జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్లో కొందరు నేతలు చేరారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సమక్షంలో షేక్పేట్ డివిజన్కు చెందిన బీజేపీ సీనియర్ నాయకులు చెర్క మహేష్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
'జూబ్లీహిల్స్ ప్రజలు 'కారు' కావాలా, 'బుల్డోజర్' కావాలా నిర్ణయించుకోవాలి. జూబ్లీహిల్స్ ఎన్నికతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలు, ప్రస్తుతం రాష్ట్రంలో రెండు సంవత్సరాలుగా అధికారంలో ఉన్నది ఎవరో చెప్పాలి. ఎన్నికల్లో బుద్ధి చెబితేనే కాంగ్రెస్ పార్టీకి సోయి వస్తది. రెండు సంవత్సరాల్లో సంపాదించిన మొత్తం అవినీతి సొమ్మును జూబ్లీహిల్స్లో ఖర్చుపెడతారు. కాంగ్రెస్ పార్టీ ఓటుకు రూ. 10,000 ఇస్తారు.' అని కేటీఆర్ అన్నారు.
బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి పనికిరాని పార్టీ అని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేస్తే మోరీలో వేసినట్లే అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ నగరం తిరిగి అభివృద్ధి గాడిన పడాలంటే కేసీఆర్ తిరిగి రావాల్సిందేనని, అది జూబ్లీహిల్స్ నుంచే మొదలు కావాలని పిలుపునిచ్చారు కేటీఆర్.
ఇచ్చిన హామీల అమలులో చేసిన మోసం గురించి కాంగ్రెస్ పార్టీపై ప్రజలు కోపంగా ఉన్నారని ఆ పార్టీ అర్థం చేసుకుంటదని కేటీఅర అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతేనే నెలకు 4 వేల పెన్షన్లు వస్తాయని, ఎన్నికల కోసం చెప్పిన హామీలన్నీ అమలు అవుతాయని చెప్పారు. ఒకవేళ కాంగ్రెస్కు ఓటు వేస్తే, ప్రజలను తాము మోసం చేసినా మిమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు అని కాంగ్రెస్ పార్టీ భావిస్తుందన్నారు కేటీఆర్.
'ఆరు గ్యారంటీలు చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసింది. అన్ని అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కింది. ఈ రెండు సంవత్సరాలుగా ఒక్కటంటే ఒక్క మంచి పని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేకపోయింది. ఒక్క ఇల్లు కట్టలేదు, ఒక్క ఇటుక పెట్టలేదు, కానీ రెండు లక్షల 80 వేల కోట్ల రూపాయల అప్పుల్ని మాత్రం చేసింది. గరీబోళ్ల ఇండ్లు ఎక్కడుంటే అక్కడికి బుల్డోజర్లు పంపించి, హైదరాబాద్లో ఇళ్లు కూలగొట్టిస్తున్నాడు రేవంత్ రెడ్డి.' అని కేటీఆర్ అన్నారు.
కోర్టులు, చట్టబద్ధమైన డాక్యుమెంట్లు ఇవేవీ చూడకుండా పేదవాళ్ళ ఇండ్లపైన బుల్డోజర్లను రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నడిపిస్తుందని కేటీఆర్ విమర్శించారు. అన్నీ తెలిసి కూడా బీసీ రిజర్వేషన్ల అంశంలో రేవంత్ రెడ్డి మోసం చేశారన్నారు. పార్లమెంట్లో చేయాల్సిన చట్టం అసెంబ్లీలో చేస్తే చెల్లదని తెలుసు అని, ఇచ్చిన జీవోను కోర్టు కొట్టేస్తుందని కూడా తెలిసి మరీ బీసీ రిజర్వేషన్ల పేరుతో నాటకాలు ఆడి మోసం చేశారని విమర్శించారు.
అజారుద్దీన్కు ఇస్తామని చెప్పిన ఎమ్మెల్సీ కూడా ఆయనకు రాదని తెలుసు, కానీ ఆయనను కూడా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నారు కేటీఆర్. ముస్లింలకు ఇస్తామని చెప్పిన ఖబరస్థాన్ విషయంలో కూడా మోసం చేశారన్నారు. తెలిసి మరీ ప్రజలను మోసం చేయడమే రేవంత్ రెడ్డి నైజమని పేర్కొన్నారు. ఆయన నిజాయితీగా చెబుతూ మరీ మోసం చేస్తున్నాడని, గతంలోనే 'మోసం చేసే వాళ్ళనే ప్రజలు నమ్ముతారు' అని రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పినట్టుగా గుర్తు చేశారు. రెండు సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్క పని చేయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని, రెండు సంవత్సరాలు కేవలం కేసీఆర్ నామ జపం చేసి కాలం గడిపేశారన్నారు.