చట్టం అందరికీ సమానమా? కొందరినే సెలెక్టివ్ గా టార్గెట్ చేశారా?- స్మితా సబర్వాల్ సంచలన పోస్ట్-kancha gachibowli lands issue smita sabharwal questions is the law equal for all did it selectively target some people ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  చట్టం అందరికీ సమానమా? కొందరినే సెలెక్టివ్ గా టార్గెట్ చేశారా?- స్మితా సబర్వాల్ సంచలన పోస్ట్

చట్టం అందరికీ సమానమా? కొందరినే సెలెక్టివ్ గా టార్గెట్ చేశారా?- స్మితా సబర్వాల్ సంచలన పోస్ట్

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ విచారణకు హాజరయ్యారు. అనంతరం ఆమె ఎక్స్ వేదికగా స్పందిస్తూ చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ పోస్టును 2000 మంది రీపోస్టు చేశారు, వాళ్లందరిపైనా చర్యలు తీసుకుంటారా? అని ప్రశ్నించారు.

చట్టం అందరికీ సమానమా? కొందరినే సెలెక్టివ్ గా టార్గెట్ చేశారా?- స్మితా సబర్వాల్ సంచలన పోస్ట్

కంచ గచ్చిబౌలి భూవివాదంపై రీట్వీట్ చేసి ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసింది. హెచ్సీయూ భూముల విషయంపై హాయ్ హైదరాబాద్ పోస్టు చేసిన యానిమేటెడ్ పోస్టును స్మితా సబర్వాల్ రీట్వీట్ చేశారు. ఈ అంశంలో ఆమెకు ఈ నెల 12న పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులపై తాజాగా ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు. విచారణకు హాజరై, పోలీసులకు పూర్తిగా సహకరించినట్లు తెలిపారు.

చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు వివరణ ఇచ్చినట్లు పేర్కొన్నారు. తాను రీపోస్టు చేసినట్లే మరో రెండు వేల మంది చేసినట్లు పేర్కొన్నారు. వాళ్లందరిపైనా ఇలాంటి చర్యలే తీసుకుంటారా? అని ప్రశ్నించారు. చట్టం అందరికీ సమానమా? లేదా కొందరిని సెలెక్టివ్ గా టార్గెట్‌ చేస్తున్నారా? అని స్మితా సభర్వాల్‌ ప్రశ్నించారు. కంచ గచ్చిబౌలిలో వన్యప్రాణుల పరిస్థితి ఇదంటూ వైరల్‌ అయిన ఏఐ జనరేటెడ్ నకిలీ ఫొటోలను ఆమె సోషల్‌మీడియాలో షేర్‌ చేసిన నేపథ్యంలో పోలీసులు నోటీసులు జారీ చేశారు.

"గచ్చిబౌలి పోలీసు అధికారులకు పూర్తిగా సహకరించాను. BNSS చట్టం ప్రకారం చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా ఈరోజు నా వివరణ ఇచ్చాను. ఆ పోస్ట్‌ను ఎక్స్ వేదికగా 2000 మంది వ్యక్తులు తిరిగి షేర్ చేశారు. అందరికీ ఇదే విధంగా విచారణ చేస్తున్నారా? లేదా అనే దానిపై నేను స్పష్టత కోరాను. కాకపోతే ఇది సెలెక్టివ్ టార్గెటింగ్ గురించి ఆందోళనను పెంచుతుంది, ఇది సహజ న్యాయం, చట్టం ముందు సమానత్వం సూత్రాలను రాజీపడేలా చేస్తుంది" అని స్మితా సబర్వాల్ ట్వీట్ చేశారు.

ఇదిలా ఉంటే కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ఇటీవల సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. తెలంగాణలోని కంచ గచ్చిబౌలి ప్రాంతంలో పెద్ద ఎత్తున చెట్ల నరికివేతకు సంబంధించిన కేసులో, ఆ స్థలంలో యథాతథ స్థితిని పునరుద్ధరించడం సుప్రీంకోర్టు మొదటి ప్రాధాన్యత అని తెలిపింది. అటవీ నిర్మూలన వల్ల ప్రభావితమైన వన్యప్రాణులను రక్షించడానికి రాష్ట్ర వైల్డ్‌లైఫ్ వార్డెన్ తక్షణ చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశింది. అటవీ భూములను రిస్టోర్ చేయాలని లేకపోతే అధికారులను జైలుకు పంపిస్తామని కోర్టు హెచ్చరించింది. ఈ వ్యాఖ్యలను సైతం స్మితా సబర్వాల్ రీట్వీట్ చేశారు.

నెటిజన్ల స్పందన

స్మితా సబర్వాల్ ట్వీట్ పై ఎక్స్ వేదికగా నెటిజన్లు స్పందిస్తున్నారు. 1968 నాటి అఖిల భారత సేవల (ప్రవర్తన) నియమాల ప్రకారం, ముఖ్యంగా తటస్థతను కొనసాగించడానికి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రకటనలను నిషేధించే నియమం 7 ప్రకారం, ఒక IAS అధికారి ప్రభుత్వ నిర్ణయాలను బహిరంగంగా విమర్శించకుండా నిషేధించారని ఓ నెటిజన్ పోస్టు పెట్టారు. 'భారతీయ చట్టాలు నిష్పాక్షికతకు ప్రాధాన్యత ఇస్తాయి, వృత్తిపరమైన సందర్భాలలో అధికారుల వాక్ స్వేచ్ఛను పరిమితం చేస్తాయి. కేరళలో సస్పెన్షన్ల వంటి ఇటీవలి కేసులు ఈ చట్టాల కఠినమైన అమలును ఎత్తిచూపుతున్నాయి. అయితే, అధికారులు అధికారిక విషయాలను పంచుకోవచ్చు. అధికారులు ఎక్స్ వంటి వేదికలపై వివాదాస్పద అభిప్రాయాలను పంచుకోవచం నివారించుకోవాలి' అని నెటిజన్ అభిప్రాయపడ్డారు.

"మీరు ఒక ప్రైవేట్ వ్యక్తి కాదు ప్రభుత్వ అధికారి.. ప్రభుత్వ పాలసీని పాటించడం మీ పని, రాజకీయాలు చెయ్యడం కాదు. గత ప్రభుత్వ నిర్ణయాలపై ఒక్కసారి అయినా మీరు మాట్లాడారా? మీరు కేసీఆర్, కేటీఆర్ సైడ్ తీసుకుని రేవంత్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం ఎంత వరకు కరెక్ట్" అని మరో నెటిజన్ ట్వీట్ చేశారు.

"ఇది ప్రజలపై పగ తీర్చుకోవడం లాంటిది. సరైన మనస్సు ఉన్న వారెవరు ఇలా ప్రవర్తిస్తారు? ఇది సమాజంలో జరుగుతున్న నిజమైన సమస్యల చిత్రణ మాత్రమే. ఏఐతో రూపొందించిన చిత్రాలు, కార్టూన్లు, వ్యంగ్య చిత్రాలు సమస్యలను హైలైట్ చేయడానికి, విస్తృత ప్రచార పొందడానికి ఉపయోగిస్తారు. కానీ ఇలా విచారణ చేయడం విచారకం" అని స్మితా సబర్వాల్ కు మద్దతుగా నెటిజన్ పోస్టు పెట్టారు.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం