జూన్, జులైలో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. స్థానిక ఎన్నికలు వచ్చే నేపథ్యంలో…. ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి ప్రజల్లో ఉండాలని పిలుపునిచ్చారు. పార్టీ సత్తా ఏంటో చూపాలన్నారు.
శుక్రవారం ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలోని మిట్టపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. జిల్లాల్లో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ…. ధాన్యం కొనుగోలు జరగడం లేదని విమర్శించారు. 17 నెలల్లో జిల్లాకు ఏం జరిగిందో ప్రజలు ఆలోచన చేయాలని వ్యాఖ్యానించారు.
“కేసీఆర్ ప్రజల కోసం సీతారామా ప్రాజెక్ట్ తెస్తే ఆ నీళ్ళు నెత్తిన జల్లుకునారు కానీ ప్రజలకు ఏమి చేయలేదు. ఉప ముఖ్యమంత్రి భట్టి అఫిడవిట్, నోట్లు అబద్ధపు హామీలు అన్ని ఇచ్చాడు. తప్పకుండా ఇచ్చిన హామీని 100 రోజుల్లో చేస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. కేసీఆర్ కిట్ అనే పథకం అద్భుతమైన పథకం. కాంగ్రెస్ వచ్చాక ఆ పథకం ఎత్తేశారు. రైతుబంధు గురించి ఆనాడు రెండు పంటలకు ఇస్తావా..? అని అడిగిన రేవంత్ నేడు ఒక్క పంటకి కూడా ఇవ్వడం లేదు” అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
“రైతు రుణమాఫీ లేదు, షాది ముబారక్ లేదు. వాళ్ళు చెప్పిన ఏ హామీ అయినా నెరవేర్చరా? మార్పు బాగుందా? మార్పు కావాలని జిల్లా మొత్తం కాంగ్రెస్కి ఓటేశారు. కాంగ్రెస్ను నమ్మి మంచి మంచి నాయకులను ఓడగొట్టారు. 10 ఏళ్ల పాలన చేసిన కేసీఆర్ను కాదని కాంగ్రెస్ విసిరిన ఆనందమైన వలలో చిక్కుకున్నారు. 6 గ్యారెంటీలు కాకుండా 420 హామీలు ఇచ్చారు. నేను చాలా మంది ముఖ్యమంత్రులను చూశా… ఎవరూ కూడా రేవంత్ రెడ్డి లాగ దివాళాకోరు మాటలు మాట్లాడలేదు” అని కేటీఆర్ దుయ్యబట్టారు.
ఎమ్మెల్యేలు పార్టీ మారిన చోట వచ్చే ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా ఏంటో చాటాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఢిల్లీ పార్టీలను నమ్మొద్దని కేసీఆర్ చిలక్కి చెప్పినట్టు చెప్పారని…. ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా మీకోసం పోరాడేది బీఆర్ఎస్ మాత్రమే అని ఉద్ఘాటించారు. రాబోయే రోజుల్లో మన ఇంటి పార్టీ మన తెలంగాణ పార్టీని ఆశీర్వదించాలని కోరారు.