Hanuman Jayanti : తెలుగు రాష్ట్రాల్లో హమనుజ్జయంతి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు భక్తులు. హనుమాన్ మాలధారులు, భక్తులు ఆలయాలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. కొండగట్టు, తిరుమలలో పెద్ద ఎత్తున్న హనుమాన్ జయంతి వేడుకలు జరుగుతున్నాయి. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం ఉదయం నుంచి కొండగట్టు ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పండితులు ఆంజనేయ స్వామికి అభిషేకం నిర్వహించి, రకాల పండ్లు, పూలతో అలంకరించారు. వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివస్తుండడంతో... క్యూలైన్లు, ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు కొండగట్టుకు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. హనుమాన్ దీక్షాపరులతో ఆలయ పరిసరాలు కాషాయంగా మారాయి. హనుమజ్జయంతి సందర్భంగా భద్రాద్రి సీతారామస్వామి ఆలయానికి కూడా భక్తుల రద్దీ పెరిగింది. ఆంజనేయస్వామి వారికి ఆదివారం సాయంత్రం తిరువీధి సేవ, సుందరకాండ పారాయణం కార్యక్రమాలు నిర్వహిస్తారు.
తిరుమలలో హనుమజ్జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల అంజనాద్రిపై నేటి నుంచి 18వ తేదీ వరకు హనుమాన్ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తుంది టీటీడీ. అంజనాద్రి ఆకాశ గంగ, జాపాలి, నాదనీరాజన వేదిక, ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం, బేడి ఆంజనేయ స్వామివారి ఆలయాల వద్ద జయంతి వేడుకలు జరగనున్నాయి. ఈ ఆలయాల్లో ఆంజనేయస్వామికి విశేషంగా అభిషేకాలు, అర్చనలు, నివేదనలు చేయనున్నారు. ఆదివారం ఉదయం 7.30 గంటలకు బేడి ఆంజనేయస్వామికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. ఉదయం 8.30 గంటలకు ఆకాశగంగ ఆంజనేయస్వామి వారికి అభిషేకం నిర్వహించారు. టీటీడీ తరపున జాపాలి ఆంజనేయస్వామి వారికి పట్టువస్ర్తాలు సమర్పించారు అధికారులు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఏడో మైలు వద్ద ఆంజనేయస్వామి వారికి పండితులు అభిషేకం నిర్వహించనున్నారు. హనుమాన్ మాలధారులు తిరుమల చేరుకొని జాపాలి తీర్థంలో దీక్షను విరమిస్తున్నారు.
తిరుమలలో హనుమన్ జయంతి సందర్భంగా ఆదివారం పాపవినాశనం మార్గంలో ఆర్టీసీ బస్సులను మాత్రమే అనుమతిస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. హనుమాన్ జయంతి వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. భక్తుల రద్దీ కారణంగా ఆకాశగంగ, పాపనాశనం ప్రాంతాల వద్ద పార్కింగ్ సమస్య ఉంటుందని, అందుకే తిరుమల నుంచి గోగర్భం డ్యామ్ సర్కిల్ మార్గంలో ఆర్టీసీ బస్సులకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.