిటీలకు జాబితాను అందజేస్తాయి. పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్/ జోనల్ కమిషన్ కన్వీనర్గా వ్యవహరిస్తారు. జిల్లా స్థాయిలో ఏర్పాటయ్యే కమిటీకి జిల్లా కలెక్టర్ చైర్మన్గా వ్యవహరిస్తారు. కన్వీనర్గా డీఆర్డీఏ పీడీ ఉంటారు.
ఈ కమిటీలు జిల్లాల వారీగా అర్హుల జాబితాలను ఫైనల్ చేస్తాయి. జూన్ 2 నుంచి 9 వరకు లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేస్తారు. ఈ స్కీమ్ కింద ఎంపికైన వారికి 7 రోజుల నుంచి 15 రోజుల వరకు ఓరియంటేషన్ తరగతులు నిర్వహిస్తారు. అనంతరం యూనిట్లు మంజూరు చేస్తారు. యూనిట్ గ్రౌండ్ చేసిన తరువాత 6 నెలల నుంచి ఏడాది వరకు శిక్షణ అందిస్తారు.
సంబంధిత కథనం