Wine Shops Closed in Telangana : మందుబాబులకు మరోసారి బ్యాడ్ న్యూస్ అందింది. ఏప్రిల్, మే నెలలో పలుమార్లు వైన్స్ షాపులు మూతపడిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి కూడా బంద్ కానున్నాయి. ఈ మేరకు అధికారులు ఆదేశాలను జారీ చేశారు.
జూన్ 4 వ తేదీన పార్లమెంట్ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ఉంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా మరోసారి లిక్కర్ దుకామాలను మూసివేయాలని అధికారులు జారీ చేశారు. ఈ రోజంతా కూడా డ్రై డేగా ఉండనుంది. జూన్ 5వ తేదీన తిరిగి మద్యం దుకాణాలు తెరుచుకోనున్నాయి. ఎవరైనా అక్రమంగా మద్యం నిల్వ చేసి అమ్మితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
తెలంగాణలో మే 13 తేదీన లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరిగింది. అయితే మే 11 సాయంత్రం 6 గంటల నుంచే మద్యం దుకాణాలు క్లోజ్ అయ్యాయి. మే 13వ తేదీ సాయంత్రం తర్వాత తిరిగి ఓపెన్ అయ్యాయి. ఇక హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మాత్రం మే 14వ తేదీన దుకాణాలు తెరుచుకున్నాయి.
ఇక ఏప్రిల్ మాసంలోనూ రెండుసార్లు వైన్స్ షాపులు మూతపడ్డాయి. శ్రీరామనవమి వేళ ఏప్రిల్ 17 న హైదరాబాద్ జంట నగరాల్లో మద్యం దుకాణాలు మూతపడ్డాయి. అలాగే ఏప్రిల్ 23వ తేదీన హనుమాన్ జయంతి సందర్భంగా కూడా లిక్కర్ దుకాణాలు బంద్ అయ్యాయి.
తెలంగాణలోని 17 పార్లమెంట్ స్ఖానాలకు మే 13వ తేదీన పోలింగ్ జరిగింది. ఇందుకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జూన్ 4వ తేదీన జరగనుంది. ఇందుకోసం మొత్తం 34 కేంద్రాలను సిద్ధం చేశారు. 120 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేసినట్లు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. పోస్టల్ బ్యాలెట్ కోసం 19 కౌంటింగ్ హాల్స్ సిద్ధం చేయగా…. 12 కేంద్ర బలగాలతో కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.
AP Liquor Shops Close : ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా అల్లర్లు జరగకుండా జూన్ 3,4,5 తేదీల్లో వైన్ షాపులు బంద్ చేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఏపీలో జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. పోలింగ్ వేళ జరిగిన హింసాత్మాక ఘటనల దృష్ట్యా… ఫలితాల రోజు ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు.
ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన ఫలితాలు వెలువడనున్నాయి. ఇందుకోసం ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఎలాంటి గొడవలు జరగకుండా భారీగా బలగాలను మోహరించనుంది. పల్నాడుతో పాటు మరికొన్ని జిల్లాల్లో మరిన్ని చర్యలు తీసుకుంటున్నారు.కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ విధించారు. మరోవైపు ఏపీ వ్యాప్తంగా కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు పోలీసులు.