Komatireddy Rajagopal reddy: నైతిక విజయం నాదే - రాజగోపాల్ రెడ్డి
Munugodu bypoll results: మునుగోడు ఉపఎన్నికల ఫలితంపై బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. ఈ ఎన్నికలో నైతిక విజయం తనదేనని వ్యాఖ్యానించారు.
Munugodu Bypoll Result: మునుగోడులో టీఆర్ఎస్ విజయం దాదాపు ఖరారైంది. అన్ని రౌండ్లలోనూ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించింది. ఎన్నికల ఫలితాలపై బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. ఈ ఎన్నికలో నైతిక విజయం తనదే అని స్పష్టం చేశారు. ఎన్నికలో తనని అష్టదిగ్బందం చేశారని వ్యాఖ్యానించారు.
ట్రెండింగ్ వార్తలు
ఒక్క ఎమ్మెల్యేను ఓడించేందుకు వంద మంది ఎమ్మెల్యేలు మునుగోడుకు వచ్చారని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. దేశ చరిత్రలోనే ఇలా ఎక్కడా జరగలేదన్నారు. ఓటమి భయంతోనే టీఆర్ఎస్ ఇలా చేసిందన్నారు. టీఆర్ఎస్ ది విజయం కాదన్న ఆయన... అక్రమాలతో గెలిచిందని ఆరోపించారు. మోదీ నాయకత్వంలో కుటుంబ పాలనకు వ్యతిరేకంగా బీజేపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాటం కొనసాగుతోందన్న ఆయన... ఈ ఫలితం మొదటిమెట్టు అన్నారు.
మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ డబ్బులు, మద్యం ఏరులై పారించిందని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. ఈ ఎన్నికలో తన విజయం కోసం కృషి చేసిన వారికి ధన్యవాదాలు చెప్పారు. టీఆర్ఎస్ కు ఓట్లు వేయకపోతే పథకాలు రద్దవుతాయని ఓటర్లను బెదిరించారని... పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని అన్నారు. మునుగోడు ప్రజల మనసుల్లో తాను ఉన్నానని వ్యాఖ్యానించారు.
కేసీఆర్ ను కూడా మునుగోడు ప్రజల వద్దకు తీసుకువచ్చిన ఘటన రాజగోపాల్ రెడ్డికి దక్కుతుందన్నారు. హామీలు, ప్రలోభాలు పెట్టి గెలిచారని... కమ్యూనిస్టు పార్టీల నేతలు కేసీఆర్ కు అమ్ముడుపోయారని దుయ్యబట్టారు.
తాజా ఫలితాలపై బీజేపీ నేతలు స్పందిస్తూ వస్తున్నారు. మునుగోడులో టీఆర్ఎస్ కు చెమటలు పట్టించామని చెప్పుకొస్తున్నారు. నైతిక విజయం తమదే అంటూ స్పష్టం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో తమకు తిరుగు ఉండదని చెబుతున్నారు.