PM Modi To RFCL : కాసేపట్లో బేగంపేటకు ప్రధాని మోదీ…భద్రతా వలయంలో రామగుండం
PM Modi To RFCL ప్రధాని నరేంద్ర మోదీ రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ప్లాంటును నేడు జాతికి అంకితం చేయనున్నారు. ప్రధాని పర్యటనను వామక్షాలతో పాటు విద్యార్ధి సంఘాలు వ్యతిరేకిస్తున్నారు. విభజన చట్టంలో తెలంగాణకు రావాల్సిన హామీలను నెరవేర్చకుండా రాష్ట్ర పర్యటనకు రావడాన్ని తప్పు పడుతున్నారు.
PM Modi To RFCL తెలంగాణ పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి నిరసనలు తప్పడం లేదు. బేగంపేట విమానాశ్రయం నుంచి వాయుసేన హెలికాఫ్టర్లో రామగుండం చేరుకుంటారు. మరోవైపు తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన రాజకీయంగా అగ్గి రాజేసింది. ప్రధాని పర్యటనను వామపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ప్రధాని పర్యటనకు దూరంగా ఉంటున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరవుతారు.
ట్రెండింగ్ వార్తలు
రామగుండం ప్రధాని సభకు సిఎం కేసీఆర్ దూరంగా ఉంటున్నారు. ఆహ్వానం పంపండలో కేంద్ర ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించలేదని టిఆర్ఎస్ ఆరోపిస్తోంది. మోదీ పర్యటనను వామపక్షాలు, సింగరేణి కార్మికులు వ్యతిరేకిస్తుండటంతో భారీ ఎత్తున పోలీసు బలగాలను మొహరించారు.
తెలంగాణలో మోదీ పర్యటనపై పలు చోట్ల నిరసనలు చెబుతున్నారు.మోదీకి వ్యతిరేకంగా హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు వెలిశాయి. ప్రధాని మోదీ పర్యటనకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనల హోరు కొనసాగుతున్నది. బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సింగరేణి వ్యాప్తంగా కార్మికులు ఆందోళన చేపట్టారు. మందమర్రి, బెల్లంపల్లి, భూపాలపల్లి, శ్రీరామ్పూర్, గోదావరిఖని, ఇల్లందు, కొత్తగూడెం, మణుగూరు ఏరియాల్లో కార్మికులు నిరసన వ్యక్తంచేశారు.
కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించడంతోపాటు నల్లజెండాలను ఎగురవేశారు. మోదీ గోబ్యాక్ నినాదాలు చేశారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో పెద్దపల్లి జిల్లాలో ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి. సింగరేణిలోని 5వ ఇంక్లైన్ వద్ద సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావును, రామగిరిలో టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
గోదావరిఖని 11వ గని వద్ద ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్యతో పాటు ఇతర నాయకులను అరెస్టు చేశారు. తెలంగాణ రైతు సంఘం అధ్యక్షురాలు పస్య పద్మను హౌస్ అరెస్ట్ చేశారు. జీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి అరెస్టుకు నిరసనగా కార్మికులు నిరసన వ్యక్తంచేశారు. ప్రధాని పర్యటకు వ్యతిరేకంగా వామపక్షాలు రామగుండం బంద్కు పిలుపు ఇవ్వడంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
తెలంగాణకు మోదీ ఇచ్చి హామీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తూ గుర్తుతెలియని వ్యక్తులు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.ఐటీఐఆర్ ఏర్పాటు ఎంతవరకు వచ్చిందని, టెక్స్టైల్ పార్కు ఏమైందని, మిషన్ భగీరథకు ఎన్ని నిధులు ఇచ్చారని, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడికి పోయిందని, డిఫెన్స్ కారిడార్, బయ్యారం స్టీల్ప్లాంట్, మెడికల్ కాలేజీలు ఎన్ని ఇచ్చారని, పసుపు బోర్డు ఎప్పుడు ఏర్పాటు చేస్తారని, ఐఐఎం ఏమైందని ప్రశ్నల రూపంలో నిలదీశారు. చేనేతపై విధించిన జీఎస్టీని ఎత్తివేసిన తర్వాత తెలంగాణకు రావాలంటూ ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. తెలంగాణలో పలు ప్రాంతాల్లో మోదీకి వ్యతిరేకంగా బ్యానర్లను ఏర్పాటు చేయడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. . టిఆర్ఎస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే రాజకీయం చేస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది.
రామగుండం ఫెర్టిలైజర్ ప్లాంటును జాతికి అంకితం చేసిన తర్వాత ప్రధాని మోదీ తిరిగి హైదరాద్ నుంచి ఢిల్లీ చేరుకుంటారు. మధ్యాహ్నం ఒకటిన్నరకు ప్రధాని మోదీ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. బేగంపేట ఎయిర్పోర్ట్ వెలుపల ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత ప్రత్యేక హెలికాఫ్టర్లో రామగుండం బయలుదేరుతారు. మధ్యాహ్నం మూడున్నర నాలుగ్గంటల మధ్య ఆర్ఎఫ్సిఎల్ ప్లాంటును సందర్శిస్తారు. రామగుండంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
రామగుండంలో రూ.2268 కోట్లతో చేపట్టే జాతీయ రహదారుల విస్తరణకు ప్రధాని వర్చువల్గా ప్రారంభిస్తారు. భద్రాచలం సత్తుపల్లి రైల్వే లైన్ను వర్చువల్ గా ప్రారంభిస్తారు.మరోవైపు రామగుండం పర్యటనకు సిఎం కేసీఆర్ దూరంగా ఉంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రధాని కార్యక్రమంలో పాల్గొంటారు.