Manchu Family Issue : పోలీస్ స్టేషన్ కు చేరిన మంచు ఫ్యామిలీ వివాదం, ప్రాణహాని ఉందని మనోజ్ ఫిర్యాదు!
Manchu Family Issue : మంచు ఫ్యామిలీ వివాదం పోలీస్ స్టేషన్ కు చేరింది. హీరో మంచు మనోజ్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. నిన్న జరిగిన దాడిపై మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
మంచు ఫ్యామిలీ వివాదం మరింత ముదురుతోంది. హీరో మంచు మనోజ్ సోమవారం సాయంత్రం హైదరాబాద్ లోని పహాడీ షరీఫ్ పోలీసు స్టేషన్ కు వెళ్లారు. నిన్న జరిగిన దాడిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. హీరో మనోజ్ పై ఆయన తండ్రి మోహన్ బాబు అనుచరుడు నిన్న దాడి చేసినట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలో నిన్న సాయంత్రం బంజారాహిల్స్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి కుటుంబ సభ్యులతో వెళ్లిన మనోజ్...దెబ్బలకు చికిత్స తీసుకున్నారు. ఈ మెడికల్ రిపోర్టులు ఆధారంగా మంచు మనోజ్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
తనపై దాడి జరిగినట్లు మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జల్ పల్లిలోని ఇంట్లో తనపై, తన భార్యపై తండ్రి మంచు మోహన్ బాబు సమక్షంలో విద్యానికేతన్ స్కూల్స్ పర్యవేక్షిస్తున్న వినయ్ అనే వ్యక్తి దాడి చేశాడని మనోజ్ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ దాడిలో తాను తీవ్రంగా గాయపడ్డానని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు స్కానింగ్ రిపోర్టులతో మనోజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. జల్ పల్లిలోని ఇంట్లో తనను రౌండ్ చేసి కొట్టారని, దాడికి పాల్పడిన వారి వివరాలు పోలీసులకు వివరిస్తూ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
మోహన్ బాబు ఫిర్యాదు
మోహన్బాబు, మనోజ్ పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. తన కుమారుడు మనోజ్,అతడి భార్య మౌనికపై చర్యలు తీసుకోవాలని మోహన్ బాబు రాచకొండ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. తన ప్రాణానికి, ఆస్తులకు రక్షణ కల్పించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అసాంఘిక శక్తులుగా మారిన కొందరి నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరారు. జల్పల్లిలో 10 ఏళ్లుగా తాను నివసిస్తున్నానని మోహన్ బాబు తెలిపారు. నాలుగు నెలల కిందట మనోజ్ ఇల్లు వదిలి వెళ్లారన్నారు. మనోజ్ కొందరు సంఘ వ్యతిరేకులతో కలిసి తన ఇంటి వద్ద ఆదివార కలవరం సృష్టించారని ఆరోపించారు. మనోజ్ తన కార్యాలయంలోకి 30 మంది వ్యక్తులతో చొరబడి సిబ్బందిని బెదిరించారని మోహన్ బాబు ఫిర్యాదులో పేర్కొన్నారు.
జల్పల్లిలోని మంచు మనోజ్ ఇంటి వద్ద సోమవారం ఉదయం నుంచి హైడ్రామా నడుస్తోంది. మంచు హౌస్ వద్ద విష్ణు, మనోజ్ బౌన్సర్లను మోహరిచారు. విదేశాల్లో ఉన్న విష్ణు తన వ్యాపార భాగస్వామి విజయ్ ద్వారా మంచు హౌస్ వద్ద సీసీఫుటేజీ మొత్తం స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. అక్కడ విష్ణు 40 మంది బౌన్సర్లను కాపలా పెట్టగా, మనోజ్ కూడా 30 మందిని తెప్పించుకున్నారని సమాచారం. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన మంచు విష్ణు జల్ పల్లి వెళ్లనున్నారని సమాచారం.
బంజారాహిల్స్ ఆస్పత్రికి మంచు మనోజ్..
జల్పల్లిలో మనోజ్ ఇంట్లో ఉండగా కొందరు దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన మంచు మనోజ్ భార్యతో కలిసి బంజారాహిల్స్ లోని ఆస్పత్రికి వెళ్లారు. నడవలేని స్థితిలో ఆసుపత్రికి వచ్చిన మంచు మనోజ్ ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందారు. మంచు ఫ్యామిలీకి చెందిన స్కూల్కు సంబంధించి ఆస్తుల వివాదం జరుగుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
మంచు ఫ్యామిలీలో వివాదాలు అంటూ వస్తున్న వార్తలపై.. మోహన్ బాబు కుటుంబం స్పందించింది. అసత్య ప్రచారాలు చేయొద్దని విజ్ఞప్తి చేసింది. ఆదివారం సాయంత్రం మనోజ్ కాలి గాయంతో ఆస్పత్రికి రావడం చర్చనీయాంశమైంది. మోహన్బాబు, మనోజ్లు పరస్పరం ఒకరిపై ఒకరు డయల్ 100 ద్వారా ఫిర్యాదు చేశారని పోలీసులు చెబుతున్నారు. స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయాలని ఇరువురికీ సూచించినట్టు పోలీసులు వెల్లడించారు.
మంచు మోహన్ బాబు వారసులు విష్ణు, మనోజ్ మధ్య అభిప్రాయభేదాలు ఉన్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. మంచు మనోజ్ పెళ్లి నుంచి విభేదాలు తారాస్థాయికి చేరినట్లు టాక్ ఉంది. మనోజ్ పెళ్లిలో విష్ణు ఎక్కువగా కనిపించకపోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత మనోజ్ సంబంధీకులపై విష్ణు దాడిచేసిన వీడియో అప్పట్లో వైరల్ అయ్యింది.
సంబంధిత కథనం