SC on Telangana Group1: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సుప్రీం కోర్టులో లైన్ క్లియర్ అయ్యింది. గ్రూప్ 1పరీక్షల్ని వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్లపై జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. పరీక్షలు వాయిదా వేయడానికి నిరాకరించింది. దీంతో నేటి నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు యథావిధిగా జరుగనున్నాయి. ప్రస్తుతం ఉన్న దశలో జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు సీజే చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.
గ్రూప్ 1 మెయిన్స్ రిజర్వేషన్ల అమలు విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మరోవైపు నేటి నుంచి గ్రూప్ 1పరీక్షల్ని నిర్వహించందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. తెలంగాణలోని అన్ని ప్రాంతాల నుంచి అభ్యర్థులు హైదరాబాద్ చేరుకున్నారు. ఈ దశలో పరీక్షలు వాయిదా వేయడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది. నవంబర్ 20న తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగనున్నందున వాయిదా వేయాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఇప్పుడున్న దశలో పరీక్షలు వాయిదా వేస్తే విద్యార్థులు గందరగోళానికి గురవుతారని, ఈ పరిస్థితుల్లో వాయిదా వేయలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.
సోమవారం మధ్యాహ్నం 2గంటల నుంచి ఇంగ్లిష్ క్వాలిఫైయింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. మంగళవారం నుంచి వరుసగా సబ్జెక్టు పరీక్షలు నిర్వహించనున్నారు. గ్రూప్ 1 మెయిన్స్ రిజర్వేషన్ విధానంపై ఇప్పటికే పెద్ద ఎత్తున అభ్యతంరాలు వ్యక్తం అవుతున్నాయి. తగినంత గడువు లేదని అభ్యర్థులు పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపుతోంది.
తెలంగాణలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి మెయిన్స్ పరీక్షలు సోమవారం నుంచి జరుగుతాయి. గతంలో నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షల పేపర్ లీక్ కావడంతో వాటిని రద్దు చేశారు. దాాదాపు ఏడాదిన్నర తర్వాత మళ్లీ పరీక్షలు జరుగుతుండగా వాటిపై కూడా అభ్యర్థులె ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా లాఠీఛార్జీ ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి.
గ్రూప్1 పరీక్షల్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని 46 పరీక్ష కేంద్రాల వద్ద భారీ బందోబస్తు సిద్ధం చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 200 మీటర్ల వరకు ఐదుగురికి మించి ఉండేందుకు వీల్లేదు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఎస్సై ఆధ్వర్యంలో మహిళా కానిస్టేబుల్ సహా మొత్తం ఆరుగురు కానిస్టేబుళ్లు ఉండేలా ప్రణాళిక రూపొందించారు. పరీక్ష గది, చీఫ్ సూపరిం టెండెంట్, పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ నెల 21 నుంచి 27 వరకు జరిగే పరీక్షలకు సంబంధించి రోజూ ప్రశ్నప క్షేత్రాలు, జవాబు పత్రాలను తరలించే జీపీఎస్ అమర్చిన వాహనాలు నిర్దేశిత మార్గాల్లో ప్రయాణించేలా రూట్ మ్యాప్ ఖరారు చేశారు.