KCR : తెలంగాణ బాగోగులపై బీఆర్ఎస్కు ఉన్న ఆవేదన మరో ఏ పార్టీకి లేదని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. శనివారం ఎర్రవెల్లిలో పార్టీ నేతలో సమావేశమైన కేసీఆర్... బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ, రజతోత్సవ మహాసభపై చర్చించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ఉమ్మడి మహబూబ్నగర్, నల్గొండ, ఖమ్మం నేతలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం సఫాయి కార్మికులకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితుల ఉందని, గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసిందని కేసీఆర్ ఆరోపించారు. గ్రామాల్లో మెయింటెనెన్స్ లేక ట్రాక్టర్లు మూలనపడ్డాయని బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ తో చెప్పారు. అధికారం కోసం అమలుకాని హామీలు ఇచ్చి బూటకపు గ్యారంటీలతో ప్రజలను నమ్మించిన కాంగ్రెస్ పార్టీపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని బీఆర్ఎస్ నేతలు చెప్పారు. రాష్ట్రంలో పరిస్థితులపై నేతలు కేసీఆర్ వివరించారు.
ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసిన ఉద్యమ స్ఫూర్తి బీఆర్ఎస్ సొంతమని కేసీఆర్ అన్నారు. దశాబ్దాల పోరాటంతో నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయిన తెలంగాణ సమాజానికి స్వరాష్ట్ర చైతన్యాన్ని, స్ఫూర్తిని నింపామన్నారు. రాష్ట్ర సాధనకు శాంతియుత మార్గంలో పోరాటాలు చేసిన ఘనతన బీఆర్ఎస్ది అని చెప్పారు. తొమ్మిదిన్నరేండ్లు రాష్ట్రాన్ని జనరంజకంగా పాలించి దేశానికే ఆదర్శంగా నిలిచామన్నారు. వ్యవసాయంతో పాటు సబ్బండ వర్గాలకు చేసిన సేవ మహోన్నం అన్నారు. ప్రజలే కేంద్రకంగా, వారి అభివృద్ధే ధ్యేయంగా పనిచేయడమన్నారు.
ప్రజలు తామేం కోల్పోయామో ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో అర్థం చేసుకున్నారని కేసీఆర్ అన్నారు. తెలంగాణ అంటే ఇతరులకు పొలిటికల్ గేమ్ అని, కానీ బీఆర్ఎస్కు మాత్రం ఒక టాస్క్ అన్నారు. నిత్యం ప్రజలతో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పార్టీ నేతలకు కేసీఆర్ సూచించారు. బీఆర్ఎస్ పాలనలో మండు వేసవిలోనూ చెరువులు, కుంటలు మత్తళ్లు దుంకాయని, కాంగ్రెస్ పాలనలో జీవాలకు నీళ్లు దొరకని పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు. నీళ్లందకపోవడంతో వరి పంటలను పశువుల మేతకు వదిలేస్తున్న దయనీయ స్థితిపై మాజీ సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అసమర్థత మూలంగానే రైతులకు ఈ పరిస్థితి ఏర్పడిందని వాపోయారు.
నేడు రాష్ట్రం ఏమైతే మాకేంది అన్న తీరున స్వార్థ రాజకీయ, అధికారమే పరమావధిగా కాంగ్రెస్ నాయకులు పని చేస్తున్నారన్నారని కేసీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ పాలన తెలంగాణ ప్రజల పాలిట శాపంగా మారిందన్నారు. కొత్త రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపినప్పుడు అన్నిరంగాల్లో అంధకార పరిస్థితులు ఉన్నాయన్నారు. ముఖ్యంగా విద్యుత్ రంగం పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని, కరెంటు తక్కువైతే ఇతర రాష్ట్రాల గిడ్ తీసుకునే పరిస్థితి ఉందని చెప్పారు. 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందుబాటులోకి తెచుకున్నామన్నారు. కాంగ్రెస్ పాలకులకు రైతులపట్ల ప్రేమ, వ్యవసాయంపై అవగాహన లేదని కేసీఆర్ విమర్శించారు.
హెచ్సీయూ వివాదంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి సరైంది కాదని కేసీఆర్ అన్నారు. హెచ్సీయూ విద్యార్థులు, వారికి అండగా నిలిచిన పార్టీలను కేసీఆర్ అభినందించారు. హెచ్సీయూ ఉదంతాన్ని ప్రభుత్వం ఒక గుణపాఠంగా తీసుకోవాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలబెట్టిందన్నారు. అయితే కాంగ్రెస్ రాష్ట్ర ఆర్థిక ప్రతిష్ఠను దిగజార్చిందన్నారు. హెచ్సీయూ విషయంలో మరోసారి రాష్ట్ర ప్రతిష్ఠను దిగజార్చేలా చేశారని కేసీఆర్ విమర్శలు చేశారు.
సంబంధిత కథనం