Law College: శాతవాహన యూనివర్సిటీలో ‘లా కాలేజీ’ మంజూరు… వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతులు మొదలవుతాయన్న బండి-law college sanctioned for satavahana university in karim nagar ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Law College: శాతవాహన యూనివర్సిటీలో ‘లా కాలేజీ’ మంజూరు… వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతులు మొదలవుతాయన్న బండి

Law College: శాతవాహన యూనివర్సిటీలో ‘లా కాలేజీ’ మంజూరు… వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతులు మొదలవుతాయన్న బండి

HT Telugu Desk HT Telugu

Law College: శాతవాహన యూనివర్సిటీకి ‘లా కాలేజీ’ మంజూరైంది… వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతులు మొదలవుతాయని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ వివరించారు. కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించి వచ్చే విద్యా సంవత్సరం నుంచే లా కళాశాల తరగతులు ప్రారంభించేలా ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.

శాతవా‍హన యూనివర్శిటీలో లా కాలేజీ కోసం విజ్ఞప్తి చేస్తున్న కేంద్రమంత్రి బండి సంజయ్

Law College: కేంద్ర కార్మిక ఉపాధి క్రీడా వ్యవహారాల శాఖ మంత్రి మన్సూక్ మాండవీయతో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ భేటీ అయ్యారు. కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో లా కళాశాల మంజూరు చేయడంతో పాటు అంబేద్కర్ స్టేడియంలో సింథటిక్ ట్రాక్ ఏర్పాటు చేయాలని వినతి పత్రాలు సమర్పించారు.

కరీంనగర్ లోని శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో లా కాలేజీ (న్యాయ కళాశాల) అనుమతి ఇవ్వాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ ను కోరారు.

శాతవాహన వర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఉమేశ్ కుమార్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ సునీల్ రావులతో కలిసి బండి సంజయ్ ఢిల్లీలో కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్వాల్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు.

పార్లమెంట్ లో అరగంటకుపైగా కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు. శాతవాహన వర్శిటీ పరిధిలో వచ్చే విద్యా సంవత్సరానికిగాను 120 మందితో (రెండు సెక్షన్లతో కలిపి) లా కాలేజీని నడిపేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వానికి గతంలో విజ్ఝప్తి చేసినట్లు తెలిపారు.

ఈ నేపథ్యంలో వర్చువల్ ద్వారా తనిఖీ నిర్వహించిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వివరణలతో కూడిన నివేదిక కోరిందని పేర్కొన్నారు. బార్ కౌన్సిల్ ఆదేశాల మేరకు వివరణాత్మక నివేదికను పంపామని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని మూడేళ్ల లా కోర్సుకు అనుమతి ఇవ్వాలని విజ్ఝప్తి చేశారు.

బండి సంజయ్ వినతికి సానుకూలంగా స్పందించిన అర్జున్ మేఘ్వాల్ అందుకు అనుగుణంగా శాతవాహన వర్శిటీకి అనుబంధంగా సాధ్యమైనంత తొందర్లో లా కాలేజీకి అనుమతి ఇస్తామని హామీ ఇచ్చారు. రాబోయే విద్యా సంవత్సరం(2025-26) నుండే లా కాలేజీ ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కేంద్ర మంత్రి ఆదేశించారు.

అంబేద్కర్ స్టేడియానికి నిధులివ్వండి...

ఖేలో ఇండియా పథకంలో భాగంగా కరీంనగర్ జిల్లాలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్టేడియంలో క్రీడా సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులను మంజూరు చేయాలని కోరుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కేంద్ర కార్మిక, ఉపాధి, క్రీడా వ్యవహారాల శాఖ మంత్రి మన్సూక్ మాండవీయను కోరారు.

ఢిల్లీలో విచ్చేసిన కరీంనగర్ మాజీ మేయర్ సునీల్ రావు, శాతవాహన యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఉమేశ్ కుమార్ లతో కలిసి బండి సంజయ్ కేంద్ర మంత్రి మాండవీయను కలిసి వినతి పత్రం అందజేశారు. తెలంగాణలోని అత్యంత పెద్ద నగరాలలో ఒకటైన కరీంనగర్ విద్య, క్రీడల్లో ప్రత్యేక గుర్తింపు పొందింది. అందులో భాగంగా కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్, వైద్య కళాశాలలతోపాటు ఇతర విద్యాసంస్థలున్నాయని తెలిపారు.

ముఖ్యంగా క్రీడల్లో కరీంనగర్ ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుందన్నారు. అర్జున అవార్డు గ్రహీత మదాసు శ్రీనివాసరావు కరీంనగర్‌కు చెందినవారేనని, ఖేలో ఇండియా లేదా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇతర పథకాల ద్వారా కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియం అభివృద్ధికి తగిన నిధులు మంజూరు చేయాలని కోరారు.

22.20 ఎకరాల్లో అంబేద్కర్ స్టేడియం...

1986లో 22.20 ఎకరాల భూమి బహుళ ప్రయోజనార్థ అంబెడ్కర్ స్టేడియం కోసం కేటాయించడం జరిగిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. 1998-2000 మధ్య ఎంపీ లాడ్స్, సింగరేణి కాలరీస్, ఎన్టీపీసీ, ఇతర ప్రైవేట్ సంస్థల సహకారంతో లెవెలింగ్, గ్యాలరీలు, 8-లేన్ 400 మీటర్ల అథ్లెటిక్స్ ట్రాక్ వంటి అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు.

రోజురోజుకూ అథ్లెట్ల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుత మట్టి ట్రాక్ కారణంగా అనేక మంది గాయాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని దృష్టిలో ఉంచుకుని అంబేద్కర్ స్టేడియం అభివృద్ధిలో భాగంగా ‘‘ 8-లేన్ సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్ వల్ల మట్టి ట్రాక్ స్థానంలో సింథటిక్ ట్రాక్ ఏర్పాటు చేయాలని కోరారు.

అథ్లెట్లు రాత్రి వేళల్లో కూడా సాధన చేసేందుకు ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేయాలని, దాంతోపాటు పోటీలు జరుగుతున్నప్పుడు ప్రస్తుత ఓపెన్ గ్యాలరీ(10)ల్లో క్రీడాకారులు, ప్రేక్షకులకు రక్షణ లేకుండా ఇబ్బంది కలిగిస్తున్నందున గ్యాలరీలపై తగిన (కెనోపీ) ఏర్పాట్లు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తద్వారా కరీంనగర్ అథ్లెట్లు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ చేసి దేశానికి గౌరవం తీసుకురావడానికి అనేక అవకాశాలున్నాయని పేర్కొన్నారు. అంబేద్కర్ స్టేడియానికి తగిన నిధులు కేటాయింపుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.

(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)

సంబంధిత కథనం