కాళేశ్వరం ప్రాజెక్టుపై నికృష్టమైన, నీచమైన రాజకీయాలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడింట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో జరిగిన చిట్చాట్లో మాట్లాడిన ఆయన…. కాంగ్రెస్, బీజేపీ కలసి కాళేశ్వరంపై చేస్తున్న దుష్ప్రచారం కూడా త్వరలో తేలిపోతుందని వ్యాఖ్యానించారు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపైన చేసిన దుష్ప్రచారం తేలిపోయిందని…తాజాగా సుప్రీం కోర్టు సాక్షిగా నిజాలు బయటకు వచ్చాయని కేటీఆర్ గుర్తు చేశారు. కాళేశ్వరంపై చేస్తున్న దుష్ప్రచారం కూడా త్వరలో తేలిపోతాయని చెప్పారు. ప్రజాపాలన పర్సంటేజీ పాలనగా మారిందన్న ఆయన… దాన్నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే నోటీసుల వ్యవహారాన్ని తెరపైకి తీసుకువచ్చాని విమర్శించారు.
“కాంగ్రెస్ పార్టీ కమీషన్లు బయటపడుతున్నాయని తెలిశాకే ఇప్పుడు నోటీసుల పేరిట తమాషాలు చేస్తున్నారు. జస్టిస్ ఘోష్ తన నివేదిక పూర్తయిందని, విచారణ పూర్తయిందన్నారు. అయితే మళ్లీ ప్రభుత్వం ఎందుకు గడువు పొడిగించింది..? అనే విషయాన్ని ప్రభుత్వం చెప్పాలి. కాళేశ్వరం నోటీసులు ఇప్పటి దాకా నేరుగా అందినట్టు సమాచారం లేదు. అందిన తర్వాత ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటాం” అని కేటీఆర్ ప్రకటించారు.
“కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్ని బ్యారేజీలను కూలగొట్టి మళ్లీ టెండర్ల పిలిచి, 20 నుంచి 30 శాతం కమీషన్లు తీసుకోవాలన్నదే అసలు ఏజెండా సుప్రీం కోర్టుకు కాళేశ్వరం ప్రాధాన్యత, గొప్పతనం అర్థమైంది. సెంట్రల్ వాటర్ కమిషన్కు అర్థమైంది, అందుకే 'ఇరిగేషన్ మార్వెల్' అన్నారు. న్యాయమూర్తులకు అర్థమవుతుంది, కానీ ఇక్కడ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రికి అర్థమవడం లేదు. పాలమూరు-రంగారెడ్డిపై ముఖ్యమంత్రి చేసిన కుట్రలు విఫలమయ్యాయి. 'పాలమూరు బిడ్డ'ను అని చెప్పుకున్న రేవంత్ రెడ్డి ఆ ప్రాజెక్టును ఎందుకు పక్కన పెట్టారు? పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై సుప్రీం కోర్టు తీర్పు చెప్పినట్టే, కాళేశ్వరంపైన కూడా స్పష్టమైన తీర్పులు వస్తాయి” అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.
580 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే, ముఖ్యమంత్రి అందాల పోటీలో ఉండడం కరెక్టా? అని కేటీఆర్ ప్రశ్నించారు. అన్నదాతల ధాన్యం వర్షంలో కొట్టుకుపోతుంటే, అందాల పోటీలకు రేవంత్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వ దగ్గర ఒక రూపాయి కూడా లేదు అని చెప్పి… 200 కోట్లు అందాల పోటీలకు ఖర్చు పెట్టడం కరెక్టా? అని నిలదీశారు.
“మిస్ వరల్డ్ బ్యూటీస్కి కూడా రేవంత్ రెడ్డి చూపిస్తున్నది అంతా మా ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులు మాత్రమే. నిజాం కట్టిన చార్మినార్ లేదా కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులు తప్ప, కాంగ్రెస్ పార్టీ కట్టిన ఒక్కదానినైనా రేవంత్ రెడ్డి చూపించగలడా..? కాళేశ్వరంలోని రెండు పిల్లర్లకు ఇంత రాద్ధాంతం చేస్తున్న కాంగ్రెస్, ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై ఏం చేసింది? కమీషన్ల కోసం ఎస్ఎల్బీసీ హడావిడిగా మొదలుపెట్టారు” అని కేటీఆర్ ఆరోపించారు.
“రేవంత్ రెడ్డిలో అపరిచితుడు ఉన్నాడు. ఒకరోజు కాళేశ్వరాన్ని 'కూలేశ్వరం' అంటాడు. మరో రోజు కాళేశ్వరంలోని మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు నీళ్లు తెస్తామంటారు. రేవంత్ రెడ్డికి భయంకరమైన మానసిక వ్యాధి ఉంది. అందుకే ఒకే అంశంపై ఆయన రోజుకోలా మాట్లాడతారు” అంటూ సీఎంపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు.
సంబంధిత కథనం