తెలంగాణలో జపాన్‌ సంస్థ భారీ పెట్టుబడులు.. ఫ్యూచర్‌ సిటీలో ఇండస్ట్రీయల్ పార్క్‌ ఏర్పాటు చేయనున్న మారుబెనీ కంపెనీ-japanese company makes huge investments in telangana marubeni company to set up industrial park in future city ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  తెలంగాణలో జపాన్‌ సంస్థ భారీ పెట్టుబడులు.. ఫ్యూచర్‌ సిటీలో ఇండస్ట్రీయల్ పార్క్‌ ఏర్పాటు చేయనున్న మారుబెనీ కంపెనీ

తెలంగాణలో జపాన్‌ సంస్థ భారీ పెట్టుబడులు.. ఫ్యూచర్‌ సిటీలో ఇండస్ట్రీయల్ పార్క్‌ ఏర్పాటు చేయనున్న మారుబెనీ కంపెనీ

Sarath Chandra.B HT Telugu

తెలంగాణకు పెట్టుబడుల్ని ఆకర్షించే లక్ష్యంతో విదేశీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బృందం తొలిరోజే కీలక ఒప్పందం చేసుకుంది. జపాన్‌ దిగ్గజ వాణిజ్య సంస్థ మారుబెనీ కంపెనీ పెట్టుబడులు పెట్టడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది..

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన జపాన్ మారుబెనీ సంస్థ

సీఎం రేవంత్‌ రెడ్డి బృందం జపాన్ పర్యటనలో తొలి రోజునే కీలకమైన పెట్టుబడుల ఒప్పందం కుదిరింది. జపాన్ కు చెందిన వ్యాపార దిగ్గజం మారుబెనీ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది.

హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్స్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్‌ ఏర్పాటు చేసేందుకు మారుబేని కంపెనీ సంసిద్ధత తెలిపింది. టోక్యోలో ఆ కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు, పెట్టుబడులపై చర్చించారు.

దాదాపు రూ. 1,000 కోట్ల ప్రారంభ పెట్టుబడితో మారుబెనీ కంపెనీ ఈ ప్రాజెక్టు చేపడుతుంది. దశల వారీగా ఫ్యూచర్ సిటీలో 600 ఎకరాల్లో ప్రపంచ స్థాయి, నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేసుకుంది. అందుకు సంబంధించిన లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై ముఖ్యమంత్రి సమక్షంలో ప్రభుత్వ అధికారులు, కంపెనీ ప్రతినిధులు సంతకాలు చేశారు.

రూ.50వేల కోట్ల పెట్టుబడులు..

జపాన్ కంపెనీలతో పాటు ఇతర మల్టీ నేషనల్ కంపెనీలు హైదరాబాద్‌లో తమ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు వీలుగా ఈ ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి చేస్తారు. దీంతో దాదాపు రూ. 5,000 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించే అంచనాలున్నాయి.

మారుబేని ఇండస్ట్రియల్ పార్క్ ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఫార్మా, ప్రెసిషన్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ రంగాలపై దృష్టి పెడుతుంది. అధునాతన తయారీ రంగాల్లో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు నైపుణ్యం కలిగిన ఉపాధి అవకాశాలను సృష్టించాలనే తెలంగాణ లక్ష్యాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టు చేపడుతారు.

చర్చల సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌లో కొత్తగా అభివృద్ధి చేస్తున్న ఫ్యూచర్ సిటీకి మారుబేనికి స్వాగతం పలికారు. ఫ్యూచర్ సిటీలో అభివృద్ధి చేసే మొట్టమొదటి పార్కు ఇదేనని అన్నారు. దీంతో తెలంగాణలో దాదాపు 30 వేల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తాయని, జీవనోపాధి మెరుగుపడుతుందని అన్నారు.

పెట్టుబడులకు తెలంగాణలో భరోసా…

తెలంగాణలో వ్యాపారానికి అనువైన అవకాశాలున్నాయని మారుబేనికి ప్రభుత్వం తరఫున తగినంత మద్దతు ఉంటుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. దేశంలోనే మొట్టమొదటి నెట్ జీరో సిటీగా ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చెందుతుందని, అందులో మారుబేని పెట్టుబడులకు ముందుకురావటం సంతోషంగా ఉందన్నారు. భారత దేశంతో జపాన్ కు ఉన్న స్నేహ సంబంధాల దృష్ట్యా పెట్టుబడిదారులు తెలంగాణను తమ స్వస్థలంగానే భావిస్తారని ముఖ్యమంత్రి మాటిచ్చారు.

తెలంగాణ, హైదరాబాద్ ను అభివృద్ధి చేసేందుకు ముఖమంత్రి రేవంత్ రెడ్డి ఎంచుకున్న దార్శనికతకు మారుబేని నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దై సకాకురా అభినందించారు. తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి ప్రదర్శించారు. అక్కడున్న అవకాశాలను వినియోగించుకునేందుకు ముందువరుసలో ఉంటామని అన్నారు.

మారుబేని కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 65 దేశాలలో 410 కి పైగా గ్రూప్ కంపెనీల ద్వారా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆహారం, వ్యవసాయ ఉత్పత్తులు, లోహాలు, గనులు, ఇంధనం, విద్యుత్తు, కెమికల్స్, మౌలిక సదుపాయాలు, ఫైనాన్స్ లీజింగ్, రియల్ ఎస్టేట్, ఏరోస్పేస్ మరియు మొబిలిటీ రంగాలలో ఈ కంపెనీ అగ్రగామిగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50,000 మందికి పైగా ఉద్యోగులను నియమించుకుంది.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం