జీవనశైలిలో ఎన్నో సాంకేతికతో ముందుకు సాగుతున్న నేటి సమాజంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తీర్యాని మండలం లో మాత్రం భిన్నంగా కొనసాగుతోంది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తీర్యాని మండలంలోని మారుమూల గ్రామం సమతులగుండంలో ఇప్పుడు భయానక వాతావరణం నెలకొంది. “గ్రామం రమ్మంటుంది... దయ్యం పొమ్మంటుంది...” అన్న మాటలే ఇప్పుడు అక్కడి ప్రజల నోట నిత్యం వినిపిస్తున్నాయి. మూఢనమ్మకాల పేరుతో ఓ పాత వదంతి మరోసారి భయాందోళన సృష్టించింది.
గ్రామంలో గత నెల రోజుల నుంచి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వారానికి ఒక్కరు చొప్పున మృతి చెందారు. ఇలా అనుమానాస్పదంగా మరణించడాన్ని దయ్యాల పనేనని భావించిన గోండు గిరిజనులు పెద్ద ఎత్తున గ్రామాన్ని విడిచిపెట్టి పొరుగువూర్లకు వెళ్తున్నారు. గత రెండు రోజులుగా సుమారు 10 కుటుంబాలు గ్రామాన్ని వదిలి పక్కనున్న లింగాపూర్ గ్రామం భీమను గొందిలో ఒక పాఠశాలలో తలదాచుకుంటున్నారు. భయంతో ఒకింత ఏదైనా చప్పుడు వినిపిస్తే అది దయ్యం తచ్చాడిందని నమ్మేస్తున్నారు. స్థానిక గ్రామ పెద్దలు దీనిని అంగీకరిస్తుండడంతో పరిస్థితి మరింత దిగజారుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం, అధికారులు ప్రజలకు మూఢనమ్మకాలపైన విజ్ఞానం సదస్సులు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.
తమ గ్రామంలో గత నెల రోజులుగా ఒకే కుటుంబంలో నలుగురు వరుసగా ఒకరి తర్వాత ఒకరు మృతి చెందారని గ్రామస్థుడు తెలిపారు. దీంతో గ్రామంలో భయాందోళన చెలరేగాయని, వెంటనే గ్రామ పెద్దలు తీర్మానం చేసుకొని పక్కనే ఉన్న భీమను గొంది గ్రామం పాఠశాలలో తలదాచుకుంటున్నామన్నారు. ప్రభుత్వం స్పందించి తమకు సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నామన్నారు.
రిపోర్టింగ్: వేణుగోపాల్ కామోజీ, ఉమ్మడి జిల్లా ప్రతినిధి, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం