KCR National Party: పార్టీ ప్రకటనే కాదు.. ఆ ఎంపీ స్థానాలే టార్గెట్ అంట..!
KCR National Party: విజయదశమి రోజున సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటిస్తారనే చర్చ జోరందుకుంది. తాజాగా ఆయన చేస్తున్న పర్యటనలు అందుకు బలం చేకూరుస్తున్నాయి. ఇదిలా ఉండగానే... వచ్చే ఎన్నికల్లో పలానా సీట్లలో పోటీ చేయబోతున్నారనే వార్తలు… టాక్ ఆఫ్ ది తెలంగాణగా మారాయి.
kcr national politics: కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటుపై చర్చ ఊపందకుంది. దసరా దగ్గరపడుతున్న వేళ... కొత్త పార్టీ ప్రకటనపై వార్తలు ఓ రేంజ్ లో వినిపిస్తున్నాయి. అక్టోబర్ 5వ తేదీన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం నిర్వహించి ప్రకటన చేస్తారనే సమాచారం అందుతోంది. మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీల ఏకాభిప్రాయంతో కేసీఆర్ ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. ఆ దిశగా కసరత్తు కూడా పూర్తి చేశారని సమాచారం. తాజాగా బయటికివస్తున్న కొన్నివార్తలు... జాతీయ పార్టీపై ప్రకటన పక్కా అనేలే చేస్తున్నాయి.
ట్రెండింగ్ వార్తలు
ఓ ఫ్లైట్... హెలికాఫ్టర్..!
దేశవ్యాప్త పర్యటనల కోసం సొంతంగా పార్టీ తరపున ఓ చార్టర్డ్ ఫ్లైట్(12 సీట్ల కెపాసిటీ) కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం దాదాపు రూ. 80 కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్లు సమాచారం. అయితే దీనికోసం పార్టీ నేతల నుంచి విరాళాలు సేకరిస్తారనే వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగానే... రాష్ట్రంలో పర్యటించేందుకు ఓ హెలికాఫ్టర్ ను కూడా కొనుగోలు చేయాలని గులాబీ పార్టీ చూస్తోందంట..! రూ.20 నుంచి రూ.25 కోట్లు హెలికాప్టర్ కోసం ఖర్చు చేస్తారని టాక్..! జిల్లా కేంద్రాలకు, ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక టీఆర్ఎస్ పార్టీకి దాదాపు 800 కోట్లకుపైగా విరాళాలు ఉన్న సంగతి తెలిసిందే.
భారీ బహిరంగ సభ..?
కొత్త పార్టీ జాతీయాధ్యక్షుడిగా సీఎం కేసీఆర్ ఉంటారని... రాష్ట్ర శాఖ బాధ్యతలను మంత్రి కేటీఆర్కు అప్పగిస్తారనే వార్తలు బయటికి వస్తున్నాయి. దసరా రోజు ప్రకటన తర్వాత కరీంనగర్లో భారీ సభకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు తర్వాత మొదటి బహిరంగ సభను కూడా కరీంనగర్లోనే పెట్టారు. అదే సెంటిమెంట్ మరోసారి కొనసాగించాలని కేసీఆర్ చూస్తున్నారంట...! కరీంనగర్ సభలోనే జాతీయ పార్టీ పేరు, జెండా, ఎజెండా ప్రకటిస్తారని తెలుస్తోంది.
ఈ స్థానాల్లో పోటీ...?
వచ్చే లోక్సభ ఎన్నికల్లో కనీసం 50 పార్లమెంట్ సీట్లలో పోటీ చేయాలని గులాబీ బాస్ కేసీఆర్ భావిస్తున్నారని తెలుస్తోంది. నాటి హైదరాబాద్ సంస్థానంలోని ప్రస్తుత తెలంగాణ, కర్ణాటకలోని బీదర్, గుల్బర్గా, ఉస్మానాబాద్, రాయచూర్, మహారాష్ట్రలోని ఔరంగాబాద్, పర్భాణీ, నాందేడ్, బీడ్ ప్రాంతాలపై ఫోకస్ పెట్టనున్నట్లు సమాచారం. పలువురు రైతు ఉద్యమ నేతలను బరిలోకి దింపేలా చూస్తున్నారంట..! పలువురు సినీ నటులు, పలు రాజకీయ పార్టీ నేతలను కూడా కలుపుకొనిపోయే దిశగా కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని టాక్...!
మొత్తంగా పార్టీ ప్రకటన, కరీంనగర్ లో భారీ బహిరంగ సభ, హెలికాఫ్టర్, ఫ్లైట్ కొనుగోలు అంశం మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయనే చెప్పొచ్చు. ప్రతిపక్షాలు మాత్రం ఓ రేంజ్ లో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇవన్నీ ఇలా ఉంటే టీఆర్ఎస్ మద్దతుదారులు మాత్రం,, సోషల్ మీడియాలో కేసీఆర్ జాతీయ పార్టీకి అనుకూలంగా తెగ పోస్టులు చేస్తున్నారు. దేశ రాజకీయముఖ చిత్రాలను మార్చేందుకు అడుగులు పడుతున్నాయంటూ రాసుకొస్తున్నారు. వీటన్నింటి నేపథ్యంలో దసరా రోజు జాతీయ పార్టీ ప్రకటన పక్కా అనే వాదన గట్టిగా వినిపిస్తోంది. అయితే ఆ రోజు ఏం జరగుతుందనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.