KCR: విపక్ష నేతలకు కేసీఆర్ ఫోన్లు.. బీజేపీపై దాడికి సిద్దం
కేంద్రం అసంబద్ధ వైఖరి అనుసరిస్తోందంటూ మండిపడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ విపక్షాలతో కలిసి పోరుకు సిద్ధమవుతున్నారు.
కేంద్రంపై ప్రజాస్వామిక పోరాటంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదనలకు పలు రాష్ట్రాల విపక్ష పార్టీల ముఖ్యమంత్రులు, ప్రధాన ప్రతిపక్ష నేతలు సానుకూలంగా స్పందించారని పార్టీ వర్గాలు తెలిపాయి.
ట్రెండింగ్ వార్తలు
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్, బీహార్ ఆర్జెడీ నేత తేజస్వీయాదవ్, యుపీ ప్రతిపక్షనేత అఖిలేశ్ యాదవ్, ఎన్సీపీ నేత శరద్ పవార్ సహా ఇతర జాతీయ విపక్ష నేతలతో స్వయంగా ఫోన్లో మాట్లాడారు.
కేంద్రం మెడలు వంచి దేశంలో ప్రజాస్వామిక విలువలను కాపాడే దిశగా అన్ని విపక్ష పార్టీలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగేందుకు మంతనాలు కొనసాగుతున్నాయని ఆ వర్గాలు తెలిపాయి.
కలిసివచ్చే అన్నిరాష్ట్రాల విపక్ష పార్టీలను సమన్వయం చేస్తూ, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ముఖ్యమంత్రి సమర శంఖం పూరించనున్నారని, దేశంలో ఫెడరల్, సెక్యులర్, ప్రజాస్వామిక విలువలు ప్రమాదంలో పడ్డాయని, వాటిని కాపాడే ప్రయత్నాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని టీఆర్ఎస్ పార్టీ వర్గాలు తెలిపాయి.
ఆర్థిక సంక్షోభంలోకి దేశాన్ని నెట్టివేస్తున్న కేంద్ర వైఖరిని తేటతెల్లం చేసేందుకు కసరత్తు చేస్తున్నారని ఆ వర్గాలు తెలిపాయి. పార్లమెంటు సమావేశాలను వేదికగా చేసుకుని బీజేపీపై పోరాటం చేయనున్నట్టు తెలిపాయి.
దేశవ్యాప్త నిరసనలతో కేంద్రం అసలు స్వరూపాన్ని నగ్నంగా నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సన్నద్ధమవుతున్నారని వివరించాయి. దేశంలోని పలు రాష్ట్రాల విపక్ష నేతలతో ఫోన్లో మంతనాలు జరిపారని, శుక్రవారం నాడు పలువురు ముఖ్యమంత్రులతో సీఎం కేసీఆర్ మాట్లాడారని వివరించాయి.జాతీయ నేతలతో చర్చలు కొనసాగుతున్నాయని తెలిపాయి.
టాపిక్