తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు : సిట్ దర్యాప్తులో కీలక పరిణామాలు - బాధితులెందరు...?-key developments in the phone tapping case investigation in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు : సిట్ దర్యాప్తులో కీలక పరిణామాలు - బాధితులెందరు...?

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు : సిట్ దర్యాప్తులో కీలక పరిణామాలు - బాధితులెందరు...?

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ లోతుగా కొనసాగుతోంది. ఓవైపు ఈ కేసులోని అధికారులను విచారిస్తుండగా… మరోవైపు ట్యాపింగ్ బాధితుల నుంచి స్టేట్మెంట్లను రికార్డ్ చేస్తున్నారు. దీంతో ఈ కేసులో వరుసగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

ఫోన్ ట్యాపింగ్ కేసు (unsplash.com)

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే కీలక సమాచారాన్ని రాబట్టింది. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావించిన మాజీ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ టి. ప్రభాకర్ రావుని కూడా ఇటీవలే అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఇచ్చే స్టేట్మెంట్ల ఆధారంగా ఈ కేసులోని మూలాలను వెలికి తీయాలని భావిస్తోంది.అయితే సిట్ విచారణలో ఆయన సరైన సమాధానాలు చెప్పటం లేదన్న వార్తలు కూడా బయటికి వస్తున్నాయి.

వాంగ్మూలాల నమోదు…

ఓవైపు ఈ కేసులో నిందితులుగా ఉన్న పోలీసు అధికారులను విచారిస్తూనే…. మరోవైపు బాధితుల వివరాలను కూడా సిట్ సేకరిస్తోంది. ఇందులో సినీ, రాజకీయ, మీడియా, వ్యాపారవేతలతో పాటు పలువురు ప్రముఖలు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీతో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నేతలకు సిట్ నోటీసులు జారీ చేసింది. వీరి నుంచి స్టేట్మెంట్లను రికార్డు చేసింది.

ప్రస్తుతం ఈ కేసులో బాధితుల వాంగ్మూలాల సేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగానే బీజేపీకి చెందిన ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రఘునందన్‌రావ్ స్టేట్మెంట్లను సిట్ నమోదు చేసింది. ఇప్పటికే ఈ కేసులో మాజీ మంత్రి, ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఈటల రాజేందర్ నుంచి కూడా వాంగ్మూలాలను సేకరించింది. ఇక ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీగా ఉన్న రాధాకృష్ణ వాంగ్మూలాన్ని కూడా జూన్ 27వ తేదీన నమోదు చేసింది.

నిందితులెందరు..? జాబితా ఆధారంగా విచారణ

600కుపైగా బాధితులతో కూడిన ఓ జాబితాను కూడా సిట్ సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈ జాబితా ఆధారంగా నోటీసులు జారీ చేస్తూ విచారిస్తోంది. వారి వాంగ్మూలాలను కూడా నమోదు చేస్తోంది. త్వరలోనే మరికొంతమంది రాజకీయ నాయకుల నుంచి వాంగ్మూలాలను సేకరించే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎక్కువ మంది నేతలు ఉన్నట్లు తెలిసింది.

ఈ ఫోన్ ట్యాపింగ్ కోసం ప్రభాకర్ రావ్ తో కూడిన టీమ్ నిరంతరం పని చేసినట్లు సిట్ గుర్తించింది. దాదాపు 4 వేలకు పైగా ఫోన్లు ట్యాప్ అయినట్లు సిట్ వర్గాల మేరకు తెలుస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధిక సంఖ్యలో ఫోన్లు ట్యాప్‌ చేసినట్టు సిట్‌ గుర్తించింది. సిట్ విచారణతో పాటు బయటికి వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే…. ఈ కేసులో బాధితుల సంఖ్య భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటివరకు అరెస్ట్ చేసిన వారితోనే నిందితుల సంఖ్య ఆగిపోతుందా…? లేక మరికొంత మంది పేర్లు తెరపైకి వస్తాయా అనేది కూడా ఆసక్తికరంగా మారింది.

కీలక పరిణామం….

ఇక 2022లో తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై కూడా సిట్ అధికారుల ఫోకస్ పెట్టారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో అప్పటి సీఎంగా ఉన్న కేసీఆర్… కొన్ని వీడియోలను విడుదల చేశారు. కేసీఆర్ రిలీజ్ చేసిన ఆడియోలపై కూడా సిట్ ఆరా తీస్తోంది. ముఖ్యంగా… కేసీఆర్ రిలీజ్ చేసిన ఆడియో, వీడియో రికార్డింగులు ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై ఫోకస్ పెట్టింది. ఈ కేసు ఆధారంగా కీలక సమాచారం కూడా రాబట్టవచ్చని సిట్ భావిస్తోంది.

2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత… ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది. మొత్తం ఎపిసోడ్ పై సిట్ విచారణకు ఆదేశించింది. అప్పట్నుంచి… ఈ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్ రావ్ అనే అధికారితో అరెస్టుల పర్వం మొదలైంది. ఆ తర్వాత ఇద్దరు అదనపు ఎస్పీలను కూడా సిట్ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత మరికొంత మంది అధికారులు కూడా అరెస్ట్ అయ్యారు.

ప్రస్తుతం బాధితుల నుంచి సిట్ సేకరిస్తున్న వాంగ్మూలాల ఆధారంగా ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. చర్యలు తీసుకునే విషయంలో కేవలం అప్పటి పోలీసుల అధికారుల వరకే ఈ వ్యవహారం పరిమతవుతుందా..? లేక అప్పటి ప్రభుత్వంలోని కీలక నేతల వరకు వస్తుందా అనేది ఉత్కఠను రేపుతోంది…!

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం