IT Raids In Telangana : మంత్రి జగదీశ్ రెడ్డి పీఏ ఇంట్లో ఐటీ సోదాలు
IT Raids in Telangana Minister PA House : మంత్రి జగదీశ్ రెడ్డి పీఏ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేశారు. అయితే భారీగా నగదు దొరికిందని వార్తలు వస్తున్నాయి.
మంత్రి జగదీశ్ రెడ్డి(Minister Jagadish Reddy) పీఏ ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు చేయడం చర్చనీయాంశమవుతోంది. ఈ దాడుల్లో భారీగా నగదు దొరికినట్టుగా వార్తలు వినవస్తున్నాయి. సాయంత్రం నుంచి నల్లగొండ(Nalgonda)లోని ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు(IT Officers) తనిఖీలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అధికారులు అక్కడకు చేరుకునే సమయంలో జగదీశ్ రెడ్డి పీఏ ఇంట్లో లేరు. ఆ తరువాత ఇంటికి వచ్చినట్టుగా సమాచారం.
ట్రెండింగ్ వార్తలు
అయితే పక్కా సమాచారంతోనే అధికారులు ఈ దాడులు చేపట్టినట్టుగా కనిపిస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక(Munugode Bypoll) ప్రచారం మంగళవారంతో ముగియనుంది. అనంతరం ప్రలోభాలకు తెరలేచే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ అధికారులు దాడులు చేయడంపై చర్చ నడుస్తోంది. టీఆర్ఎస్ కీలకక నేత అయిన జగదీశ్ రెడ్డి పీఏ ఇంటిపై ఐటీ దాడులు జరగడంపై ఏం జరుగుతుందోనని అందరికీ ఆసక్తి నెలకొంది.
Jagadish Reddy Comments : మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొనరాదని కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది. శనివారం సాయంత్రం ఏడు గంటల నుంచి 48 గంటల పాటు ర్యాలీలు, ప్రచారాలు, ఇంటర్వ్యూల్లో పాల్గొనరాదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.
మంత్రి జగదీశ్వర్ రెడ్డికి నోటీసులు జారీ చేసిన ఈసీ ఆయన వివరణపై సంతృప్తి చెందక పోవడంతో ఆయనపై ఆంక్షలు విధించింది. రెండ్రోజుల క్రితం మునుగోడు ఎన్నికల ప్రచారంలో జగదీష్రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు టిఆర్ఎస్కు ఓటు వేయకపోతే నిలిపివేస్తామని బెదిరించారంటూ ప్రత్యర్థులు ఈసీకి ఫిర్యాదు చేశారు. జగదీష్ రెడ్డి శనివారం మధ్యాహ్నం 3గంటల్లోపు వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. గడువులోగా కేంద్ర ఎన్నికల సంఘానికి జగదీష్ రెడ్డి వివరణ ఇచ్చారు. ఆయన వివరణ సంతృప్తికరంగా లేదని ఈసీ అభిప్రాయపడింది. 48గంటల పాటు మంత్రి జగదీశ్వర్రెడ్డి ఎలాంటి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనరాదని ఈసీ ఆదేశించింది. టీవీ డిబేట్లు, ఎన్నికల ర్యాలీలు, ఇంటర్వ్యూల్లో సైతం జగదీశ్వర్ రెడ్డి మాట్లాడకూడదని స్పష్టం చేసింది.
అక్టోబర్ 25న మునుగోడు ఎన్నికల ప్రచారం సందర్భంగా జగదీశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. “మునుగోడు ఉప ఎన్నిక ప్రభాకర్రెడ్డి-రాజాగోపాల్ రెడ్డికి మధ్య కాదని, రూ.2వేల రుపాయల పెన్షన్ కొనసాగించాలో వద్దో తేల్చుకోవాలని, రైతు బంధు పథకం కొనసాగించాలో వద్దో తేల్చుకోడానికి, 24 గంటల ఉచిత విద్యుత్ కావాలో వద్దో తేల్చుకోడానికి, వికలాంగులకు రూ.3వేల పెన్షన్లు కావాలో వద్దో తేల్చుకోడానికి జరుగుతున్నాయని, పథకాలు కోరుకునే వారు కారు గుర్తుకు ఓటు వేస్తారని చెప్పారు. మోదీ రూ.3వేల పెన్షన్లు వద్దంటున్నారని, కేసీఆర్ చెప్పారంటే చేస్తారని సంక్షేమ పథకాలు అక్కర్లేదు అనుకునే వారు మోదీకి ఓటు వేయొచ్చని సూచించారు.”