Mancherial Suicide భార్యను తీవ్ర వేధింపులకు గురి చేశాడు, మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ నల్లమల్ల బాలకృష్ణ. భర్త వేధింపులు తట్టుకోలేక భార్య జ్యోతి తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడటం స్థానికుల్ని కలిచివేసింది. మంచిర్యాల మునిసిపల్ కమిషనర్ బాలకృష్ణతో పాటు అతడి కుటుంబసభ్యుల వేధింపులతోనే తమ కూతురు బలవన్మరణానికి పాల్పడినట్లు జ్యోతి తల్లిదండ్రులు గంగవరపు రాంబాబు, రవీంద్రకుమారి ఆరోపించారు.
'మంగళవారం ఉదయం 9.30 గంటలకు తమ కుమార్తె ఫోన్ చేసి భర్త తనను చంపేలా ఉన్నారని వాపోయారు. జ్యోతి ఆత్మహత్య వెనుక అనుమానాలు ఉన్నాయని, న్యాయం చేసే వరకు ఇక్కడి నుంచి వెళ్లేది లేదని వారు స్పష్టం చేశారు. వివాహ సమయంలో మూడు ఎకరాల భూమితో పాటు రెండు లక్షల నగదు, బంగారు నగలు కట్నంగా ఇచ్చామన్నారు.
మొదట్లో పోలీస్ కానిస్టేబుల్గా పనిచేసిన బాలకృష్ణ మున్సిపల్ కమిషనర్గా ఎంపికైన తర్వాత నుంచి భార్యను వేధింపులకు గురి చేస్తున్నారు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే కోట్ల రుపాయల కట్నంతో పాటు అందమైన భార్య వస్తుందని పదేపదే వేధించేవాడని చెప్పారు. బాలకృష్ణకు పలువురితో వివాహేతర సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు.
ఇంటిలో భార్యను వేధిస్తూ శాడిస్ట్ మాదిరి సైకోలాగా ప్రవర్తించేవాడని, బయట మాత్రం అందరితో మంచివాడిగా ప్రవర్తించేవారని చెప్పారు. అమ్మను నాన్న తరచూ తిట్టేవారని ఎమ్మర్వో కుమార్తె భవిష్య, అమ్మమ్మ, తాతలకు చెప్పడం అందరిని కలిచివేసింది. మంచిర్యాల సీఐ నారాయణనాయక్ బాలకృష్ణపై కేసు నమోదు చేస్తామని హామీ ఇవ్వడంతో జ్యోతి మృతదేహం తరలింపునకు కుటుంబసభ్యులు అంగీకరించారు.
ఏడాదిన్నర క్రితం నిర్మల్ మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తున్న బాలకృష్ణ మంచిర్యాలకు బదిలీ అయ్యారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని లక్షెట్టిపేటరోడ్లోని ఆదిత్య ఇన్క్లైయిన్ అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటున్నారు. ఉదయం పిల్లలు పాఠశాలకు వెళ్లిన తర్వాత బాలకృష్ణ విధులకు హాజరయ్యారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ఇంటికి వచ్చిన బాలకృష్ణ తలుపు కొట్టగా భార్య జ్యోతి నుంచి ఎలాంటి స్పందన లేదు.
పదినిమిషాలైన తలుపు తీయకపోవడంతో కిటికిలో నుంచి చూడగా గదిలో ఫ్యానుకు ఉరివేసుకొని కనిపించింది. వెంటనే పక్క ఇంటి వ్యక్తి సహాయంతో తలుపును గట్టిగా తన్ని లోనికి వెళ్లారు. ఉరివేసుకొని ఉన్న జ్యోతిని కిందికి దించి చూడగా అప్పటికే మృతిచెందినట్లు భావించారు. ఆ తర్వాత సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
డీసీపీ సుధీర్ రామ్నాథ్ కెకాన్తో పాటు ఏసీపీ తిరుపతిరెడ్డిలు ఘటన జరిగిన తీరును పరిశీలించారు. మృతురాలు జ్యోతితో పాటు బాలకృష్ణల చరవాణులను సీజ్ చేశారు. కాలనీ వాసులతో పాటు ఇంటి పనిమనిషితో మాట్లాడి పలు విషయాలు తెలుసుకున్నారు. ఎమ్మార్వో బాలకృష్ణ సొంత ఊరు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేశావపురం. జ్యోతి స్వస్థలం కొణిజర్ల మండలం సీతారామపురం గ్రామమని పోలీసులు తెలిపారు. ఇరువురి కుటుంబసభ్యుల సమక్షంలో 2014, ఆగస్టు 14న వివాహమైంది. కానిస్టేబుల్గా ఎంపికై హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ.. గ్రూప్- 2 ద్వారా 2020లో మున్సిపల్ కమిషనర్గా ఎంపికయ్యారు. వీరికి రిత్విక్, భవిష్య ఇద్దరు పిల్లలుఉన్నారు.
పిల్లలను స్కూలుకు తయారు చేసి పంపిన జ్యోతి భర్త ఆఫీసుకు వెళ్లిన తర్వాత అఘాయిత్యానికి పాల్పడినట్లు భావిస్తున్నారు. పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన పిల్లలు ఇంటి వద్ద ఇంత మంది ఎందుకున్నారని అడగడం కలిచివేసింది. ఇంట్లోకి వెళ్లిన ఆ చిన్నారులకు అమ్మ కనిపించకపోవడంతో ఎక్కడంటూ అందరిని అడిగిన తీరు కంటతడి పెట్టించింది. మునిసిపల్ కమిషనర్ను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు.
టాపిక్