Hyderabad : రేవంత్ రెడ్డి మిస్ గైడెడ్ మిస్సైల్లా పని చేస్తున్నారు : కల్వకుంట్ల కవిత
Hyderabad : నీళ్ల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీచ రాజకీయం చేస్తోందని.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నీళ్లు-నిజాలు అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. నీటి విషయాల్లో రాజకీయం చేయడం మానేసి నిజాలు చెప్పాలన్నారు.
కాంగ్రెస్ బురద రాజకీయానికి గోదావరి వరదను కూడా తట్టుకొని.. మేడిగడ్డ బ్యారేజీ మేరునగధీరుడిలా నిలబడిందని.. కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. కేసీఆర్ పూర్తి చేసిన ప్రధాన ప్రాజెక్టుల్లో మిగిలి ఉన్న చిన్న చిన్న పనులను.. ప్రభుత్వం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీయంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని హితవు పలికారు.
మిస్ గైడెడ్ మిస్సైల్లా..
'కాంగ్రెస్ ప్రభుత్వం రాజనీతజ్ఞతను ప్రదర్శించాలి. వైఎస్ఆర్ ప్రారంభించిన ఆరోగ్య శ్రీని కేసీఆర్ కొనసాగించారు.. కాంగ్రెస్ ప్రారంభించిన ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ కొనసాగిస్తోంది. అదే తరహాలో కేసీఆర్ ప్రారంభించిన పనులను రేవంత్ రెడ్డి కొనసాగించాలి. సీఎం రేవంత్ రెడ్డి మిస్ గైడెడ్ మిస్సైల్ లా పనిచేస్తున్నారు. కేసీఆర్ శత్రువు అని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు. కానీ మన జలాలను తరలిస్తున్న ఆంధ్రా పాలకులు మన శత్రువులని ఆయన గమనించాలి' అని కవిత వ్యాఖ్యానించారు.
ఆయన్ను తొలగించాలి..
'ఆంధ్ర కేడర్లో పనిచేసిన ఆదిత్యానాథ్ దాస్ను బాధ్యతల నుంచి తొలగించాలి. కృష్ణ ట్రైబ్యునల్లో రాష్ట్రం తరఫున బలంగా వాదనలు వినిపించాలి. కేసీఆర్ నాయకత్వంలో అవిశ్రాంతంగా పని చేస్తేనే కోటి ఎకరాల మాగాణంగా మారింది. ఎంతో మంది మేధావులల, ఇంజనీర్ల కృషి ఫలితమే అనేక ప్రాజెక్టుల నిర్మాణం. తెలంగాణ సమగ్రాభివృద్ధిలో నీటి వనరులు ఒక ప్రధాన అంశంగా పెట్టుకొని ముందుకెళ్లాం. కానీ ఈ ప్రభుత్వం జలవనరుల రంగాన్ని విర్మిస్తున్నది' అని కవిత విమర్శించారు.
కోటి ఎకరాలకు..
'ఉమ్మడి రాష్ట్రంలో 60 ఏళ్లలో కేవలం 50 లక్షల ఎకరాలకు నీళ్లందించారు. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్లలో కోటి ఎకరాలకుపైగా నీళ్లందించాం. కాలంతో పోటీ పడి ప్రపంచంలోనే అత్యద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ నిర్మించారు. కోటి 24 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రాజెక్టులను పూర్తి చేశాం. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను బాగుచేసుకున్నాం. కేవలం చెరువులను బాగు చేసుకోవడం వల్ల.. 9.6 టీఎంసీల నీటిని ఒడిసి పట్టుకున్నాం' అని కవిత వివరించారు.
వరిలో టాప్..
'తెలంగాణ ఏర్పడే సమయానికి 68 లక్షల టన్నుల వరి పండితే.. 2022-23 నాటికి కోటి 68 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. వరి పండించే రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానానికి ఎదిగింది. ఇన్ని చేసినా పదేళ్లలో ఏమి జరగలేదని కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. గోదావరి, కృష్ణా జలాలను వినియోగంలోకి తెచ్చుకోడానికి కేసీఆర్ కష్టపడ్డారు. గతంలో కాంగ్రెస్, టీడీపీ పరిపాలించి ప్రాజెక్టుల్లో పల్లేర్లు మొలిపించారు. కాంగ్రెస్ నాయకులు పదవుల కోసం ఫైరవీలు చేసుకున్నారు తప్ప.. ప్రాజెక్టుల కోసం కొట్లాడలేదు' అని కవిత వ్యాఖ్యానించారు.
ఇప్పుడు బీజేపీ తోడయ్యింది..
'గట్టిగా జై తెలంగాణ అంటే.. వెంటనే ఫేక్ ప్రాజెక్టుకు శంకుస్థాపనలు చేసేవారు. వైఎస్ఆర్ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ద్వారా ఆంధ్రా ప్రాంతానికి మన జలాలను తరలించారు. అదే ఒరవడిని జగన్, చంద్రబాబు కొనసాగించారు. అందులో భాగంగానే ఏపీ ప్రభుత్వం రాయలసీమ, బనకచర్ల ప్రాజెక్టులను చేపడుతున్నాయి. ఇన్నాళ్లు కాంగ్రెస్, టీడీపీలే అన్యాయం చేశాయనుకుంటే.. ఇప్పుడు వాటికి బీజేపీ తోడయ్యింది' అని కవిత ఆరోపించారు.
అదీ కాంగ్రెస్ చరిత్ర..
'నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద కేంద్ర బలగాలను మోహరింపజేశారు. కేసులు వేసి ప్రాజెక్టులను అడ్డుకున్న నీచమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. జలవనరుల విషయాల్లో ఇతర రాష్ట్రాల్లో పార్టీలకు అతీతంగా ఒక్కటవుతారు. కానీ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రాజకీయం చేస్తున్నాయి. కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టులు పనికిరావని దుష్ప్రచారం చేస్తున్నారు. నీళ్లు ఇవ్వక రైతుల పొట్టకొడుతున్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా, ఇరిగేషన్ శాఖ మంత్రి సొంత జిల్లాలో పంటను ఎండగొట్టారు' అని కవిత వ్యాఖ్యానించారు.