KCR Letters : 3.95 లక్షల మందికి కేసీఆర్ పర్సనల్ లెటర్స్
Munugode By Election : మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందుతున్న సుమారు 3.95 లక్షల మంది లబ్ధిదారులకు కేసీఆర్ లేఖలు రాయనున్నారు. నవంబర్ 3న జరగనున్న ఉప ఎన్నికలో తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరుతూ వ్యక్తిగత లేఖలు రాయడానికి సిద్ధమయ్యారు.
Munugode By Poll : మునుగోడు ఉపఎన్నికపై పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు గెలిచేందుకు ప్రణాళికలు వేస్తున్నాయి. ప్రతి గ్రామం, మండలానికి మంత్రులను, ఎమ్మెల్యేలను పంపించి ఎలాగైనా గెలవాలని టీఆర్ఎస్(TRS) పార్టీ అనుకుంటోంది. తన సొంత నియోజకవర్గం గజ్వేల్ నుంచి టీఆర్ఎస్ నేతలను పార్టీ గెలుపునకు కృషి చేయాలని కేసీఆర్ (KCR)ఆదేశించారు.
ట్రెండింగ్ వార్తలు
త్వరలో నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తానని స్థానిక నాయకులతో కేసీఆర్ చెప్పారు. నవంబర్ 3న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అక్టోబర్ 29 లేదా 30 తేదీల్లో చండూరు(Chanduru)లో బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో 3,34,994 మంది లబ్ధిదారులు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రూ. రూ.10,260 కోట్లు లబ్ధిపొందారని కేసీఆర్ లేఖ(KCR Letters)లో ప్రస్తావించనున్నారు. అందులో 2014 నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు ఒక్కో ఇంటికి వీటి ద్వారా ఎంతమేర లబ్ధి చేకూరింది అనే అంశాలను సీఎం రాస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై సీఎం ఓట్లను అభ్యర్థించనున్నారు. అదే సమయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల(Welfare Schemes) నుండి లబ్ధి పొందకుండా ఏ వర్గాన్ని మినహాయించలేదని చెప్పానున్నారు. ఆసరా పింఛన్లు(Asara Pensions), పంట రుణాల మాఫీ, రైతు బంధు, దళిత బంధు(Dalit Bandhu), రైతు బీమా, కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాల లబ్ధిదారులకు సీఎం వ్యక్తిగత లేఖలు పంపనున్నారు. లేఖలో లబ్ధిదారుగా ఉన్న సంక్షేమ పథకం పేరు ఉంటుంది. పథకాలకు సంబంధించిన సమాచారాన్ని, అలాగే వివిధ పథకాల కింద ప్రతి లబ్ధిదారుడు అందుకున్న మొత్తాలను ప్రస్తావిస్తారు. సీఎం లేఖలు ఓటర్లను టీఆర్ఎస్ కు దగ్గర చేస్తాయని పార్టీ నేతలు భావిస్తున్నారు.