KTR : కాళేశ్వరం కట్టిందే కేసీఆర్.. వెళ్లి చూడాల్సింది మేము కాదు, కాంగ్రెస్ పార్టీనే
KTR Comments On CM Revanth : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సీరియస్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్రాన్ని నడుపుతున్న వ్యక్తే ఒక క్రిమినల్ అంటూ విమర్శలు గుప్పించారు.

KTR Comments On CM Revanthreddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. శనివారం తెలంగాణభవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన…. తెలంగాణ ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని విమర్శించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా జలాలను KRMBకి అప్పజెప్పిందన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా “ఛలో నల్లగొండ” కార్యక్రమాన్ని తీసుకున్నామని తెలిపారు.
కాళేశ్వరం కట్టిందే మేము….
ఈ నెల 13న ఛలో నల్గొండ సభను విజయవంతం చేయడం పై కృష్ణా బేసిన్ లో ఉండే జిల్లాల ప్రజలు నాయకులు కదిలి రావాలని పిలుపునిచ్చారు కేటీఆర్(KTR). ఎవరైనా మా పార్టీ నుంచి వెళ్తారు అంటే దానిపై మేము చేసేది ఏం లేదని అభిప్రాయపడ్డారు. “రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి కాళేశ్వరం గురించి ఎలాంటి అవగాహన లేదు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Lift Irrigation Project) గొప్పతనం గురించి తెలుసుకోవాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు వెళ్లొచ్చు, చూసి నేర్చుకోవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎన్ని బరాజులు ఉన్నాయి, ఎన్ని కాలువలు ఉన్నాయి, ఎన్ని పంప్ హౌస్ లు ఉన్నాయి అనే అంశాలను కాంగ్రెస్ తెలుసుకోవచ్చు. కానీ కాళేశ్వరం గురించి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కనీస ఇంగిత జ్ఞానం లేదు. మేడిగడ్డ కట్టిందే కేసీఆర్. కాళేశ్వరం లో వారికీ ఓనమాలు కూడా తెలవదు. కాళేశ్వరం అద్భుతమైన ప్రాజెక్ట్. కాళేశ్వరం కట్టిందే మేము ...కాళేశ్వరం గురించి కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియకపోతే తెలుసుకోవచ్చు. కాళేశ్వరం కట్టిందే మేము అయినప్పుడు చూడాల్సింది మేము కాదు… కాంగ్రెస్ పార్టీనే. కాళేశ్వరం ద్వారా వచ్చిన నీటితో పండించిన పంటల సహాయంతోనే ఈరోజు దేశానికి తెలంగాణ ధాన్యాదారంగా నిలుస్తున్నది. దేశానికి అన్నపూర్ణగా మారింది ప్రాజెక్టులో ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం సరిచేయాలి... ప్రభుత్వానికి పూర్తి అధికార యంత్రాంగం ఉంది. మేడిగడ్డ వద్ద జరిగిన ఇబ్బందిని పట్టుకొని మెత్తం కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా విఫలమైందనే కుటిల ప్రయత్నం చేస్తే అది సూర్యుడి మీద ఉమ్మేసినట్లే” అవుతుందని కామెంట్స్ చేశారు కేటీఆర్.
రాజకీయ దురుద్దేశంతో అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Lift Irrigation Project) అపవాదుకి గురిచేసి భ్రష్టు పట్టించాలని చూస్తే అది కాంగ్రెస్ అమాయకత్వమే అవుతుందని దుయ్యబట్టారు కేటీఆర్. ఎక్కడైనా తప్పులు జరిగితే బయటపెట్టండి, ఏ విచారణకైనా సిద్ధమని గతంలోని పదుల సార్లు చెప్పామని గుర్తు చేశారు. కాంగ్రెస్ తీరు చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీనే అధికారంలో ఉంది.. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నారన్నట్టు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కేవలం బట్ట కాల్చి మీదేసే ప్రయత్నం చేస్తున్నారు, అడ్డగోలుగా భాద్యత లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. “రాష్ట్రాన్ని నడుపుతున్న వ్యక్తినే ఒక క్రిమినల్. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన దొంగ. ఆయనకు క్రిమినల్ ఆలోచనలు తప్ప ఇంకొకటి లేదు. ఆయన ఎవరిపైనైనా చర్యలు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు.. అధికారం ఆయన చేతిలో ఉంది.. ఎవరిపైన అయినా నిరభ్యంతరంగా చర్యలు తీసుకోవచ్చు” అంటూ కేటీఆర్ మాట్లాడారు.