ప్రయాణికుల జేబులు కొల్లగొట్టాలని చూడటం దుర్మార్గం - కేటీఆర్-ktr strongly condemns the increase in ticket fares in rtc buses ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  ప్రయాణికుల జేబులు కొల్లగొట్టాలని చూడటం దుర్మార్గం - కేటీఆర్

ప్రయాణికుల జేబులు కొల్లగొట్టాలని చూడటం దుర్మార్గం - కేటీఆర్

ఆర్టీసీ బస్సుల్లో టికెట్ల ధరల పెంపును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఏకంగా ఒకేసారి 10 రూపాయలు పెంచి జంట నగరంలోని పేద మధ్యతరగతి ప్రయాణికుల జేబులను కొల్లగొట్టాలని చూడటం దుర్మార్గమని విమర్శించారు.

ఆర్టీసీ ఛార్జీల పెంపుపై కేటీఆర్ ఆగ్రహం

హైదరాబాద్ లో నడిచే ఆర్టీసీ బస్సుల్లో టికెట్ల ధరల పెంపుపై కేటీఆర్ స్పందించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఒకేసారి 10 రూపాయలు పెంచటం దుర్మార్గమన్నారు. జంట నగరాల్లోని పేద మధ్యతరగతి ప్రయాణికుల జేబులను కొల్లగొట్టాలని చూస్తున్నారని దుయ్యబట్టారు.

“పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో అల్లాడుతున్న తరుణంలో.. ప్రతి ప్రయాణికుడిపై నెలకు 500 రూపాయల అదనపు భారం మోపితే బడుగుజీవులు ఎలా బతకాలో ముఖ్యమంత్రే సమాధానం చెప్పాలి. ఇప్పటికే విద్యార్థుల బస్ చార్జీలు, టీ-24 టిక్కెట్ చార్జీలను పెంచింది చాలదన్నట్టు.. ఇప్పుడు కనీస చార్జీపై కనికరం లేకుండా 50 శాతం టిక్కెట్టు ధరలను పెంచడం రేవంత్ అసమర్థ విధానాలకు నిదర్శనం” అని కేటీఆర్ విమర్శించారు.

“రాజధాని వాసుల నడ్డివిరిచి ప్రతినిత్యం దాదాపు కోటి రూపాయల భారం మోపాలని చూస్తున్న ముఖ్యమంత్రి హైదరాబాద్ ప్రజలపై కక్ష పెంచుకుంటున్నట్టు అర్థమవుతోంది. తుస్సుమన్న ఫ్రీ బస్సు పథకంతో దివాళా తీసిన ఆర్టీసిని గట్టెక్కించాల్సిందిపోయి… సామాన్య ప్రయాణికుల నడ్డి విరచాలని చూడటం క్షమించరానిది” అని కేటీఆర్ అన్నారు.

జేబులు గుల్ల చేస్తున్నారు - కవిత

టికెట్ ధరల పెంపుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు. “సామాన్య ప్రజలంటే ఎందుకింత కోపం ముఖ్యమంత్రి గారు? మొన్నటికి మొన్న సిటీ బస్ పాస్ ల ధరలు భారీగా పెంచి చిరుద్యోగులు, నగర ప్రజలపై పెనుభారం మోపారు. ఇప్పుడు బస్ చార్జీలను అమాంతం పెంచేశారు.. బస్సు ఎక్కడమే పాపం అన్నట్టుగా ప్రజల జేబులను గుల్ల చేస్తున్నారు. గ్రీన్ జర్నీ పేరుతో సామాన్యుల రక్తాన్ని జలగల్లా పీల్చేస్తున్నారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్ జంటనగరాల పరిధిలో నడిచే ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలను పెంచాలని తాజాగానే ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, ఈ -ఆర్డినరీ, ఈ-ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఈ పెంపు ఉండనుంది. ఈనెల 6వ తేదీ నుంచే ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.

మొదటి 3 స్టేజీల వరకు రూ.5 చొప్పున పెంచాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇక 4వ స్టేజీ నుంచి రూ.10 అదనపు ఛార్జీ వసూలు చేస్తారు. ఇక మెట్రో డీలక్స్‌, ఈ-మెట్రో ఏసీ సర్వీసుల్లో మొదటి స్టేజీకి రూ.5గా ఉంటుంది. ఇక రెండో స్టేజీ తర్వాత అదనంగా రూ.10 ఛార్జీ వసూలు చేయనున్నారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం