ఎంఐఎం గెలుపు కోసమే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆరాటం.. ఇవి సెక్యులర్ పార్టీలా.. కిషన్ రెడ్డి ఫైర్-kishan reddy alleges that congress and brs are working only for the victory of mim ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  ఎంఐఎం గెలుపు కోసమే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆరాటం.. ఇవి సెక్యులర్ పార్టీలా.. కిషన్ రెడ్డి ఫైర్

ఎంఐఎం గెలుపు కోసమే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆరాటం.. ఇవి సెక్యులర్ పార్టీలా.. కిషన్ రెడ్డి ఫైర్

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మజ్లిస్ అభ్యర్థి గెలుపు కోసమే ఈ పార్టీలు పని చేస్తున్నాయని ఆరోపించారు. ఎంఐఎం కోసం పనిచేసేవి సెక్యులర్ పార్టీలు ఎలా అవుతాయని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

మీడియాతో మాట్లాడుతున్న కిషన్ రెడ్డి

అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా మజ్లిస్ పార్టీకి అండగా నిలబడుతున్నాయని.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఈ పార్టీలు మజ్లిస్‌కు మేలు చేకూర్చే ప్రయత్నం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. ఎన్నికైన కార్పొరేటర్లు ఓటు హక్కు వినియోగించుకోకుండా.. బీఆర్ఎస్ బెదిరించడం, వారికి ఓటు వేసిన ప్రజల హక్కును అవమానించినట్లేనని వ్యాఖ్యానించారు.

మజ్లిస్ వ్యతిరేక ఓట్లు చీల్చి..

'హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి ఈరోజు చివరిరోజు. మజ్లిస్ పార్టీకి మద్దతిచ్చి ఆ పార్టీని గెలిపించడం కోసమో.. హైదరాబాద్ ప్రజలు బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు ఓటు వేయలేదు. ఇదే పాతపట్నంలో మజ్లిస్ పార్టీ వరుసగా గెలుస్తున్న శాసనసభ నియోజకవర్గాల్లో, హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో, మున్సిపల్ కార్పొరేషన్లలో కచ్చితంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ రెండూ పోటీచేసి మజ్లిస్ వ్యతిరేక ఓట్లు చీల్చాయి. మజ్లిస్ పార్టీకి సహకరించే ప్రయత్నం చేశాయి' అని కిషన్ రెడ్డి ఆరోపించారు.

ఇవి సెక్యులర్ పార్టీలా..

'మజ్లిస్ వ్యతిరేక ఓట్లను విభజించేందుకు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీని గెలిపించడం కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రయత్నాలు చేశాయి. మజ్లిస్ పార్టీతో చేయికలిపి పనిచేస్తున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎలా సెక్యులర్ పార్టీలు? పచ్చి మతోన్మాద పార్టీ అయిన మజ్లిస్.. రజాకార్ల వారసత్వ పార్టీ. మజ్లిస్‌తో హైదరాబాద్ లో స్నేహం చేస్తూ.. ఆ పార్టీ మద్దతుతో మీరు.. మీ మద్దతుతో ఎంఐఎం ఎన్నికల్లో గెలుస్తున్నారు. మీరు సెక్యులర్ అని ఏ మొహం పెట్టుకుని ప్రచారం చేస్తున్నారో రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి' అని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు.

ఊచకోత కోశారు..

'ఆనాడు తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలు, రైతులు, రైతు కూలీలను.. మతోన్మాదంతో వేలాదిమందిని రజాకార్లు హత్య చేశారు. చెన్నారెడ్డిని ముఖ్యమంత్రి పీఠం నుంచి దించేందుకు మజ్లిస్ పార్టీ పాతబస్తీలోని తీగలకుంటలో 400 మందిని ఊచకోత కోసింది వాస్తవం కాదా? ఆరోజు చెన్నారెడ్డి మంత్రివర్గంలో ఉన్న సరోజిని పుల్లారెడ్డి మజ్లిస్ పార్టీ మతకల్లోహాలు, మతోన్మాదంతో 400 మంది దళితులను హత్య చేశారని చెప్పింది వాస్తవమా కాదా?' అని తెలంగాణ బీజేపీ చీఫ్ ప్రశ్నించారు.

వంగివంగి సలాం కొడతారు..

'హిందూ దేవుళ్లను అవమానించే మజ్లిస్ పార్టీ కారుకూతలను వ్యతిరేకించేవాళ్లు, హిందువుల పండుగలను వ్యతిరేకించేవాళ్లు, భారతీయుల మీద దాడులు చేస్తామని చెప్పేవాళ్లు,.. 15 నిమిషాలు సమయమిస్తే దేశంలో వందకోట్ల మంది సంగతిచూస్తామని బెదిరించిన మజ్లిస్ పార్టీని ఎందుకు సమర్థిస్తున్నారో.. ఎందుకు గెలిపిస్తున్నారో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఓవైసీ దగ్గర బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకులు వంగివంగి సలాం కొడతారు. రెండు పార్టీలకు సూపర్ బాస్ అసదుద్దీన్ ఓవైసీ' అని కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

సూపర్ బాస్ ఓవైసీ..

'కాంగ్రెస్‌కు బాస్ రాహుల్ గాంధీ అయినా.. తెలంగాణలో సూపర్ బాస్ అసదుద్దీన్ ఓవైసీ. బీఆర్ఎస్‌కు కేసీఆర్ బాస్ అయినా.. సూపర్ బాస్ అసదుద్దీన్ ఓవైసీయే. అత్యధిక ఓట్లు ఉన్నప్పటికీ.. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ.. ఏ ప్రాతిపదికన పోటీ చేయడం లేదు? ఎవరిని గెలిపించేందుకు ప్రయత్నిస్తున్నరు? బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లను పిలిపించి, ఓటింగ్‌కు వెళ్లొద్దని ఎందకు బెదిరిస్తున్నారు..? అంటే మీ కార్పొరేటర్ల మీద మీకు నమ్మకం లేదా?' అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

నమ్మకంతో వెళ్తున్నాం..

'హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా బీజేపీ కార్పొరేటర్లు, ఎక్స్-అఫీషియో మెంబర్లు, పార్లమెంటు సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు సమావేశమయ్యాం. ఇప్పటికే మా బీజేపీ అభ్యర్థి గౌతం రావు ఓటర్లను కలిసారు. ఇతర పార్టీలకు చెందిన ఓటర్లను కూడా ప్రజాస్వామ్య మార్గంలో కలిసి మద్దతు కోరారు. తెలంగాణ రాష్ట్రం రావొద్దు అని కోరిన పార్టీ మజ్లిస్. తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన ఆ పార్టీకి బీఆర్ఎస్ మద్దతు ఇవ్వడం సిగ్గు చేటు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందనే నమ్మకంతో మేము ముందుకు వెళ్తున్నాం' అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.