ఐదారు నెలల కిందట.. తెలంగాణ మద్యంకు బాగా డిమాండ్ ఉండేది. ముఖ్యంగా ఏపీ సరిహద్దు జిల్లాల్లో అమ్మకాలు విపరీతంగా ఉండేవి. అందుకు కారణం ఏపీలో మద్యం ధరలు ఎక్కువ కావడమే. దీంతో చాలామంది వ్యాపారులు సరిహద్దు ప్రాంతాల్లో వైన్ షాపులు దక్కించుకోవడానికి ఆసక్తి చూపేవారు. కానీ ప్రస్తుతం సీన్ రివర్స్ అయ్యింది. ఏపీ సరిహద్దులోని తెలంగాణ జిల్లాల్లో మద్యం అమ్మకాలు బాగా పడిపోయాయి.
ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లిక్కర్ సేల్స్ బాగా పడిపోతున్నాయి. గతేడాదితో పోలిస్తే.. సేల్స్ డౌన్ అయ్యాయి. ముఖ్యంగా మూడు నెలలుగా ఆశించిన స్థాయిలో అమ్మకాలు లేవు. ఈనెల కూడా టార్గెట్ను అందుకోవడం కష్టమే అని అధికారులు, వ్యాపారులు చెతున్నారు. గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే.. రూ.10 కోట్ల మేరకు అమ్మకాలు తగ్గాయని తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్లో మద్యం రేట్లు తగ్గడంతో ఆ ప్రభావం ఖమ్మం జిల్లాలో లిక్కర్ సేల్స్పై పడిందని వ్యాపారులు చెబుతున్నారు. గతంలో ఏపీలో బ్రాండెడ్ లిక్కర్ అందుబాటులో ఉండేది కాదు. దీంతో ఏపీ నుంచి వచ్చి తెలంగాణ సరిహద్దులోని షాపుల్లో కొనుక్కొని తీసుకెళ్లేవారు. అయితే.. గతేడాది అక్టోబర్లో ఏపీలో కొత్త మద్యం పాలసీని అమల్లోకి తెచ్చారు. అప్పటి నుంచి అన్ని బ్రాండ్లు అందుబాటులోకి వచ్చాయి. పైగా మద్యంపై రేట్లు కూడా తగ్గించారు. దీంతో ఇక్కడ నుంచి సరుకు తీసుకెళ్లడం లేదు. ఇప్పుడు అటు నుంచి ఇటు తీసుకొస్తున్నారు.
ముఖ్యంగా ఏపీ సరిహద్దులోని సత్తుపల్లి, మధిర, వైరా, ఖమ్మం-1, అశ్వారావుపేట ఎక్సైజ్ సర్కిళ్ల పరిధిలో మద్యం అమ్మకాలపై తీవ్ర ప్రభావం పడిందని తెలుస్తోంది. ఇటు ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా ఈనెలలో రెండ్రోజులు మద్యం దుకాణాలు మూసేయనున్నారు. 25న సాయంత్రం 4 గంటల నుంచి 27న సాయంత్రం 4 గంటల వరకు వైన్ షాపులు, బార్లు బంద్ చేయనున్నారు. ఈ ప్రభావం కూడా అమ్మకాలపై పడనుంది.
ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. తెలంగాణలో 15 శాతం వరకు మద్యం రేట్లు పెంచుతారని ప్రచారం జరుగుతోంది. రేట్ల పెంపు జరిగితే.. మద్యం అమ్మకాలపై మరింత ప్రభావం పడుతుందని, ఇంకా అమ్మకాలు పడిపోతాయని వ్యాపారులు చెబుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం రేట్లు పెంచితే.. ఏపీ మద్యం తెలంగాణ భారీగా సరఫరా అయ్యే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు.