Jagtial Crime : జగిత్యాలలో గజదొంగ అరెస్ట్ - రూ.25 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం-jagtial police arrested inter district thief ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Jagtial Crime : జగిత్యాలలో గజదొంగ అరెస్ట్ - రూ.25 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం

Jagtial Crime : జగిత్యాలలో గజదొంగ అరెస్ట్ - రూ.25 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం

HT Telugu Desk HT Telugu

జగిత్యాల పోలీసులు గజదొంగను అరెస్టు చేశారు. అతని నుంచి 25 లక్షల రూపాయల విలువ చేసే 286 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే పలుమార్లు జైలుకు వెళ్ళి వచ్చినా… తీరు మార్చుకోని అంతర్ జిల్లా గజదొంగ ను అరెస్ట్ చేసి మరోసారి కటకటాల వెనక్కి పంపించారు.

జగిత్యాలలో గజ దొంగ అరెస్ట్

వరుస చోరీలతో పోలీసులకు సవాల్ గా మారిన అంతర్ జిల్లా గజ దొంగను జగిత్యాల పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 286 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ వెల్లడించారు.

జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాజారం గ్రామానికి చెందిన బక్కశెట్టి కొమరయ్య అలియాస్ రేగుల అజయ్ కుమార్ మంచిర్యాలలో నివాసం ఉంటున్నాడు. చోరీలే వృత్తిగా మార్చుకున్నాడు. చిన్నప్పటి నుంచే చోరీల అలవాటు ఉన్న అజయ్ గత జరివరి నుంచి మార్చి మాసాంతం వరకు ఒక జగిత్యాలలోనే 8 చోరీలకు పాల్పడి పోలీసులకు సవాల్ గా మారాడు. వరుస చోరీలతో పోలీసులు నిఘా పెట్టి తనిఖీలు చెపట్టగా అజయ్ పట్టుపడ్డాడని ఎస్పీ తెలిపారు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల ఆదరణ సరిగా లేకపోవడంతోనే అజయ్ దొంగగా మారాడని స్పష్టం చేశారు

డెక్ నుంచి గోల్డ్ వరకు....

అజయ్ మొదటగా హైదరాబాద్ లోని కోటిలో గల కింగ్ లారీ ట్రాన్స్పోర్ట్ లో పనిచేసే వాడు. అతని యజమాని జీతం ఇవ్వడం లేదని తొలిసారిగా లారీలోని పాటలు పాడె డెక్కును దొంగతనం చేసి పోలీసు దొరికి జైలుకు వెళ్లి వచ్చాడు. మళ్లీ హైదరాబాద్ లో పలు దొంగతనాలు చేసి పట్టుబడ్డాడు. కొన్నిరోజులు చంచల్ గూడ జైలులో ఉన్నాడు.

బయటకు వచ్చిన తర్వాత దొంగతనాన్ని తన వృత్తిగా ఎంచుకొని వివిధ ప్రాంతాల్లో చోరీలు చేస్తున్నాడు. 2018-2021 వరకు వరంగల్ సెంటర్ జైల్లో కూడా ఉన్నాడు. ఇప్పటి వరకు 25 దొంగతనాలు చేసినట్లు ఎస్పీ తెలిపారు. చాకచక్యంగా గజదొంగను పట్టుకున్న పోలీసులను ఎస్పీ అభినందించి క్యాష్ రివార్డు అందజేశారు.

జాగ్రత్తలు తీసుకోండి - పోలీసుల సూచనలు

వేసవిలో దొంగతనాలు ఎక్కువ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో జాగ్రత్తుగా ఉండాలని పోలీస్ శాఖ పలు సూచనలు చేసింది. ఇంట్లో బంగారు నగలు, నగదు ఉంటే వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవడం క్షేమమని సూచించింది.

ఎక్కువ రోజులు ఊళ్లకు వెళ్లేవారు విలువైన వస్తువులను వెంట తీసుకెళ్లాలని పేర్కొంది. ఇంటి బయట నిద్రించే సమయంలో విలువైన బంగారు ఆభరణాలు లేకుండా చూసుకోవాలని తెలిపింది. ఊరు వెళ్తున్నప్పుడు పక్కింటి వారికి ఇంటి పరిసరాలను గమనించాలని చెప్పాలని సూచించింది. విలువైన వస్తువులను స్కూటర్ డిక్కీల్లో, కారులలో పెట్టడం చేయరాదని పేర్కొంది. అనుమానాస్పదంగా వీధుల్లో తిరిగే కొత్త వ్యక్తుల కదలికలపై 100 డయల్ లేదా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని కోరింది.

రిపోర్టింగ్ కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.