హైదరాబాద్ గుల్జార్ హౌస్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ భవనంలో మంటలు చెలరేగటంతో….ఈ ఘటనలో 16 మంది మృతి చెందారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ప్రాథమిక వివరాల ప్రకారం…ఆదివారం ఉదయం ఓ భవనంలో ప్రమాదం సంభవించింది. ఈక్రమంలోనే భవనంలో ఉన్న ఏసీ కంప్రెషర్ పేలటంతో తీవ్రత పెరిగింది. ఈ ఘోర ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. గాయపడిన వారిని దగ్గర్లోని ఆస్పత్రులకు తరలించారు.
ఈ అగ్నిప్రమాద ఘటనలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. మొదట ఎనిమిది మంది చనిపోగా… ఆ తర్వాత 11కు చేరింది. ఆ కాసేపటికే 17కు చేరిపోయింది. గాయపడిన వారికి వేర్వురు ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం.
షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే దట్టమైన పొగలు సంభవించాయి. అప్రమత్తమైన స్థానికులు…. పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అగ్నిప్రమాద సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఎస్డీఆర్ఎఫ్, పోలీసు సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భవనంలో ఉన్న కొందర్నీ బయటకు తీసుకురాగలిగారు.
పాతబస్తీ మీర్ చౌక్ ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పలువురు మరణించడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని ఓ ప్రకటన ద్వారా తెలిపారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఘటనపై బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ…. “ఒక కుటుంబానికి చెందిన ముత్యాల దుకాణంలో మంటలు చెలరేగాయి. వారి ఇల్లు దుకాణం పైన ఉన్న అంతస్తులో ఉంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగింది. ప్రమాదంలో చాలా మంది మరణించారు. కొందరు గాయపడ్డారు. కానీ హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం కాబట్టి… పోలీసు, మున్సిపల్, అగ్నిమాపక మరియు విద్యుత్ విభాగాలను బలోపేతం చేయాలి. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించారు. దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్ గ్రేషియా, క్షతగాత్రులకు రూ.50 వేల ఆర్ధిక సాయం అందిస్తున్నట్లు చెప్పారు” అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.
“ఉదయం పూట 6:16 గంటలకు ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం రాగానే వెనువెంటనే నిమిషాల్లో ఫైర్ సిబ్బంది వచ్చి అగ్ని ప్రమాద నివారణ చర్యలు చేపట్టి మంటలు ఆర్పేశారు. అందులో నివసిస్తున్న 17 మందికి తీవ్ర ఇబ్బందులు కలిగాయి. వారందరినీ హాస్పిటల్ కి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం వారందరికీ హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు. అగ్ని ప్రమాదంలో మెజారిటీ గా మరణించారనీ సమాచారం ఉంది. ప్రభుత్వం తరుపున అని రకాల చర్యలు చేపట్టాం” అని మంత్రి పొన్నం చెప్పారు.