Investments In Telangana : తెలంగాణలో జాకీ పెట్టుబడి.. 290 కోట్లతో తయారీ యూనిట్-jockey licensee page industries to invest 290 crore ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Jockey Licensee Page Industries To Invest 290 Crore

Investments In Telangana : తెలంగాణలో జాకీ పెట్టుబడి.. 290 కోట్లతో తయారీ యూనిట్

HT Telugu Desk HT Telugu
Nov 16, 2022 10:13 PM IST

Page Industries Investments :అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన జాకీ ఇంటర్నేషనల్ కంపెనీ దుస్తులను తయారుచేసే పేజ్ ఇండస్ట్రీస్ తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. సుమారు 290 కోట్ల రూపాయలతో తెలంగాణలో తయారీ యూనిట్లు పెడుతున్నట్టుగా ప్రకటించింది.

తెలంగాణకు భారీ పెట్టుబడి
తెలంగాణకు భారీ పెట్టుబడి

తెలంగాణలో జాకీ ఇంటర్నేషనల్ కంపెనీ దుస్తులను తయారుచేసే పేజ్ ఇండస్ట్రీస్(Page Industries) రానుంది. పేజ్ కంపెనీ(Page Company) మేనేజింగ్ డైరెక్టర్ గణేశ్, ఆ సంస్థ సీనియర్ ప్రతినిధి బృందం ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్ తో సమావేశమయ్యారు. తమ పెట్టుబడి ప్రణాళికలను వివరించారు.

ట్రెండింగ్ వార్తలు

ఇబ్రహీంపట్నంలోని వైట్ గోల్డ్ స్పిన్ టెక్ పార్క్ ప్లగ్ అండ్ ప్లే ఫెసిలిటీలో సుమారు లక్షన్నర చదరపు అడుగుల విస్తీర్ణంలో పేజ్ ఇండస్ట్రీస్ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయనున్నారు. ఈ యూనిట్ ఏర్పాటుతో 3000 మంది స్థానిక యువతకి ఉపాధి(Employment) అవకాశాలు లభిస్తాయి. ఇబ్రహీంపట్నంతోపాటు సిద్దిపేట జిల్లా ములుగులో 25 ఎకరాల విస్తీర్ణంలో భారీ తయారీ యూనిట్ ను కూడా పేజ్ ఇండస్ట్రీస్ నిర్మిస్తుంది. తద్వారా మరో 4000 మంది స్థానిక యువతకి ఉపాధి అవకాశాలు దక్కుతాయి.

పేజ్ ఇండస్ట్రీస్ ఇప్పటికే ఇండియా(India), శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, ఒమన్, ఖతార్, మాల్దీవ్స్ ,భూటాన్, యూఏఈ దేశాలలో జాకీ ఉత్పత్తులను అమ్ముతూ ప్రముఖ గార్మెంట్స్ తయారీ సంస్థగా ఎదిగిందనీ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గణేశ్ తెలిపారు. తమ కంపెనీ ఉత్పత్తుల తయారీ కోసం తెలంగాణను గమ్యస్థానంగా ఎంచుకున్నామన్నారు. తెలంగాణ(Telangana)లో ఉన్న వ్యాపార అనుకూల వాతావరణమే ఇందుకు ప్రధాన కారణమని చెప్పారు. భారతదేశంలో మరింత పెద్ద ఎత్తున వ్యాపారాన్ని విస్తరించేందుకు భౌగోళికంగా అత్యంత అనుకూలమైన ప్రాంతంగా ఉందన్నారు. తెలంగాణ నుంచి తయారయ్యే జాకీ ఉత్పత్తులతో పాటు తమకు లైసెన్స్ ఉన్న స్పీడో బ్రాండ్ ఉత్పత్తులను భారతదేశంతో పాటు ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తామన్నారు. తమ పెట్టుబడి ప్రణాళికల కోసం తెలంగాణ ప్రభుత్వం సహకరించిందని ధన్యవాదాలు చెప్పారు.

జాకీ ఉత్పత్తుల తయారీ సంస్థ పేజ్ ఇండస్ట్రీస్ తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కంపెనీ ప్రతినిధి బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో కంపెనీ మరింతగా అభివృద్ధి చెందుతుని ఆశాభావం వ్యక్తం చేశారు. పేజ్ ఇండస్ట్రీస్ పెడుతున్న 290 కోట్ల రూపాయల పెట్టుబడితో సుమారు 7000 మంది స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేటీఆర్ అన్నారు.

IPL_Entry_Point