Praja Palana Applications Data Updates: గ్యారెంటీ హామీల పథకాల అమలు కోసం తెలంగాణ సర్కార్ ప్రజా పాలన కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా… దరఖాస్తులను స్వీకరించింది. డిసెంబర్ 28 నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం…. జనవరి 6 వరకు కొనసాగింది. ఇందులో భాగంగా… అర్హులైన వారి నుంచి భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఏకంగా కోటిపైగా అప్లికేషన్లను స్వీకరించారు అధికారులు. మొత్తం 1,25,84,383 దరఖాస్తులు అందాయి. వీటి డేటా మొత్తాన్ని కూడా కంప్యూటరీకరణ చేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రక్రియ మెజార్టీ వంతు పూర్తి కావొచ్చింది. తాజాగా సెలవులు దినాలు రావటంతో కాస్త ఆగినప్పటికీ…. త్వరలోనే డేటా ఎంట్రీ ప్రక్రియ మొత్తం పూర్తి కానుందని తెలిసింది.
ప్రజా పాలన కార్యక్రమానికి సంబంధించి https://prajapalana.telangana.gov.in/ పేరుతో ప్రత్యేక వెబ్ సైట్ ను ఇప్పటికే ప్రారంభించింది తెలంగాణ సర్కార్. ఇందులో పూర్తి డేటాను నిక్షిప్తం చేసేలా కసరత్తు చేస్తోంది. దరఖాస్తుదారుడి స్టేటస్ కూడా తెలుసుకునే వెసులుబాటును కల్పించనుంది. అయితే ఇందులో భాగంగా… వెబ్ సైట్ కీలక ఆప్షన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది సర్కార్.
మొన్నటి వరకు వెబ్ సైట్ మాత్రం అందుబాటులోకి రాగా…తాజాగా ప్రజాపాలన పోర్టల్ లో దరఖాస్తు స్థితిని తెలుసుకునేందుకు ‘KNOW YOUR APPLICATION STATUS’ అనే ఆప్షన్ తీసుకొచ్చింది. దీనిపై క్లిక్ చేయగానే… అప్లికేషన్ నంబర్ (Online) అని కనిపిస్తోంది. దీంట్లో దరఖాస్తుదారుడి ఆప్లికేషన్ నెంబర్ ఎంట్రీ చేసి… కింద Captchaను పూర్తి చేయాలి. ఆ తర్వాత ‘View Status’ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే దరఖాస్తు ఏ స్థితిలో ఉందనే విషయం డిస్ ప్లే అవుతుంది. అయితే డేటా ఎంట్రీ ప్రక్రియ మొత్తం పూర్తి అయిన తర్వాత… పూర్తిస్థాయిలో ఈ వెబ్ సైట్ అందుబాటులో వస్తుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఉన్న సైట్ లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా..? వంటి అంశాలను కూడా పరిశీలిస్తున్నారు.
ఇక ఈ వెబ్ సైట్ లోదరఖాస్తుదారుడు ఏ స్కీమ్ కు అర్హత సాధించారు లేక ఏమైనా అప్లికేషన్ లో తప్పులు ఉన్నాయా..? ఇంకా ఏమైనా వివరాలను సమర్పించాల్సి ఉంటుందా వంటి అంశాలు కూడా ఇందులో కనిపించే అవకాశం ఉండనుంది. ప్రస్తుతం దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియటంతో… మళ్లీ నాలుగు నెలల తర్వాత ప్రజా పాలన కార్యక్రమం ఉంటుందని సర్కార్ తెలిపింది. ఇందులో మళ్లీ దరఖాస్తులను స్వీకరించనుంది.
ప్రజా పాలన కార్యక్రమంలో ప్రభుత్వ స్కీమ్ ల కోసం అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి. ఇందులోనూ ప్రధానంగా… ఇళ్లు, చేయూత, రేషన్ కార్డుల కోసం ఎక్కువగా అప్లికేషన్లు వచ్చాయి. తెల్ల కాగితంపై కూడా దరఖాస్తులు తీసుకుంటామని ప్రభుత్వం చెప్పగా… ఎక్కువగా రేషన్ కార్డుల కోసం అర్జీలు వచ్చాయి. గత ప్రభుత్వంలో ఇచ్చిన గృహలక్ష్మి దరఖాస్తులను కాంగ్రెస్ సర్కార్ రద్దు చేయడంతో.. వారంతా తిరిగి దరఖాస్తు చే సుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజలు అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు ఇచ్చారు. అభయహస్తం కింద తీసుకున్న దరఖాస్తుల్లో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాలు ఉన్నాయి. మహాలక్ష్మి స్కీమ్ కు మహిళలు భారీగా దరఖాస్తులు చేసుకున్నారు. ఇప్పటికే రైతుబంధు కింద నిధులు తీసుకుంటున్న రైతులు…. రైతుభరోసాకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తెలిపిన నేపథ్యంలో…. దీనికి దరఖాస్తులు తగ్గాయి.