పేదలకు ఉచితంగా సన్నబియ్యాన్ని పంపిణీ చేయాలని రేవంత్ సర్కారు సంకల్పించింది. ఏప్రిల్ 1 నుంచి తెలంగాణ వ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ పథకం ప్రారంభం అయ్యింది. జిల్లాల్లో ప్రజా ప్రతినిధులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి భోజనాలు కూడా చేశారు. కానీ.. హైదరాబాద్లో మాత్రం ఇంతవరకు ఈ పథకం అమలు జరగలేదు. అందుకు కారణం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు.
మొన్నటిదాకా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా.. నగరవాసులకు ఇన్నిరోజులు సన్నబియ్యం అందలేదు. అయితే ఏప్రిల్ 25వ తేదీ నాటికి ఎన్నికల కోడ్ ముగిసింది. దీంతో భాగ్యనగరంలోనూ సన్న బియ్యం పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే గోదాముల నుంచి 653 రేషన్ షాపులకు సన్న బియ్యాన్ని చేరవేసే పనులు మొదలు పెట్టారు. మే 1 నుంచి నగరంలోని రేషన్ షాపుల ద్వారా అర్హులైన అందరికీ సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు.
ఈ పథకం 2025 మార్చి 31న ప్రారంభమైంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు.
రాష్ట్రంలోని దాదాపు 85 శాతం మంది ప్రజలకు అంటే.. 3.10 కోట్ల మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది.
పేద ప్రజలు నాణ్యమైన బియ్యం తినాలనే ఉద్దేశ్యంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. గతంలో పంపిణీ చేసిన బియ్యం నాణ్యత బాగాలేదని ప్రజలు తిరస్కరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ పథకం కోసం ప్రభుత్వం ఏటా రూ.10,600 కోట్లు ఖర్చు చేయనుందని అధికారులు చెబుతున్నారు.
ప్రతి లబ్ధిదారునికి నెలకు 6 కిలోల సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తారు. రాష్ట్రంలోని పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలోని రేషన్ షాపుల ద్వారా పంపిణీ జరుగుతుంది.
ఈ పథకం ద్వారా దేశంలోనే మొట్టమొదటిసారిగా పేదలకు ఉచితంగా సన్న బియ్యం అందిస్తున్నామని.. ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ పథకం శాశ్వతంగా కొనసాగుతుందని.. భవిష్యత్తులో ఏ ప్రభుత్వం మారినా దీనిని నిలిపివేయడానికి సాహసించదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అర్హులైన కుటుంబాలకు త్వరలో కొత్త కార్డులు అందుతాయని అధికారులు చెబుతున్నారు.
దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి త్రివర్ణ రేషన్ కార్డులు, పేదరిక రేఖకు పైన ఉన్న వారికి ఆకుపచ్చ రేషన్ కార్డులు జారీ చేస్తారు.
సంబంధిత కథనం