ప్రజా పాలన పర్సంటేజీల పాలనగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. అవినీతి, కమీషన్ల నుంచి దృష్టి మరల్చేందుకే నోటీసుల డ్రామా అడుతున్నారని విమర్శించారు. కమిటీల పేరుతో, కమీషన్ల పేరుతో కాలయాపన చేసే ప్రయత్నాలను చూస్తూ ఊరోకమని హెచ్చరించారు. ఇవాళ నల్గొండలో మీడియాతో మాట్లాడిన ఆయన… కేసీఆర్ కు నోటీసులు ఇవ్వటంపై స్పందించారు.
“గత 17 నెలలుగా పాలన చేతకాక, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించే నాటకాలు ఆడుతోంది. అందులో భాగంగానే కేసీఆర్ గారికి నోటీసులు. కాళేశ్వరం ప్రాజక్టును విఫల ప్రయోగంగా చూపించేందుకు కాంగ్రెస్, బీజేపీ కలిసి చేస్తున్న కుట్ర. ఎన్ని నోటీసులు ఇచ్చినా అవన్నీ దూది పింజలు లాగా తేలిపోతాయన్నారు. దేశంలోని న్యాయవ్యవస్థ మీద అపార గౌరవం ఉంది. ముమ్మాటికి ధర్మం గెలుస్తుంది” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణకు మేలు చేసిన వారిని దేవుడు కాపాడుతాడన్న నమ్మకం ఉందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కమీషన్ల కోసం కక్కుర్తి పడడంతో వేల కోట్ల ప్రజాధనం వృథా అయిందన్నారు. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతే ఇప్పటివరకు ఆ నిర్మాణ సంస్థ మీద చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కనీసం విచారణ కూడా జరపలేదన్నారు. వట్టెం పంప్ హౌస్ మునగడం, పెద్దవాగు ప్రాజెక్టు రెండుసార్లు కొట్టుకుపోవడం మీద కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ జరపలేదని గుర్తు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం వెనుక ఉన్న మతలబు ఏందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎస్ఎల్బీసి టన్నెల్ కూలి 3 నెలలు గడుస్తుంటే అందులో నుంచి శవాలను తీసే సోయి ఈ ప్రభుత్వానికి లేదని కేటీఆర్ దుయ్యబట్టారు. అసలు ఆ టన్నెల్ ఎందుకు కూలిందో చెప్పే తెలివి ముఖ్యమంత్రికి, మంత్రులకు లేదన్నారు. సమర్థవంతమైన ప్రభుత్వం ఉంటే ఈ మూడు నెలల కాలంలో మంగళ గ్రహం నుంచి కూడా మనుషులను తిరిగి తెచ్చేదని చెప్పారు. కానీ ఈ చేత కానీ ప్రభుత్వానికి టన్నెల్ నుంచి చనిపోయిన వారి శవాలు తెచ్చే శక్తి లేదని కామెంట్స్ చేశారు.
ఎన్నికల ప్రచారంలో చెప్పిన ప్రతీ హామీని అమలు చేసేదాకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. హామీలు అమలు చేయకుండా డిసెప్షన్, డిస్ట్రక్షన్, డిస్ట్రాక్షన్ అనే చిల్లరమల్లర ప్రయత్నాలు చేస్తే తెలంగాణ ప్రజలు తిరగబడే రోజు వస్తుందని హెచ్చరించారు.