Kadiyam Srihari: కేఏ పాల్‌కు వారికి తేడా ఏముందన్న కడియం శ్రీహరి-kadiam srihari said what is the difference between ka paul and congress leaders ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kadiyam Srihari: కేఏ పాల్‌కు వారికి తేడా ఏముందన్న కడియం శ్రీహరి

Kadiyam Srihari: కేఏ పాల్‌కు వారికి తేడా ఏముందన్న కడియం శ్రీహరి

HT Telugu Desk HT Telugu

Kadiyam Srihari: కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, జానారెడ్డికి అధికారం లేకపోయేసరికి మతిభ్రమించి పిచ్చి పట్టిందని, వాళ్లకు, కేఏ పాల్‌కు తేడా ఏముందని స్టేషన్ ఘన్‌పూర్‌ నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి అన్నారు.

కడియం శ్రీహరి

Kadiyam Srihari: ప్రజల చేత ఛీత్కారానికి గురై.. ఛీ అనిపించుకున్న రేవంత్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి తమ నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్‌ని పోటీ చేయమని సవాల్ చేసే దమ్ముందా అంటూ కడియం శ్రీహరి కామెంట్ చేశారు. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

రేవంత్ రెడ్డి, రాజగోపాల్ ఇద్దరూ తమ నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ పోటీ చేయాల్సిందిగా సవాల్ చేస్తుంటే జగ్గారెడ్డి తానే సీఎం అవుతానని, తననే సీఎం పదవి వెతుక్కుంటూ వస్తుందని జానారెడ్డి అంటున్నాడని కడియం శ్రీహరి చెప్పారు.

అసలు కాంగ్రెస్ నాయకుల వ్యవహార శైలి చూస్తే నవ్వాలో.. జాలి పడాలో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకుల మాటలు తుపాకీ రాముడికి ఎక్కువ.. ఉత్తర కుమారుడికి తక్కువగా అనిపిస్తున్నాయని చమత్కరించారు. వాళ్లంతా కాంగ్రెస్ పార్టీకి మేలు చేస్తున్నారో.. కీడు చేస్తున్నారో అర్థం కావడం లేదని విమర్శించారు.

ఓ వైపు కర్నాటకలో పంటలు ఎండిపోతున్నాయని రాయచూర్లో రైతులు ధర్నాలు చేస్తుంటే.. మరో వైపు కాంగ్రెస్ నేతలు ఆరు గ్యారంటీల గురించి గొప్పగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ పాలిత ప్రాంతాల్లో అమలవుతున్నట్లు నిరూపిస్తే స్టేషన్ ఘన్ పూర్ లో పోటీ నుంచి తప్పుకుంటానని, లేదంటే వాళ్లయినా పోటీ నుంచి తప్పుకోవాలని సవాల్ చేశారు.

కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, జానారెడ్డికి అధికారం లేకపోయేసరికి మతి భ్రమించి పిచ్చి పట్టిందని, వాళ్లకు, కేఏ పాల్‌ మాటలకు తేడా ఏముందని స్టేషన్ ఘన్‌పూర్‌ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి అన్నారు.

(హిందుస్థాన్ టైమ్స్, వరంగల్ ప్రతినిధి)