Karimnagar Kidnap: కరీంనగర్ లో మైనర్ బాలిక కిడ్నాప్...గంటల వ్యవధిలో ఛేదించిన పోలీసులు.
Karimnagar Kidnap: కరీంనగర్ లో మైనర్ బాలిక కిడ్నాప్ కలకలం సృష్టించింది. పద్మనగర్ కు చెందిన 16 ఏళ్ళ మైనర్ బాలికను కిడ్నాప్ చేశారు. కుటుంబ సభ్యులు ఆందోళనతో పోలీసులను ఆశ్రయించారు. అప్రమత్తమైన టూ టౌన్ పోలీసులు గంటల వ్యవధిలో కిడ్నాప్ ను ఛేదించారు.

Karimnagar Kidnap: కరీంనగర్ పద్మనగర్ లో నివాసం ఉండే మైనర్ బాలికను ఇద్దరు మహిళలతో పాటు మరో ఇద్దరు యువకులు కలిసి కిడ్నాప్ చేశారు. బాలికకు మాయమాటలు చెప్పి కారులో అపహరించి, బలవంతంగా పెళ్లి చేసుకునే ప్రయత్నం చేశారు. బాలిక పేరెంట్స్ వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో టూ టౌన్ సిఐ సృజన్ రెడ్డి నేతృత్వంలో పోలీసులు రంగంలోకి దిగారు.
సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుని నలుగురిని గుర్తించి పట్టుకున్నారు. పట్టుబడ్డ వారిలో A1 కరీంనగర్ జిల్లా రామడుగు మండలం తిర్మలాపూర్ గ్రామానికి చెందిన కర్ణ కంటి @ కర్ణ నరేష్(32), A2 మానకొండూరు మండలం వెల్ది గ్రామానికి చెందిన బాణాల శ్రావణ్(31) A3 నల్లగొండ జిల్లా కాసం గోడే గ్రామానికి చెందినకర్ని @ గౌరారపు కళ్యాణి(29), A4 కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం, మోదుగులగూడెంకు చెందిన కర్నే సుమలత(28) ఉన్నారు. నలుగురిపై Cr.no.52/1025,U/Sec. 87 r/w 49, 75 BNS & Sec 12 of POCSO Act 2012 కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
ఏ1 కు నేరచరిత్ర...
ప్రధాన నిందితుడు A1 గతంలో కూడా మైనర్ వివాహానికి పాల్పడిన ఘటనలలో నేరచరిత్ర కలిగి ఉన్నాడని టూ టౌన్ సిఐ సృజన్ రెడ్డి తెలిపారు. కుట్ర పూరితంగానే ఇద్దరు మహిళలతో కలిసి నలుగురు పద్మనగర్ కు చెందిన మైనర్ ను కిడ్నాప్ చేశారని చెప్పారు. సాక్ష్యాలను తొలగించేందుకు నిందితులు సెన్ ఫోన్లు, సిమ్ కార్డులు ధ్వంసం చేసినట్లు సిఐ తెలిపారు. మైనర్ బాలికలను లేదా మహిళలలను వేధించినా లేదా ఇబ్బంది పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సృజన్ రెడ్డి హెచ్చరించారు.
గంటల వ్యవధిలో కిడ్నాప్ ను ఛేదించిన పోలీసులకు అభినందనలు..
కరీంనగర్ లో మైనర్ బాలిక కిడ్నాప్ ను గంటల వ్యవస్థలో పోలీసులు ఛేదించడం పట్ల పలువురు పోలీసులకు అభినందనలు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుల కదలికలను గుర్తించి నలుగురిని వివిధ ప్రాంతాల్లో గుర్తించి పట్టుకున్న పోలీసులను ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. కిడ్నాప్ ను ఛేదించి కుటుంబ సభ్యులకు మైనర్ ను క్షేమంగా అప్పగించడంతో కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)